ETV Bharat / sukhibhava

DOCTORS ADVICE: కరోనా బాధితుల వ్యాయామంపై నిపుణులు ఏమంటున్నారంటే?

author img

By

Published : Jun 10, 2021, 5:54 AM IST

Updated : Jun 10, 2021, 6:00 AM IST

కొవిడ్‌ లక్షణాలు తగ్గగానే.. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించుకుని నెగెటివ్‌ రాగానే కొందరు వ్యాయామాలు చేస్తున్నారు. పూర్వం మాదిరిగానే కిలోమీటర్ల కొద్దీ నడుస్తున్నారు. కాళ్లూ చేతులూ వేగంగా ఊపుతూ బ్రిస్క్‌ వాకింగ్‌ చేస్తున్నారు. సైకిల్‌ తొక్కుతున్నారు. ఈత కొట్టడం, యోగాసనాలు వేయడం వంటివీ చేస్తున్నారు. స్వల్ప లక్షణాలతో కొవిడ్‌ బారినపడినవారైనా సరే..  వైద్యుల సలహా లేకుండా ఇలాంటివేవీ మొదలు పెట్టొద్దు.

కరోనా బాధితుల వ్యాయామంపై నిపుణులు ఏమంటున్నారంటే?
కరోనా బాధితుల వ్యాయామంపై నిపుణులు ఏమంటున్నారంటే?

సాధారణంగా శారీరక శ్రమ చేయడం ద్వారా ఒంట్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటారు. ఇది నిజమేకానీ కొవిడ్‌కు ఈ సూత్రం వర్తించదు. కొవిడ్‌తో బాధపడుతున్నప్పుడు అస్సలు వ్యాయామాలు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘కోలుకున్న తర్వాత వెంటనే మొదలుపెట్టడమూ శ్రేయస్కరం కాదు. కొంత కాలం మానసిక, శారీరక విశ్రాంతి పొంది.. ఆ తర్వాత క్రమేణా వ్యాయామం చేసే సమయాన్ని వారానికి 5 శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్లాలి. అలా కాకుండా కరోనా చికిత్స పొందే సమయంలోగానీ.. కోలుకున్న వెంటనే గానీ తీవ్ర శారీరక శ్రమను చేయడం ద్వారా ప్రాణాపాయ ముప్పును ఎదుర్కోవాల్సిన ఉంటుంది’’ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌ బాధితులు ఎందుకు వ్యాయామం చేయకూడదు? ఎప్పుడు ప్రారంభించాలి? ఎలా కొనసాగించాలి తదితర అంశాలపై ‘ఈనాడు-ఈటీవీ భారత్’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

తప్పుడు సమాచారంతో అనర్థాలు
కొవిడ్‌ బాధితులు వ్యాయామాలు చేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే తప్పుడు సమాచారాన్ని కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమే అనుకొని కొందరు వ్యాయామాలు చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం కన్నా.. అనర్థాలే ఎక్కువ. కొవిడ్‌లో ముఖ్యంగా పాటించాల్సింది పూర్తిగా మానసిక, శారీరక విశ్రాంతి. ఇందుకు విరుద్ధంగా ఆ సమయంలో కసరత్తులు చేస్తే జబ్బు తీవ్రత పెరిగే ప్రమాదముంది. అప్పటికే ఉన్న లక్షణాల తీవ్రత పెరుగుతుంది. ఆక్సిజన్‌ శాతం తగ్గే అవకాశముంటుంది. కొత్త సమస్యలు చుట్టుముడతాయి.

ఎక్సర్‌సైజ్‌లు ఎలా మొదలెట్టాలి?

* కొవిడ్‌ వచ్చి తగ్గిన మొదటి వారం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. గదిలో అటూ ఇటూ తిరగొచ్చుకానీ.. శరీరం అలసిపోయేలా వ్యాయామాలు చేయకూడదు.
* రెండోవారంలో 10 నిమిషాల కంటే ఎక్కువగా నడవొద్దు. అలా క్రమేణా వారానికి 5 శాతం చొప్పున పెంచుతూ పూర్వస్థితికి చేరుకోవాలి.
* గట్టిగా గాలి పీల్చడం, బెలూన్లను ఊదడం వంటివి వైద్యుని పర్యవేక్షణలో చేయాలి.
* మధ్యస్థ, తీవ్ర లక్షణాలతో కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు.. కోలుకున్న తర్వాత కూడా లక్షణాలతో బాధపడుతున్నవారు.. వైద్యుడి సూచనల మేరకు తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. ఉదాహరణకు ఈసీజీ, డీ డైమర్‌, పల్మనరీ ఫంక్షన్‌ టెస్టు, కనీసం 6 నిమిషాల నడక పరీక్ష, ఈ సమయంలో నడిచినప్పుడు ఆక్సిజన్‌ శాతం ఎలా ఉంది? నాడి ఎంత వేగంగా కొట్టుకుంటుంది? తదితర సమాచారాన్ని వైద్యుడు పరిశీలిస్తారు.

డీహైడ్రేషన్‌కు లోనుకాకూడదు..

.

