ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఆంధ్రా గడ్డపై ఆపదలో 'ఆమె'- మహిళల్ని మళ్లీ ఓటడిగెదెలా జగనన్నా!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 18, 2024, 1:08 PM IST

Womens Votes to YSRCP: ఇచ్చిన హామీలన్నీ మరిచిపోయారు. అడిగిన వారిని అణచివేస్తున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే పోలీసులను ఉసిగొల్పి కేసులు పెడుతున్నారు. సొంత ఇంటిసభ్యులతోనే సంబంధాలు లేదని చెప్పున్నా జగనన్న అక్కచెల్లెమ్మలను ఓటు అడుగుతున్నారు.

women_votes_to_cm_jagan
women_votes_to_cm_jagan

Womens Votes to YSRCP: మద్య నిషేధం మరిచిపోయారు. అంగన్‌వాడీలను అణచిచేశారు. ధరలు పెంచి దరువేశారు. అమరావతి మహిళలను అవమానించారు. మహిళలపై నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపారు. వేలమంది యువతుల అదృశ్యంపై మౌనముద్ర దాల్చారు. భర్తలు తాగుడికి, బిడ్డలు గంజాయికి బానిసలుగా మారుతుంటే రోదిస్తున్న మహిళలకు విషాదాన్ని మిగిల్చారు. ఇళ్లు ఇస్తానని చెప్పి ఈసురోమనిపించారు. అయినా సరే అక్కచెల్లెమ్మలు మళ్లీ తనకే ఓటేయాలని జగన్‌ అంటున్నారు.

సొంత చెల్లెల్లే నమ్మని ముఖ్యమంత్రి జగన్‌ను రాష్ట్రంలోని మహిళలు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా. వైఎస్సార్​సీపీకి ఓటు ఎందుకు వేయాలి. ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టగా, ఈ చర్చ కార్యక్రమంలో మహిళా మోర్చా నేత యామినీశర్మ, సామాజిక ఉద్యమకారిణి వెంకటలక్ష్మి పాల్గొన్నారు. సిద్ధం అంటూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ను నమ్మి, మరోసారి ఓటు వేయటానికి మహిళలు సిద్ధంగా ఉన్నారా అనే చర్ఛించారు. మద్యాన్ని పూర్తిగా నిషేధించాకే ఓట్లు అడుగుతాం అని చెప్పారు. కానీ చౌక మద్యాన్ని అమ్ముతున్నారు. ఆ డబ్బు లెక్కల్లోకి రాకుండా కేవలం నగదు మాత్రమే తీసుకుంటున్నారు. దీనిపై మహిళలు ఏం అనుకుంటున్నారనే అంశంపై చర్చించారు.

రాష్ట్రంలో ఇసుక దొంగలపై జగన్​ సర్కారు సమాధానమెంటీ

మహిళలపై నేరాల్లో ఏపీ మొదటిస్థానంలో ఉందని నేషనల్ క్రైమ్‌ బ్యూరో రికార్డ్స్‌ నివేదికలు వచ్చాయి. మహిళల అదృశ్యంపై చాలా ఆందోళన నెలకొంది. దీనిపై ప్రజల్లో ఉన్న భయాలను తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేసిందా. తమ అన్న ఎలాంటి వాడో జగన్ సొంత చెల్లెళ్లు షర్మిలా, సునీత బహిరంగంగా చెబుతున్నారు. మా ప్రాణాలకు కూడా రక్షణ లేదని వారు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏపీలో జగన్ పాలన అంత దారుణంగా ఉందా అని చర్చలో లేవనెత్తారు.

ఎన్నడూ గడప దాటి బయటకు రాని అమరావతి మహిళా రైతులను వైఎస్సార్​సీపీ వాళ్లు సామాజిక మాధ్యమాల్లో ఎంత దుర్భాషలాడారో చూశాం. అలాగే వారి పాదయాత్రపై పోలీసుల దాడిని మరిచిపోలేము. ఇవన్నీ సాటి మహిళాలోకంలో ఎలాంటి అభిప్రాయాన్ని కలిగిస్తాయని చర్చించారు. వైఎస్సార్​సీపీ నాయకులు తన స్థలాన్ని అమ్ముకోనీయకుండా బెదిరిస్తున్నారని సీఎం కార్యాలయం ఎదుట ఆరుద్ర అనే మహిళ చేయి కోసుకుంది. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన రంగనాయకమ్మ గారిని కేసులతో వేధించారు. అసలీ వైఎస్సార్​సీపీ ప్రభుత్వాన్ని మహిళలు ఎందుకు నమ్మాలి.

జగన్ సొంత డబ్బులతో వాలంటీర్లకు జీతం - వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

మహిళల భద్రతకు దిశ చట్టం తెచ్చాం అన్నారు. ఏమైంది ఆ చట్టం. మహిళలపై నేరాల్లో మొదటి స్థానంలో ఉన్న ఈ రాష్ట్రంలో పటిష్టమైన చట్టం లేకపోతే ఎలా. జగన్ సభలకు రాకుంటే రుణమాఫీ రాదు, కొత్త రుణాలు రావంటూ డ్వాక్రా సంఘాల మహిళలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్టు తరచు వార్తలు వస్తున్నాయి. సభ పూర్తయ్యేదాకా బయటకి వెళ్లకుండా పోలీసులతో మూడంచెల బారికేడ్లు పెట్టి కట్టడి చేస్తున్నా, సీఎం సభల నుంచి మహిళలు మధ్యలోనే ఎందుకు జారుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details