సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల పక్క జిల్లా అయిన యాదాద్రి భువనగిరిలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా... ఆ మండలానికి సరిహద్దు మండలమైన అడ్డగూడూరులో జాగ్రత్త చర్యలు చేపట్టారు. మండల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి పరిశీలించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని తెలిపారు. మే 3 వరకు లాక్డౌన్ పాటించి కరోనాను దరిచేరకుండా చూడాలన్నారు.
పక్క మండలమైన తిరుమలగిరి, నాగారం మండలాల్లో, వర్ధమానుకోటలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అటు నుంచి ఎవరూ ఇటు రాకుండా చెక్పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. అడ్డగూడూరు మండలంలోని 4 గ్రామాల ప్రజలకు వర్ధమానుకోట, తిరుమలగిరి ప్రాంతాలతో సంబంధాలుండడం వల్ల ఈ 4 గ్రామాల్లోని సుమారు 240 మందిని హోం క్వారంటైన్లో ఉంచామన్నారు.
మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో కరోనా కట్టడికి నిఘా పటిష్ఠం చేశారు. ప్రధాన రహదారికి ఇరువైపులా బజారులను మునిసిపాలిటీ సిబ్బంది, పోలీసులు మూసివేశారు. అనవసరంగా ఎవ్వరూ వీధుల్లో తిరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అకారణంగా వచ్చిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
ఇవీచూడండి: ఒక్కరోజులోనే భారత్లో 1211 కరోనా కేసులు