JPS Strike in Telangana : ప్రభుత్వం హెచ్చరించినా తగ్గేదే లే.. వినూత్నంగా జేపీఎస్ల నిరసన
JPS Strike in Nizamabad : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ పంచాయతీ కార్యదర్శలు పోరు బాట పట్టిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో జేపీఎస్లు నేడు మోకాళ్లపై నిలబడి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కింద గుర్తించి రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
బీమా లేక చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున: తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత కొద్దిరోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇది వరకే 45 మంది ఉద్యోగులు బీమా లేకుండా చనిపోయారని.. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గత 11 రోజులుగా సమ్మె చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు.. మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. లేకపోతే వారిని విధుల్లో నుంచి తొలగిస్తామని స్పష్టంగా తెలిపింది. అయినప్పటికీ జేపీఎస్లు తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు.