No Ticket to Minister Gudivada Amarnath: అనకాపల్లి వైసీపీ సీటు భరత్కేనని సీఎం జగన్ ఖరారు చేసేశారు. జగన్ ప్రకటనతో మంత్రి అమర్నాథ్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే అన్నట్లు పరిస్థితి మారిపోయింది. గతంలోనే అనకాపల్లి సమన్వయకర్తగా భరత్ను ప్రకటించిన తరువాత మంత్రి అమర్నాథ్కు పెందుర్తి సీటు ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ సీటు సిటింగ్ ఎమ్మెల్యే అదీప్రాజ్కేనని వైసీపీ అధిష్ఠానం చెప్పినట్లు ఆయన అనుచరవర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఆ తర్వాత ఎలమంచిలి, చోడవరం నియోజకవర్గాల్లో అమర్కు సీటు ఇచ్చే అవకాశాలపై పరిశీలించినప్పటికీ సామాజిక సమీకరణాలు, సర్వేలలో వెనుకబాటుతో మంత్రి ఆశలకు గండిపడింది. తిరిగి అనకాపల్లి సీటే ఇస్తారంటూ ఇటీవల ప్రచారం జరగ్గా, సీఎం ఆ సీటు భరత్కేనని తాజాగా తేల్చిచెప్పేశారు. జగన్ ప్రకటనకు ముందే తన పరిస్థితి ఏంటో ఓ అంచనాకు వచ్చిన అమర్నాథ్ ఇలా చెప్పుకొచ్చారు.
"అన్నా అనకాపల్లికి భరత్ని పెట్టారు, నీ పరిస్థితి ఏంటి, నువ్వు ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నావు అని చాలా మంది అడిగారు. ఈ జిల్లాలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, రాష్ట్రంలో ఉన్న పలు మీడియా సంస్థలకు జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ఈ రోజు ఒకటే తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఉమ్మడి విశాఖలోని అన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తా. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం చారిత్రక అవసరం. జగన్ కోసం నేను పోటీ నుంచి తప్పుకోవడానికి అయినా సిద్ధం. అందరి తలరాతలు భగవంతుడు రాస్తే, నా తలరాత జగన్మోహన్ రెడ్డి రాస్తారు". - గుడివాడ అమర్నాథ్, మంత్రి