ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శంకుస్థాపనలు సరే పూర్తిచేసేది ఎప్పుడు - ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 7:30 AM IST

Updated : Feb 8, 2024, 8:47 AM IST

YCP Government Neglects Hospitals: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలను గత ప్రభుత్వం వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా స్థాయిని పెంచింది. కోట్లాది రూపాయల వ్యయంతో నూతన భవనాల నిర్మాణాలను ప్రారంభించింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పనులన్నీ గాలికొదిలేసింది. నాలుగేళ్లయినా కొత్త భవనాల నిర్మాణాలు పూర్తి కాలేదు. ఫలితంగా సరైన వైద్యం అందక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

ycp_government_neglects_hospitals
ycp_government_neglects_hospitals

శంకుస్థాపనలు సరే పూర్తిచేసేది ఎప్పుడు - ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా?

YCP Government Neglects Hospitals:ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 8 ప్రాంతీయ ఆసుపత్రుల స్థాయి పెంపు, కొత్త భవనాల నిర్మాణానికి తెలుగుదేశం హయాంలో నిధులు మంజూరయ్యాయి. ఈ లోపు ఎన్నికలు రావడంతో పనులన్నీ నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం 2020 చివర్లో శంకుస్థాపనలు చేయగా ఎన్​సీసీ లిమిటెడ్‌ సంస్థ టెండర్లు దక్కించుకుంది. 15 నెలల్లో పనులు పూర్తికావాలని అప్పట్లో ఉన్నతాధికారులు ఆదేశించారు. అంటే 2022 జనవరి నాటికే కొత్త భవనాలు అందుబాటులోకి రావాలి, కానీ పలుచోట్ల నేటికీ పనులు కొనసాగుతున్నాయి.

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులతో ప్రభుత్వం చర్చలు విఫలం- సేవలు నిలిపివేత

గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లి, దత్తిరాజేరు, గంట్యాడ మండలాలతో పాటు, సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ ప్రాంతం నుంచి రోగులు ఎక్కువగా గజపతి నగరం ఆసుపత్రికి వస్తారు. అంతేకాదు జాతీయ రహదారి పక్కనే ఉండటంతో రోడ్డు ప్రమాద బాధితులు అత్యవసర ప్రథమ చికిత్సకు ఈ ఆసుపత్రినే ఆశ్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో 50పడకలతో సామాజిక ఆరోగ్య కేంద్రంగా ఉన్న ఈ ఆసుపత్రిని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా స్థాయిని పెంచారు. 17కోట్ల రూపాయలతో అదనపు భవనాల నిర్మాణానికీ శ్రీకారం చుట్టారు. 2022 జనవరికి నాటికి పూర్తి కావాల్సిన భవనాల పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎప్పటికి పూర్తిచేస్తారో గుత్తేదారుతో పాటూ అధికారులు చెప్పలేకపోతున్నారు.

ఆసుపత్రిలో బెడ్లు లేవని రోగిని బయటకు పంపిన వైద్యులు - రాత్రంతా చలిలో ఉండి మృతి

పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు సామాజిక ఆరోగ్య కేద్రం, సాలూరు. పాచిపెంట, మక్కువ, రామభద్రపురంతో పాటూ సరిహద్దులోని ఒడిశా ప్రజలకు సైతం అత్యవసర వైద్యం అందిస్తోంది. భవన నిర్మాణాలకు పునాది రాయి వేసి మూడేళ్లు పూర్తైనా పనులు మాత్రం పూర్తి కాలేదు. దీంతో గదులు లేక రోగులకు ఆరుబయట, పీపీ యూనిట్ ముందు, రేకుల షెడ్లలో మంచాలు వేసి వైద్యం అందిస్తున్నారు. ఎక్స్ రే, స్కానింగ్ ఇతర పరీక్షల సేవలూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో అత్యవసర వైద్యం కోసం విజయనగరం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు చెబుతున్నారు.

అంతు చిక్కని వ్యాధి - నాలుగు నెలల్లో 16మంది శిశువులు మృత్యువాత

విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట ఆసుపత్రికి ఎస్.కోట, లక్కవరపుకోట, వేపాడ, కొత్తవలస, జామి, గంట్యాడ మండలాలతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అరకు, అనంతగిరి, దుంబ్రిగూడ మండలాల గిరిజనులు ఎక్కువగా వస్తారు. అరకు పర్యాటక ప్రాంతానికి ముఖద్వారంగా ఉండటంతో విశాఖ-అరకు రోడ్డులో జరిగే రోడ్డు ప్రమాద బాధితులు అత్యవసర ప్రథమ చికిత్సకు ఈ ఆసుపత్రినే ఆశ్రయిస్తుంటారు. వంద పడకల సౌకర్యం కల్పించేందుకు 12కోట్ల 60లక్షల రూపాయలతో అదనపు భవనాల నిర్మాణానికీ శ్రీకారం చుట్టారు. బిల్లులు సక్రమంగా అందక భూమి పూజ సమయం నుంచి ఇంతవరకు నలుగురు గుత్తేదారులు మారారు. భవనాల కొరత కారణంగా ఒకే గదిలో వైద్య పరీక్షలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బాధలు అర్థం చేసుకుని ఆసుపత్రి భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

Last Updated : Feb 8, 2024, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details