ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తారా? నా మనసు కలచివేసింది: లోకేశ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 1:27 PM IST

Nara Lokesh on Tribal Woman Murder: మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్​తో తొక్కించి చంపేస్తారా? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పల్నాడులోని మాచర్ల ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం మల్లవరం తండాలో తాగునీటిని పట్టుకునేందుకు ట్యాంకర్ వద్దకు వచ్చిన గిరిజన మహిళ సామినిబాయిని వైసీపీకి చెందిన సైకో ట్రాక్టర్​తో తొక్కించి అత్యంత కిరాతకంగా చంపేసిన ఘటన తీవ్రంగా కలచివేసిందని అన్నారు. వారం రోజులుగా గుక్కెడునీరు దొరకని పరిస్థితుల్లో రాకరాక వచ్చిన ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకోవడానికి వెళ్లిన గిరిజన మహిళలను మీరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, నీళ్లు పట్టు కోవడానికి వీల్లేదని వైసీపీ సైకో బెదిరించారని మండిపడ్డారు. 

తాగునీటికి పార్టీలకు సంబంధమేంటని ప్రశ్నించడమే సామినీబాయి చేసిన నేరమా? అని లోకేశ్​ ప్రశ్నించారు. మాచర్లలో జరుగుతున్న వరుస ఘటనలు చూశాక మనం ఉన్నది ప్రజాస్వామ్యంలోనా, రాతియుగంలోనా అన్న అనుమానం కలుగుతోందన్నారు. వైసీపీకి చెందిన సైకో ఊరంతా చూస్తుండగా స్వైరవిహారంచేస్తూ 3 సార్లు ట్రాక్టర్ తో తొక్కించి సామినిబాయిని చంపేస్తే డ్రైవింగ్ రాకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని కేసుకట్టడం పతనమైన పోలీసు వ్యవస్థకు పరాకాష్ట కాదా అని దుయ్యబట్టారు. కంచే చేనుమేసిన చందంగా కొంతమంది పోలీసులు అరాచకశక్తులతో ఏకమైతే సామాన్య ప్రజలకు దిక్కెవరని నారా లోకేశ్​ ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details