ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విరాళాల కోసం వెబ్‌సైట్‌ను ప్రారంభించిన చంద్రబాబు - తొలి చందా ఎంతంటే? - chandrababu launched tdp website

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 9:31 PM IST

Chandrababu Launched TDP Donation Website: వైసీపీకి ఓటమిపై స్పష్టత రావడంతోనే సిట్ కార్యాలయంలో పత్రాలు తగులపెట్టించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి విరాళాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఆయన, తొలి చందాగా 99 వేల 999 రూపాయలను పార్టీకి అందజేశారు. రాష్ట్రంలో ప్రతి వర్గం నష్టపోతే, జగన్ ఒక్కడే బాగుపడ్డాడని చంద్రబాబు ధ్వజమెత్తారు.

chandrababu_launched_tdp_donation_website
chandrababu_launched_tdp_donation_website

Chandrababu Launched TDP Donation Website: తెలుగుదేశం పార్టీ విరాళాల వెబ్‌సైట్‌ను అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్​లో లాంఛనంగా ప్రారంభించారు. https://tdpforandhra.com వెబ్‌సైట్‌ని ఈ మేరకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు విరాళాలు ఇవ్వాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పార్టీకి ప్రకటించిన అభ్యర్ధులకు సంబంధించి ఎక్కడైనా ఒకట్రెండు చోట్ల తప్పదనుకుంటే పరస్పర అంగీకరంతో మార్పు ఉండొచ్చని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరుల దగ్గర్నుంచే తాము విరాళాలు సేకరిస్తుంటే, వైసీపీ గ్యాంబ్లర్ల నుంచి విరాళాలు సేకరిస్తోందని మండిపడ్డారు. ఆన్​లైన్ గ్యాంబ్లింగ్​కు అనుమతించే దిశగా వైసీపీ చర్యలున్నాయని ఆరోపించారు.

ఎన్ఆర్ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వటంతో పాటు, ఏపీకి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 10 రూపాయలు మొదలుకుని ఎంత మొత్తంలోనైనా విరాళాలు ఇవ్వొచ్చని స్పష్టంచేశారు. ప్రజల్లో తెలుగుదేశం ఓ భాగమని వెల్లడించారు. ఎలక్ట్రోరల్ బాండ్లు ఉండొచ్చు కానీ పారదర్శకంగా ఉండాలని చంద్రబాబు కోరారు. ఏదైనా డిజిటల్ పేమెంట్ల ద్వారా చట్టబద్దంగా చేయొచ్చని అన్నారు. డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వస్తే రాజకీయ అవినీతి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

దేశం సరైన దిశలో వెళ్తోంటే, ఏపీ రివర్సులో వెళ్తోందని ధ్వజమెత్తారు. జనంలో ఇప్పటి వరకు చూడని అసహనం కన్పిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం రంగులు కొట్టడానికి ఇచ్చిన ప్రాధాన్యత, నాణ్యమైన విద్యకు ఇవ్వలేదని దుయ్యబట్టారు. సోలార్ లాంటి వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా విద్యుత్ కోతలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని ఇంత దారుణంగా చేసిన వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని పిలుపునిచ్చారు.

'కూటమి మ్యానిఫెస్టోతో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు- వాలంటీర్ల వేతనం రెట్టింపు చేస్తాం' - Chandrababu in Ugadi celebration

కూటమి జెండాలు ప్రతీ ఇంటిపైనా ఎగరేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. కూటమిని ముందుండి నడపడం బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ఇప్పటివరకూ సిద్ధం సభలకు కనీసం 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్​ను ఏదో మానవతావాదిలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఐ ప్యాక్ టీం చాలా కష్టపడి జగన్​లో మానవీయ కోణం చూపించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

తాడేపల్లి ప్యాలస్​లో డబ్బులను తూచేవారు: 420లంతా కలిసి ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారని ఆక్షేపించారు. తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో ఫోన్ ట్యాపింగ్​తో పాటు, అన్ని తప్పుడు కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయని ఆరోపించారు. రానున్న రోజుల్లో ఇంకా చాలా చిత్ర విచిత్ర వేషాలేస్తారని అన్నారు. తాడేపల్లి ప్యాలస్​లో డబ్బులను మిషన్ పెట్టి కూడా తూచేవారని ఆరోపించారు.

ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఆ అవివీతి సంపదలో కొంత బయటకు తీస్తున్నారని మండిపడ్డారు. ప్రతి రోజూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటైనర్లల్లో డబ్బులు వెళ్తూనే ఉన్నాయన్నారు. బుధవారం నుంచి తాను, పవన్ కల్యాణ్​ ఇద్దరం కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రెండు సభలు పెడుతున్నామని భాజపా నేతలు కూడా పాల్గొంటారని వివరించారు.

వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయం అందుకే రౌడీమూకలకు నిద్రపట్టడం లేదు: చంద్రబాబు - Chandrababu Fire on YSRCP

ABOUT THE AUTHOR

...view details