ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే రూ.20కోట్లు ఇస్తామన్నారు: దస్తగిరి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 8:54 AM IST

Updated : Mar 15, 2024, 10:07 AM IST

Dastagiri Petition in Telangana High Court to Cancel Avinash Reddy Bail: వివేకా హత్య కేసులో నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి బెయిలును రద్దు చేయాలని కోరుతూ అప్రూవర్‌ దస్తగిరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేయరాదన్న బెయిలు షరతును అవినాష్‌రెడ్డి ఉల్లంఘించారని ఆరోపించారు. సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే 20కోట్ల రూపాయలతో పాటు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలిస్తామన్నట్లు దస్తగిరి సంచనల వ్యాఖ్యలు చేశారు. ఒప్పుకోకపోతే తనతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించిట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

dastagiri_petition
dastagiri_petition

సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే రూ.20కోట్ల ఇస్తామన్నారు: దస్తగిరి

Dastagiri Petition in Telangana High Court to Cancel Avinash Reddy Bail:మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో 8వ నిందితుడైన ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ ఇదే కేసులో నాలుగో నిందితుడు, అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేయరాదన్న బెయిలు షరతును ఉల్లంఘించిన అవినాష్‌ రెడ్డి బెయిలును రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. కడప జిల్లా పులివెందుల మండలం నామాలగుండు గ్రామంలో తన తండ్రిపై ఈ నెల 8న రాత్రి అవినాష్ రెడ్డి అనుచరులు ముగ్గురు హత్యాయత్నం చేశారన్నారు. ఈ దాడిలో తన తండ్రి తీవ్రంగా గాయపడ్డారన్నారు.

సీబీఐ రక్షణ కేసులో సాక్షిగా ఉన్న తనకు మాత్రమే ఉంటుందని, కుటుంబానికి కాదని దస్తగిరి పేర్కొన్నారు. తన తండ్రిపై హత్యాయత్నం ద్వారా తనను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. వేరే నేరంలో జైలులో ఉన్నప్పుడు అవినాష్ అనుచరులు తనను హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. తరువాత బెయిలుపై విడుదలయ్యాక సీబీఐ రక్షణ కల్పించడంతో తనను బెదిరించడం సాధ్యం కాక కుటుంబసభ్యులపై దాడికి దిగి తనను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. తన సాక్ష్యం లేకుండా కీలకమైన ఈ కేసును రుజువు చేయడం కష్టమవుతుందన్నారు.

దస్తగిరి తండ్రిపై వైఎస్సార్సీపీ నేతల దాడి: సీఎం జగన్‌పై పోటీ చేసేంత ధైర్యం దస్తగిరికి ఉందా?

ఇతర కేసుల్లో తాను కడప కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి జైలు సూపరింటెండెంట్‌ను ప్రభావితం చేసి నవంబరు 28న మెడికల్ క్యాంపయిన్ పేరుతో జైల్లోకి వచ్చారని దస్తగిరి తెలిపారు. 20 కోట్లతో నేరుగా ఎస్ఎస్ఆర్ వద్దకు వచ్చి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తనను కలిశారన్నారు. ఇక్కడికి తనంతట తానే వచ్చానని అవినాష్‌ రెడ్డి, సీఎం జగన్‌, వైఎస్ భారతి రెడ్డిలు తమ పక్కన ఉన్నారని వారి కోసం తాము ఎవర్నయినా ఏం చేయడానికైనా సిద్ధమని చైతన్యరెడ్డి హెచ్చరించినట్లు వెల్లడించారు.

వివేకా హత్య కేసులో సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే తమ కుటుంబాన్ని, పిల్లలను అవినాష్ రెడ్డి, సీఎం జగన్‌ చూసుకుంటారని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారని చెప్పారు. కావాలంటే ఫోన్లో అవినాష్, జగన్‌లతో మాట్లాడిస్తానని చెప్పారన్నారు. ఇదే కేసులో అరెస్టయి వైఎస్ భాస్కరరెడ్డి ఆరోగ్యం దెబ్బతిందని, ఆయనకు ఏమైనా జరిగితే తనతో పాటు తన కుటుంబం అంతు చూస్తానంటూ చైతన్యరెడ్డి బెదిరించారని వెల్లడించారు. మౌనంగా చెప్పింది చేస్తే తన కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించడంతో పాటు అన్నీ చూసుకుంటామని ఆశచూపారని పిటిషన్‌లో దస్తగిరి పేర్కొన్నారు.

వివేకా హత్య కేసులో నిందితుడిని కాదు - సాక్షిని మాత్రమే: దస్తగిరి

దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేస్తారని ముందుగానే ఊహించిన అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ దాఖలు చేశారని దస్తగిరి అన్నారు. కేసులోని తీవ్రతను, అవినాష్‌రెడ్డి పాత్రపై సీబీఐ సమర్పించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుండా గత ఏడాది మే 31న సింగిల్ జడ్జి షరతులతో బెయిలు మంజూరు చేశారన్నారు. ప్రస్తుతం బెయిలు షరతులను ఉల్లంఘించినందున అవినాష్‌రెడ్డి బెయిలును రద్దు చేయాలని దస్తగిరి కోరారు. ప్రతివాదులుగా అవినాష్‌రెడ్డితో పాటు సీబీఐ, నర్రెడ్డి సునీతలను పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రవణ్ వాదనలు వినిపించనున్నారు.

దస్తగిరికి బెయిలు ఇవ్వొద్దన్న పోలీసులు - చంపేందుకు కుట్రలు పన్నుతున్నారన్న షబానా

Last Updated :Mar 15, 2024, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details