ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజ్యసభ స్థానాల కోసం వైసీపీ ప్లాన్ - ఎమ్మెల్యేలకు ఫారిన్ ట్రిప్ ఆఫర్!

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 9:04 AM IST

YSRCP Rajya Sabha Elections Strategy: రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాల కోసం వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రకటించిన జాబితాల్లో టికెట్‌ రాక అసంతృప్తిగా ఉన్న నేతలను సంతృప్తి పరిచేందుకు ప్లాన్​లు వేస్తున్నారు. ఇందుకోసం సింగపూర్‌, థాయ్‌లాండ్‌ లాంటి దేశాల పర్యటనకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

YSRCP_Rajya_Sabha_Elections_Strategy
YSRCP_Rajya_Sabha_Elections_Strategy

YSRCP Rajya Sabha Elections Strategy: ఒకపక్క రాజ్యసభ ఎన్నికలు (Rajya Sabha Elections 2024). మరోవైపు వైసీపీలో రాజుకుంటున్న అసమ్మతి. ఇప్పటికే వైసీపీ వచ్చే ఎన్నికలకు ఆరు జాబితాలను ప్రకటించింది. పలు స్థానాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం అధిష్ఠానం మార్చింది. దీంతో వైసీపీలో అసమ్మతి బయటకు వచ్చింది. పలువురు ఇప్పటికే పార్టీని వీడగా, మరికొంత మంది బయటకు వెెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా పలు నియోజకవర్గాల్లో అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా వెలుగుచూస్తోన్న నిరసనలే ఇందుకు నిదర్శనం.

రంగంలోకి దిగిన అభ్యర్థులు: అయితే ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకోవడం వైసీపీకి కత్తిమీద సాములా మారింది. అసలే తమకు టికెట్లు రాలేదని పార్టీ నిర్ణయంపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలైతే సీఎం జగన్‌ పిలిచినా రావడం లేదు. ఈ తరుణంలో రాజ్యసభలో ఖాళీ అయిన మూడు స్థానాలను వైసీపీ పెద్దలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటున్నారు.

ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులనూ ప్రకటించేశారు. అందులో టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుతో పాటు మేడా రఘునాథరెడ్డి ఉన్నారు. తొలుత చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులను ఎంపిక చేసి, తరువాత ఆయనను తప్పించి మేడా రఘునాథరెడ్డికి అవకాశం ఇచ్చారు. అయితే ఇక ఇప్పుడు అసంతృప్త ఎమ్మెల్యేలను లొంగదీసుకునేందుకు నేరుగా అభ్యర్థులే రంగంలోకి దిగి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

వైఎస్సార్​సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు - ఆ ముగ్గురికి ఛాన్స్

సీఎం మాట్లాడేందుకు ప్రయత్నించినా: రాజ్యసభ ఎన్నికల్లో మూడు స్థానాలు దక్కించుకోడానికి బలమున్నప్పటికీ మారిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా వైసీపీలో గుబులు మొదలైంది. మూడు స్థానాల్ని సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు రాక అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలను ఊరడించే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం జగన్‌ మాట్లాడేందుకు ప్రయత్నించినా మంత్రి గుమ్మనూరు జయరాం, కాపు రామచంద్రారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు ఆయనతో మాట్లాడలేదు. దీంతో నేతలను నయానో భయానో లొంగదీసుకునేందుకు నేరుగా రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులు ఇద్దరు రంగంలోకి దిగారు.

పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలతో అభ్యర్థుల్లో ఒకరైన వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) నేరుగా, మరో అభ్యర్థి మేడా రఘునాథరెడ్డి (Meda Raghunath Reddy) తరఫు ఆయన సోదరుడు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి మంతనాలు జరిపారు. రాజ్యసభ ఎన్నికల్లో వారి సహాయ సహకారాలు కావాలని కోరారు. వారిని సంతృప్తపరిచేందుకు ఈ ఇద్దరు నేతలు ఒక ప్రణాళికను సిద్ధం చేశారనే చర్చ జరుగుతోంది.

సింగపూర్‌ థాయ్‌లాండ్‌ లాంటి దేశాలకు ట్రిప్: అవసరమైతే విదేశీ పర్యటనకూ తీసుకెళ్లి పోలింగ్ సమయానికి వెనక్కి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ తెలుగుదేశం ఈ ఎన్నికల్లో అభ్యర్థిని బరిలోకి దించితే తమ ప్రణాళికను వెంటనే అమలు చేసేందుకు వైసీపీ పెద్దలు సిద్ధమైనట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సింగపూర్‌ థాయ్‌లాండ్‌ లాంటి దేశాలకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లడంపై చర్చ జరుగుతోందంటున్నారు.

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ - సంక్రాంతి తర్వాత నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details