ETV Bharat / state

'అంటే.. వాజ్‌పేయి కూడా రాజ్యాంగాన్ని అవమానించినట్టేనా..?'

author img

By

Published : Feb 4, 2022, 4:17 PM IST

KTR Comments: నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో మంత్రులు కేటీఆర్‌, సబిత ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ ​గౌడ్​ పర్యటించారు. ఎంజేఆర్‌ ట్రస్ట్‌ సహకారంతో నిర్మించిన ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్​.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎనిమిదేళ్లలో ఒక్క కేంద్ర విద్యాసంస్థను కూడా రాష్ట్రానికి ఇవ్వలేదని మండిపడ్డారు.

Minister KTR comments on central government budget
Minister KTR comments on central government budget

KTR Comments: కేంద్రం తెలంగాణపై అన్యాయం చేస్తోందని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడుగల్‌లో రైతువేదికను ప్రారంభించారు. 40 రెండుపడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. అనంతరం నాగర్​కర్నూర్​ జిల్లాలో పర్యటించిన మంత్రి.. తిమ్మాజిపేటలో ఎంజేఆర్‌ ట్రస్ట్‌ సహకారంతో నిర్మించిన ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్​తో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్​గౌడ్, నిరంజన్​రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు​ పాల్గొన్నారు.

గిరిజనుల ఆకాంక్షను నేరవేర్చాం..

మన ఊరు- మన బడి కింద 26 వేల పాఠశాలల నవీకరణకు సంకల్పించినట్టు మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఈ విద్యా యజ్ఞంలో పూర్వ విద్యార్థులు, ప్రవాసంలో ఉన్న వారు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్రంలో ఒక్కోక్కరికి రూ.1.20 లక్షల చొప్పున 5 లక్షల మందికి వెయ్యి గురుకులాల ద్వారా విద్య అందిస్తున్నామని కేటీఆర్​ వివరించారు. దేశవ్యాప్తంగా 157 వైద్యకళాశాలలు, 8 ఐఐఎంలు, 16 ఐసర్లు, 100 నవోదయ విద్యాలయాలు ఇచ్చిన కేంద్రం... తెలంగాణకు మాత్రం ఇచ్చింది శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది గిరిజన తండాలను సీఎం కేసీఆర్‌ గ్రామ పంచాయతీలుగా మార్చారని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న గిరిజనుల ఆకాంక్షను కేసీఆర్‌ నెరవేర్చారన్నారు.

మోదీకి కలలోకి వచ్చి ఉపదేశించాలి..

"కేంద్రానిది మాటల్లో ప్రేమ.. కేటాయింపుల్లో శూన్యం. బడ్జెట్‌లో ఉమ్మడి పాలమూరుకు కొత్త రైల్వే లైన్లు లేవు. అప్పర్‌ భద్రకు జాతీయ హోదా ఇచ్చి పాలమూరు-రంగారెడ్డికి ఇవ్వలేదు. ఎనిమిదేళ్లలో ఒక్క కేంద్ర విద్యాసంస్థను కూడా రాష్ట్రానికి ఇవ్వలేదు. తెలంగాణలో విద్య అందకుండా కేంద్రం చేస్తోంది. దేశానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న 4వ రాష్ట్రం తెలంగాణ. గుజరాత్‌తో పోలిస్తే తెలంగాణకు సమన్యాయం లేదు. తెలంగాణను కూడా సమదృష్టితో చూడాలని రామానుజులు మోదీ కలలోకి వచ్చి ఉపదేశం చేయాలి. రాజ్యాంగాన్ని ఇప్పటివరకు 105 సార్లు సవరించారు. రాజ్యాంగాన్ని సవరించినవాళ్లంతా అంబేడ్కర్‌ను అవమానించినట్టా..? వాజ్‌పేయి కూడా రాజ్యాంగ సవరణ కోసం కమిటీ వేశారు. అంటే.. వాజ్‌పేయి కూడా రాజ్యాంగాన్ని అవమానించినట్టేనా..?" - కేటీఆర్​, మంత్రి

'అంటే.. వాజ్‌పేయి కూడా రాజ్యాంగాన్ని అవమానించినట్టేనా..?'

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.