ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జగన్‌ జమానాలో మాదకద్రవ్యాల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌! - AP become a drug state

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 7:26 AM IST

Drug destination State: నిఘా గట్టిగా ఉంటే స్మగ్లర్లు తోకముడుస్తారు.! అదే నిఘా వ్యవస్థలు కళ్లు మూసుకుంటే, వ్యవస్థీకృత నేరాలకు తెగిస్తారు.! అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాకూ రాష్ట్రంలో అలాంటి అవకాశాలే అనువుగా మారాయి.! గతంలో విజయవాడ చిరునామాతో హెరాయిన్‌ పట్టుబడినా, ఇప్పుడు విశాఖ పోర్టుకు నిషేధిత మత్తుపదార్థాలు భారీగా తరలించినా, ఏపీలో నిఘా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు పట్టించుకోవనే ధీమానే కనిపిస్తున్న నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Drug destination State
Drug destination State

జగన్‌ జమానాలో మాదకద్రవ్యాల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌!

Drug destination State: జగన్‌ జమానాలో ఆంధ్రప్రదేశ్‌ అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలకు గమ్యస్థానంగా మారిపోయింది. విదేశాల నుంచి కంటెయినర్లలో, టన్నుల కొద్దీ నిషేధిత మత్తు పదార్థాలు, నేరుగా రాష్ట్రంలోకి దిగుమతి అయిపోతున్నాయి. ఇతర పదార్థాల్లో ఈ మాదకద్రవ్యాల్ని కలిపి ఇక్కడికి తెస్తున్నారు. వాటినిప్రాసెస్‌ చేసి మాదకద్రవ్యాల్ని వెలికితీసి మార్కెట్‌లోకి పంపుతున్నారు. రూ.లక్షల కోట్ల విలువైన ఈ వ్యవస్థీకృత అక్రమ దందా జగన్‌ జమానాలో ఉద్ధృతంగా సాగిపోతోంది. ఏపీలోకి సరకు తరలిస్తే, నిఘా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు తమను పట్టించుకోవనే ధీమాతో స్మగ్లర్లు చెలరేగుతున్నారు.

వ్యూహాత్మకంగానే విశాఖ పోర్టు ఎంపిక: మాదకద్రవ్యాల దిగుమతికి విశాఖ పోర్టును ఎంచుకోవడమూ, స్మగ్లర వ్యూహాత్మకమే అనిపిస్తోంది. విశాఖ పోర్టులో నౌకల్లోకి ఎక్కించే కంటెయినర్లలో కొన్నింటిని మాత్రమే ర్యాండమ్‌గా తనిఖీ చేస్తారు. అనుమానం వస్తేనే, మొత్తం తనిఖీ చేస్తారు. స్కానింగ్‌ సైతం ఇటీవలే మొదలుపెట్టారు. అంతకుముందు అదీ లేదు. ఈ కారణాలతోనే, విశాఖ పోర్టును కొందరు అక్రమార్కులు ఎగుమతి, దిగుమతులకు ఎంచుకుంటున్నట్లు సమాచారం. ఇదే భావనతో మాదకద్రవ్యాలు కలిగిన 25వేల కిలోల డ్రై ఈస్ట్‌ పొడిని, ధైర్యంగా పంపారని భావిస్తున్నారు. ఆర్డర్‌ బుక్‌ చేయడం ఇదే మొదటిసారి అని సంధ్య ఆక్వా ప్రతినిధులు చెబుతున్నప్పటికీ, యూరోపియన్‌ దేశాల నుంచి కొంతకాలంగా విశాఖకు డ్రై ఈస్ట్‌ దిగుమతి అవుతూనే ఉంది. కొవిడ్‌కు ముందు భీమవరం పరిధిలో రొయ్యల చెరువుల కోసం డ్రై ఈస్ట్‌ దిగుమతి చేసి తీసుకెళ్లేవారని టెర్మినల్‌లో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు.

