ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హిందూ ఆలయాలపై పదేపదే దాడులు - మరోసారి వైసీపీ వస్తే పరిస్థితి ఏంటి? - Attacks on Hinduism in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 22, 2024, 9:38 AM IST

Attacks on Hinduism in Andhra Pradesh: ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక పలు ఆలయాలు వివాదాల్లోకి ఎక్కాయి. వైసీపీ నియమించిన పాలకమండళ్లు సైతం వివాదాస్పదం అయ్యాయి. ఆలయపాలక మండళ్ల నియామకంలో నైతిక ప్రమాణాలు పాటించలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. తిరుమల కొండపై వైసీపీ రాజకీయాలు చేస్తోందనే ఆరోపణలూ వచ్చాయి. అసలు రాష్ట్రంలో ఆలయ సేవల్లో లోపాలు ఏవైనా ఉన్నాయా? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఐదేళ్లలో ఏం జరిగింది? మళ్లీ వైసీపీ గెలిస్తే ఏం జరుగుతుంది? అనే విషయాలపై ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.

Attacks_on_Hinduism_in_Andhra_Pradesh
Attacks_on_Hinduism_in_Andhra_Pradesh

Attacks on Hinduism in Andhra Pradesh: అన్ని మతాలను సమభావంతో చూడటం ప్రభుత్వాల కర్తవ్యం. కానీ ఆంధ్రప్రదేశ్‌లో అలా జరుగుతోందా? హిందూ ఆలయాలపై పదేపదే ఎందుకు దాడులు జరిగాయి? హిందూ దేవుళ్లను కించపరిచే చర్యలు ఎవరు చేస్తున్నారు? మెజార్టీ మతస్తుల మనోభావాలను పదేపదే అదేపనిగా దెబ్బతీస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? రాష్ట్రంలో ఆలయాల నిర్వహణ ఎలా ఉంది? ఆలయపాలక మండళ్ల నియామకంలో నైతిక ప్రమాణాలు పాటిస్తున్నారా? దేవదాయ శాఖ తన పని తాను చేస్తోందా? పింక్‌ డైమండ్ పోయిందని శ్రీవేంకటేశ్వరుడిని కూడా రాజకీయం చేసిన వైసీపీ, టీటీడీకి ఎలాంటి పాలకమండళ్లని నియమించింది? అనే అంశంపై నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ విషయాలను మనతో పంచుకునేందుకు హిందూ సంఘాల ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ రామణపూడి శివప్రసాద్, ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి చర్చలో పాల్గొన్నారు.

జగనన్నకు ఉన్న కసి ఏంటి - దానికోసం ఏ మేరకు పని చేశారు?

ఐదేళ్ల జగన్ పాలనలో హిందువులకు చాలా గడ్డుకాలమని ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. చరిత్రలో మహ్మదీయ దాడులు జరిగేటప్పుడు హిందూ ఆలయాలు, ధర్మంపై దాడులు, హిందూ సంప్రదాయాలపై దాడులు, ఆలయాలు, ఆలయ భూములు ఎన్నో కోల్పోయామని, చరిత్ర ఘటనలు జగన్‌ పునరావృతం చేస్తున్నారన్న ఆలోచన, భయంతో అందరిలో కల్గిందని పేర్కొన్నారు.

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలోని అన్నీ ఆలయాలపై రకరకాలుగా దాడులు జరిగాయని, చివరకు రామతీర్థలో రాములవారి శిరస్సు ఖండన చేయడం వంటి దాష్టీకానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఒకటికాదు,రెండు కాదని, వందలాది దాడులు హిందూదేవాలయాలపై జగన్‌ పాలనలో పదేపదే ప్రతిరోజు జరుగుతున్నాయని తెలిపారు. దోషులను శిక్షించకుండా హిందువులకు మనోధైర్యం ఇవ్వకుండా, ఈ ఘటనలు ఖండిస్తున్నామని చెప్పకుండా, ప్రభుత్వ పెద్దలు ఒక్కమాట కూడా మాట్లాడలేదని శ్రీ శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.