* వ్యాయామం చేస్తున్నప్పుడు వీలైతే పల్స్‌ఆక్సీమీటర్‌తో పరీక్షించుకోవాలి. మామూలుగా పనిచేసినప్పుడు పల్స్‌ రేటు 70-75 మధ్య ఉంటుంది. కొంచెం నడక వంటివి మొదలుపెడితే నాడి వేగం 10-15 బీట్స్‌ ఎక్కువుంటుంది. రక్తంలో ఆక్సిజన్‌ శాతం సాధారణంగా 94 కంటే ఎక్కువ ఉంటుంది. వ్యాయామంతో మహా తగ్గితే 2 శాతం తగ్గొచ్చు. అంతకంటే ఎక్కువగా తగ్గకూడదు. ఈ రెండింటిలో ఇలా కాకుండా వేరే తేడాలు గమనిస్తే అప్రమత్తమవ్వాలి. ఆయాసం వచ్చినా.. ఛాతీనొప్పి, గుండె దడ వచ్చినా వెంటనే నిలిపివేయాలి. నీరసం, నిస్సత్తువగా ఉన్నప్పుడు ఏ వ్యాయామం చేయకూడదు.

.

* డీహైడ్రేషన్‌కు లోనుకాకూడదు. ఎందుకంటే శరీరం నుంచి నీరు, లవణాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోయినప్పుడు.. రక్తం చిక్కబడుతుంది. దీంతో రక్తం సులువుగా గడ్డట్టకడానికి అవకాశాలు పెరుగుతాయి.

ఎక్కడ రక్తం గడ్డ కడితే ఏమవుతుందంటే...

.

* కాళ్ల పిక్కల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. దీన్ని ‘డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌’ అంటారు. ఇలాంటప్పుడు పిక్కల్లో నొప్పి వస్తుంది. వాపు కనిపిస్తుంది.

* గుండె రక్తనాళాల్లో గడ్డ కడితే ఛాతీలోనొప్పి, గుండెపోటు వస్తుంది.

* ఊపిరితిత్తుల్లో ఈ పరిస్థితి ఉంటే ఛాతీనొప్పి, ఆయాసం, తీవ్రమైన దగ్గు వస్తుంది. ఒక్కోసారి రక్తం పడుతుంది.

* మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డ కడితే.. తలనొప్పి, వాంతులు, కాళ్లు చేతులు బలహీనమవడం వంటివి ఉంటాయి.

జాగ్రత్తలు చాలా ముఖ్యం

.

నేక దేశాల్లో యువకులు, అథ్లెట్లు, బాగా దృఢంగా ఉన్నవారు కొవిడ్‌తో కోలుకున్న తర్వాత వ్యాయామాలు చేస్తూ అకస్మాత్తుగా చనిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పోస్ట్‌ కొవిడ్‌లో ఇటువంటి కేసులు చూస్తున్నాం. కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తలు చాలా ముఖ్యం. మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వాటిని అదుపులో ఉంచుకోవాలి. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత వీలైతే రోజూ వీటిని పరీక్షించుకోవాలి. కంటి నిండా నిద్రపోవాలి. పూర్వ స్థితికి రావడానికి కనీసం 3 నెలలు పడుతుంది. అప్పుడైనాసరే వ్యాయామం చేస్తుంటే.. ఆయాసం, గుండెదడ, ఛాతినొప్పి, దగ్గు, కాళ్ల పిక్కల్లో నొప్పి, కాళ్లవాపు, అపస్మారక స్థితి, అయోమయానికి లోనవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

.

హోం ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు...
హోం ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు స్నానం చేయడం, వస్తువులు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం వంటివి చేయొచ్చు కానీ.. శరీరానికి పూర్తి అలసట కలిగించే పనులు చేయొద్దు. కొవిడ్‌ తగ్గిన తర్వాత కూడా ఇదే విధానం అనుసరించాలి.

శరీరంలో ఏం జరుగుతుందంటే...
కొవిడ్‌ కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు మాత్రమే కాదు. ఇది అన్ని అవయవాలపై దుష్ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు శ్వాసకోశాల్లో నిమోనియా, ఫైబ్రోసిస్‌ రూపంలో ఎలా నష్టం జరుగుతుందో.. గుండెలోనూ కండరం దెబ్బతింటుంది. చాలామందికి కొవిడ్‌కు సంబంధించి ఎటువంటి లక్షణాలు లేకుండానే గుండె కండరాలు దుష్ప్రభావానికి గురయ్యే అవకాశాలున్నాయి. ఇంకొందరిలో రక్తం గడ్డకట్టే రీతిలో మార్పులొస్తాయి. మామూలుగా కంటే త్వరగా రక్తం గడ్డకడుతుంది. అప్పటికే ఊపిరితిత్తులు, గుండె బలహీనంగా ఉన్నవారిలో తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. ఆక్సిజన్‌ తగ్గిపోతుంది. ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో పనిచేయకపోతే.. వ్యాయామాలు చేసినప్పుడు ప్రాణవాయువు సరిపోదు. దీంతో గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. నాడీ వేగం పెరుగుతుంది. గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. కొందరిలో ఉన్నట్టుండి ప్రాణాపాయ స్థితిలోకి చేరిపోయే ప్రమాదం ఉంటుంది. మరికొందరిలో త్వరగా నీరసం, నిస్సత్తువ ఆవహిస్తుంది. శరీరం చిగురుటాకులా వణికిపోతుంది.

- డాక్టర్‌ ఎంవీ రావు, జనరల్‌ ఫిజీషియన్‌, యశోద హాస్పిటల్‌

Last Updated : Jun 10, 2021, 6:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.