దేశ చరిత్రలోనే తొలిసారి: సంధ్యా ఆక్వా చిరునామాతో బ్రెజిల్‌ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన కంటైనర్‌లో మొత్తం 20 ప్యాలెట్లలో ఒక్కోటి 25 కిలోల పరిమాణం కలిగినవెయ్యి బస్తాల ‘ఇన్‌యాక్టివ్‌ డ్రైడ్‌ ఈస్ట్‌ ఉంది. ఒక్కో ప్యాకెట్‌ నుంచి, ఒక్కోటి చొప్పున ర్యాండమ్‌గా మొత్తం 20 బస్తాలను సీబీఐ అధికారులు పరీక్షించగా అన్నింటిలోనూ కొకైన్, మెథక్వలోన్, మార్ఫిన్, హెరాయిన్, యాంఫిటమిన్, మెస్కలిన్‌ వంటి మాదకద్రవ్యాలు ఉన్నట్లు తేలింది. ఈ లెక్కన 25 వేల కిలోల ‘డ్రైడ్‌ ఈస్ట్‌’లోనూ మాదకద్రవ్యాలు ఉన్నట్లే. సగటున కిలో డ్రైడ్‌ ఈస్ట్‌లో 200 గ్రాముల మాదకద్రవ్యాలు కలిసి ఉంటాయనుకున్నా దాదాపు 5వేల కిలోల మత్తు పదార్థాలు ఏపీలోకి వచ్చినట్లు అనధికారిక అంచనా. బహుశా, దేశ చరిత్రలోనే ఇంత భారీ మొత్తం మాదకద్రవ్యాలు పట్టుబడటం ఇదే తొలిసారి. ప్రస్తుతం భారతదేశ మార్కెట్‌లో కిలో హెరాయిన్‌ 8 కోట్లు, కొకైన్‌ 10 లక్షల రూపాయలు పలుకుతోంది. ఆ లెక్కన బ్రెజిల్‌ నుంచి విశాఖ వచ్చిన కంటైనర్లలోని మాదకద్రవ్యాల విలువ వేల కోట్ల రూపాయలపైనే.

విశాఖ డ్రగ్స్​ కేసులో వైసీపీ నేతల పాత్ర ఏంటి - కంటైనర్​ తెరవకుండా యత్నించారా? - YCP LEADERS IN VIZAG DRUGS CASE

విజయవాడలోని ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ చిరునామాతో అఫ్గానిస్థాన్‌ నుంచి సెమీ ప్రాసెస్డ్‌ టాల్కమ్‌ స్టోన్స్‌ ముసుగులో వస్తున్న 2,988కిలోల హెరాయిన్‌ను గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో 2021 సెప్టెంబర్‌లో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. దాని విలువ రూ.25 వేల కోట్లకుపైనే ఉంటుందని తేల్చారు. విజయవాడలోని సత్యనారాయణపురం గడియారం వారి వీధిలో మాచవరం సుధాకర్‌ ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని రిజిస్టర్‌ చేశారు. ఇది ఆయన భార్య దుర్గా పూర్ణిమా వైశాలి పుట్టిల్లు. ముంద్రా పోర్టులో ఈ కంటెయినర్‌ పట్టుబడటంతో ఈ డ్రగ్స్‌ దందా బయటపడింది. లేదంటే ఆ వేల కోట్ల హెరాయిన్‌ ఏదో రూపంలో విజయవాడకు చేరేదే.

బ్రెజిల్, అఫ్గానిస్థాన్‌ వంటి దేశాల నుంచి ఏపీలోకి మాదకద్రవ్యాలను అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాల ప్రమేయం లేకుండా తరలించటం అసాధ్యం. అయితే వారు మాదకద్రవ్యాల దిగుమతికి, ఆంధ్రప్రదేశ్‌నే ఎందుకు కార్యక్షేత్రంగా మలుచుకున్నారు? ఇక్కడ వారికి ఎవరి అండదండలున్నాయి? ఏపీని వారి స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు సురక్షిత స్థావరంగా భావిస్తున్నారా? ఈ వ్యవస్థీకృత దందా వెనక రాష్ట్రంలో ఎవరి ప్రమేయం ఉంది? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే నిఘా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు ఎందుకు వీటిని గుర్తించట్లేదు? ఎందుకు పట్టుకోవట్లేదు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. బ్రెజిల్‌ నుంచి వచ్చిన మాదకద్రవ్యాలు. వైఎస్సార్సీపీ నాయకుడికి చెందిన కంపెనీ పేరిట ఏపీలోకి తెచ్చారు. వాటి వెనక అధికార పార్టీ పెద్దలు, నాయకుల ప్రమేయంపై సీబీఐ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

విశాఖ డ్రగ్స్​ కేసులో వైసీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి టీడీపీ ఫిర్యాదు- ప్రతిపక్షంపై విచారణ జరపాలన్న అధికార పార్టీ నేతలు - Visakha Drugs Case

ABOUT THE AUTHOR

...view details