జగన్‌ పాలనలో చాలా దారుణ ఘటనలు హిందువులం ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అన్యమతాలను గౌరవించాలని, సమదృష్టితో చూడాలని తెలిపారు. జగన్ ప్రభుత్వం మాత్రం వివక్షతతో హిందుత్వాన్ని అణచివేద్దామని, హిందూధర్మాన్ని నాశనం చేద్దామని హిందూ ఆచారాలు, సంప్రదాయాలు, విలువలు, స్థలపురాణాలు, స్థానిక ఆచరాలు ఇవన్నీ మంటగలిపే విధంగా భయానకస్థితికి తీసుకుపోయిందని విమర్శించారు.

ఏం చేశారని జగన్ పార్టీకి దళితులు ఓటేయాలి ?

జగన్‌ ప్రభుత్వం నూటికి నూరు పాళ్లు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని హిందూ సంఘాల ఐకాస రాష్ట్ర కన్వీనర్‌ రామణపూడి శివప్రసాద్ మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఇతర మతాలను పెంచి పోషిస్తున్నారని, అంతర్వేది రథం దగ్ధం ఘటనలో ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెప్పిందని విమర్శించారు. పిచ్చోడు తగలబెట్టాడని, కాకులు కాల్చేశాయని పొంతనలేని వాదనలతో ప్రభుత్వం హేళన చేసిందని అన్నారు. పిఠాపురంలో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని, విగ్రహాలు ధ్వంసం చేశారని తెలిపారు.

జగన్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగానే దేవాలయాలపై దాడులు చేస్తోందని, శ్రీశైలంలో రూల్‌ ఆఫ్‌ లా పాటించట్లేదని రామణపూడి శివప్రసాద్ అన్నారు. శ్రీశైలంలో హిందువులకు మాత్రమే కేటాయించాల్సిన దుకాణాలను ముస్లింలకు, క్రైస్తవులకూ ఇచ్చారని ఆరోపించారు. ఈ అంశంపై పోరాడిన హిందూ సంఘాలపైనే పోలీసులు కేసులు పెట్టి కొందరు హిందూ నేతలను నెలరోజుల వరకూ జైలులో ఉంచారని విమర్శించారు. హిందువుల ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతిని దెబ్బ తీస్తే హిందువులను దెబ్బతీయవచ్చన్న కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. తిరుపతిలో ఆచారాలను మంటకలుపుతున్నారని, ప్రతి నిత్యం తిరుపతిలో అపచారాలు జరుగుతున్నాయని అన్నారు.

ఇవే కాకుండా ఏపీలో హిందూ ఆలయ వ్యవస్థ ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం పాలకమండళ్ల నియామకం విషయంలో అన్ని ప్రమాణాలు పాటిస్తోందా? వైసీపీ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం నుంచి రామతీర్థం వరకూ ప్రతి ఆలయమూ ఎందుకు వివాదాల్లోకి ఎక్కాయి? అక్కడ ఏం జరుగుతోంది? మంత్రులు రోజా దగ్గర్నుంచి అనేకమంది తిరుమల కొండపైనే రాజకీయాలు మాట్లాడుతున్నారు. దీనివల్ల ఆ క్షేత్రం పవిత్రతా దెబ్బతినట్లేదా? మరోసారి వైసీపీకి ఓటు వేస్తే ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా అవుతుంది? ఇలా అనేక అంశాలపై కార్యక్రమంలో వక్తలు తమ అభిప్రాయాలు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి కార్యక్రమం కోసం పైన కనిపించే లింక్​పైన క్లిక్ చేసి చూడండి.

మహిళలపై నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపిన జగన్‌కు ఎందుకు ఓటేయాలి?

ABOUT THE AUTHOR

...view details