Kodi Kathi Srinu bail plea:కోడి కత్తి శ్రీను బెయిల్పై అత్యవసరంగా విచారణ జరపాలని హైకోర్టులో లాయర్లు పిచ్చుక శ్రీనువాసు, పాలేటి మహేష్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. శ్రీను ప్రస్తుతం జైళ్లో అమరణ నిరహార దీక్ష చేస్తున్నాడని, ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని న్యాయవాదులు పిటిషన్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గత ఐదేళ్లుగా కారాగారంలో మగ్గుతున్నాడని, న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఎన్ఐఏ తరపు న్యాయవాది రేపటికి సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు. ఎన్ఐఏ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఐదేళ్లైనా తెగని కేసు - న్యాయం కోసం జైల్లోనే నిందితుడి దీక్ష, తల్లి, సోదరుడు సైతం
హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి: మరో వైపు తనకు సీఎం జగన్ న్యాయం చేయాలంటూ, కోడి కత్తి శ్రీను ఈ నెల 18వ తేదీ నుంచి జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారు. గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న శ్రీనివాసరావు ఆరోగ్యం క్షీణించింది. సోమవారం న్యాయవాదుల సమక్షంలో దళిత సంఘల నేతలు కోడి శ్రీనుతో ములాఖాత్ అయ్యారు. ఆ సమయంలో ఒక జైలు అధికారి, మరో ఖైదీ శ్రీనును చేతులతో మోసుకొచ్చినట్లు దళిత సంఘ నేతలు వెల్లడించారు. జైల్లో శ్రీను దీక్షను కొనసాగిస్తున్నప్పటికీ, జైలు అధికారులు శ్రీనివాసరావు హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడంపై విశాఖ దళిత సంఘాల కన్వీనర్ బూసి వెంకట్రావు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు కోడి కత్తి శ్రీను హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతూ జిల్లా లీగల్ అథారిటీలో న్యాయవాది సలీం పిటిషన్ దాఖలు చేశారు.