ETV Bharat / state

Harishrao on Modi: 'ప్రధాని మాటలు.. తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయి'

author img

By

Published : Feb 8, 2022, 5:05 PM IST

Harishrao on Modi: వేరుపడ్డాం.. బాగుపడ్డామని ప్రజలు భావిస్తున్నారని.. కానీ రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల హృదయాలను గాయపరిచాయని మంత్రి హరీశ్​రావు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భాజపా ఎంతగా వ్యతిరేకిస్తుందో... ఈ ఘటనతో మరోసారి రుజువైందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Harishrao on Modi
minister harish rao

Harishrao on Modi: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ... దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే... ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఏపీ విభజనపై రాజ్యసభలో మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల హృదయాలను గాయపరిచాయన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును భాజపా ఎంతగా వ్యతిరేకిస్తుందో... ఈ ఘటనతో మరోసారి రుజువైందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ.. సమైఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారని మండిపడ్డారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యి ఎదురైందన్నారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

'అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉంది. కానీ ఎందుకో మోదీకి నచ్చడం లేదు. అభివృద్ధిలో గుజరాత్​ను దాటిపోతున్నామనే అక్కసు మోదీలో ఉన్నట్లు కనిపిస్తోంది. వేరుపడ్డాం... బాగుపడ్డామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కాకినాడ తీర్మానం ప్రకారం తెలంగాణ ముందే ఏర్పాటైయుంటే.. మా యువకులు బలిదానాలు చేసుకొనే వాళ్లా.. 2004లోనే తెలంగాణ వచ్చుంటే మా శ్రీకాంతాచారి అమరుడయ్యేవాడా.. యువకుల బలిదానాలకు కారణం.. ఈ భాజపా, కాంగ్రెస్​ ప్రభుత్వాలు. రాజ్యసభలో ప్రధాని మోదీ మాటలు.. తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని ఎంత వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతోంది.'

- హరీశ్​రావు, రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి

మోదీ ఏమన్నారంటే..

Modi on Andhra Pradesh Bifurcation : ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే... ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై... చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని.. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటులో మైకులు ఆపేసి... ఎలాంటి చర్చ జరగకుండానే ఆంధ్రప్రదేశ్‌ విభజన చేశారని.. అందుకే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని... మోదీ ఆక్షేపించారు.

Harishrao on Modi: 'ప్రధాని మాటలు.. తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయి'

ఇదీచూడండి: విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.