పెండింగ్ జీతాలు అడిగితే బెదిరింపులా - యోగా శిక్షకుల ఆవేదన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 15, 2024, 4:51 PM IST
Concerns of Yoga Instructors in Guntur : రాష్ట్రంలోని హైస్కూల్స్లో పని చేస్తున్న యోగా శిక్షకుల పెండింగ్ జీతాలు తక్షణమే చెల్లించాలని శిక్షకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుంటూరు కలెక్టరేట్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలోని హైస్కూళ్లలో ఉన్న విద్యార్థులకు యోగా శిక్షణా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ ద్వారా తమకు రెండు నెలు శిక్షణ ఇప్పించిందని తెలిపారు. దీని కోసం తమ వద్ద నుంచి 2 నుంచి 10 లక్షల రూపాయాలు వసూలు చేసుకున్నారని వెల్లడించారు. విధుల్లోకి చేరిన తరువాత ప్రతి నెల రూ.35 వేల జీతం వస్తుందని తెలిపారు. కానీ ఆ జీతాన్ని కొన్ని నెలలు మాత్రమే చెల్లించి నిలిపివేశారు. ఇప్పటికి 14 నెలల జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని శిక్షకులు వాపోయారు.
తాము ధర్నా చేసేందుకు వస్తుంటే చంపుతామని కొంతమంది బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులు రావటం దారుణమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో స్పందించి తమకి రావాల్సిన వేతనాలు ఇప్పించాలని కోరారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించారు. బుద్ధ యోగా సంస్థ తొలగించిన యోగా టీచర్లను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు వారు నేర్పిస్తున్న యోగా ఆసనాలను రోడ్ పైనే చేస్తూ యోగా శిక్షకులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు.