ETV Bharat / state

ONLINE CLASSES: ఆన్‌లైన్‌ బాట వీడి పొలం బాట పడుతున్న విద్యార్థులు

author img

By

Published : Aug 13, 2021, 3:54 PM IST

ఊపందుకున్న వ్యవసాయ పనులు.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విద్యార్థుల ఆన్​లైన్ చదువులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. మొబైల్​లో లేదా టీవీలో ఆన్​లైన్ పాఠాలు వినాల్సిన విద్యార్థులు పొలాల్లో పనులు చేస్తూ దర్శనమిస్తున్నారు. తల్లిదండ్రులకు సాయంగా కొందరు, కూలీ డబ్బుల కోసం ఇంకొందరు పొలాలబాట పడుతున్నారు. వ్యవసాయంలో కూలీల అవసరం పెరగడం, ఆర్థిక స్తోమత, పిల్లల భద్రత, మొబైల్, టీవీలు అందుబాటులో లేకపోవడం ఇలా అనేకరకాల కారణాలు చదువుకోవాల్సిన విద్యార్థులు పొలాలబాట పట్టేందుకు కారణం అవుతున్నాయి. ఇప్పటికే 50శాతానికి పైగా విద్యార్థులు ఆన్​లైన్ పాఠాలకు హాజరు కావడం లేదు. హాజరవుతున్నామని చెబుతున్న వారిలోనూ అధిక శాతం ఉదయం నుంచి సాయంత్రం వరకూ సాగు పనుల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు.

ONLINE CLASSES: ఆన్‌లైన్‌ బాట వీడి పొలం బాట పడుతున్న విద్యార్థులు
ONLINE CLASSES: ఆన్‌లైన్‌ బాట వీడి పొలం బాట పడుతున్న విద్యార్థులు

టీవీల్లోనో, మొబైల్​లోనే డిజిటల్ పాఠాలు వినాల్సిన విద్యార్ధులు పొలం బాట పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఇళ్లలో పాఠాలు వినాల్సిన విద్యార్థులు పొలాల్లో కూలీలుగా దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం వరి, పత్తి, మిరప, కూరగాయలు సహా వివిధ పంటల్లో కలుపుతీత పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సొంతంగా పొలాలున్న తల్లిదండ్రులు ఈ పనుల కోసం ఆన్​లైన్ పాఠాలు వినాల్సిన తమ పిల్లల్ని వెంటబెట్టుకుని వెళ్తున్నారు. సాగుభూమి లేకుండా వ్యవసాయ కూలీలుగా పనిచేసే నిరుపేద కుటుంబాలు తమ పిల్లల్ని కూలీలుగా తమవెంట తీసుకువెళ్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కుర్వపల్లి శివారులో ఇద్దరు విద్యార్థులు మిరపచేనులో కలుపుతీస్తూ కనిపించారు. వ్యవసాయ కూలీగా పనిచేసే మహిళ తన అత్తతో పాటు కుమారుడు, అల్లుడిని కూలీ పని కోసం తీసుకువచ్చారు. కలుపుతీస్తే రోజుకు 250 రూపాయలు వారికి చెల్లిస్తారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం కావడంతో కుమారుడిని తల్లి కూలీకి తీసుకువచ్చారు. కూలీ చేశాక సమయం దొరికితే ఆన్​లైన్ పాఠాలు వింటామని విద్యార్థులంటున్నారు.

కలుపుతీస్తూ కనిపిస్తున్న పిల్లలు

అదే కుర్వపల్లి గ్రామానికి మరో విద్యార్ధి జడ్చర్లలోని జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఉదయం 6గంటల నుంచి 10 గంటలు, సాయంత్రం 6గంటల నుంచి 10గంటల మధ్యలో ఆన్​లైన్ తరగతులు వింటున్నాడు. మిగిలిన సమయంలో వ్యవసాయంలో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ప్రైవేటు పాఠశాలలో చదివే అతని సోదరునికి తల్లిదండ్రులు ఫీజు చెల్లించకపోవడం వల్ల ప్రస్తుతం ఆన్​లైన్ తరగతులు వినడం లేదు. తనూ మిరపచేలో కలుపుతీస్తూ కనిపించాడు.

పొలాల్లోనే గడుపుతున్న విద్యార్థులు

జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తన పత్తి సాగులో ఆగస్టు మాసం క్రాసింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి కూలీల అవసరం ఎక్కువ. మొగ్గలు గిల్లడానికి, మగ,ఆడ పుష్పాల మధ్య పరపరాగ సంపర్కం జరపడానికి కూలీలు అవసరమవుతారు. రోజుకూ ఒక్కో కూలీకి 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక స్తోమత లేని తల్లిదండ్రులు పిల్లల్ని క్రాసింగ్ కోసం తీసుకువెళ్తారు. ఆగస్టు మాసం వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్నత పాఠశాల్లో హాజరుశాతం 30శాతానికి పైగా పడిపోతూ ఉండేది ప్రస్తుతం బడులు మూసి ఉండటంతో విద్యార్ధులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పత్తిచేళ్లలోనే గడుపుతున్నారు. ముఖ్యంగా 6వ తరగతి నుంచి 9వ తరగతి చదివే విద్యార్ధులు ఎక్కువ శాతం పొలాల్లోనే గడుపుతున్నారు. ఇంటికి తిరిగొచ్చి ఆన్​లైన్ పాఠాలు విందామన్నా అప్పటికే అలసిపోవడంతో పాఠాలు బుర్రకెక్కడం లేదు.

పొలంబాట పట్టేందుకు కారణాలు..

పిల్లలు పొలాలబాట పట్టేందుకు ఇతర కారణాలు దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. టీవీలోనో, మొబైల్​లోనో పాఠాలు వినేందుకు వారిని ఇంటివద్ద వదిలొస్తే వారి సంరక్షణ ఎవరు చూసుకుంటారన్న భయంతో పొలాలకు తీసుకువస్తున్నారు. ఇక ఒకే కుటుంబంలో ఎక్కువమంది చదువుకునే వాళ్లుండీ, ఒకే సెల్ ఫోన్ ఉండటమూ మరోకారణం. పెద్దతరగతులు చదివే పిల్లలకు మొబైల్ అప్పగించి మిగిలిన పిల్లల్ని తమ వెంట పొలాలకు తీసుకువెళ్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు బడులు తెరచుకోకపోవడంతో ఫీజులు చెల్లించడం లేదు. ఆలాంటి విద్యార్థులు కూడాఆన్​లైన్ విద్యకు దూరమై.. పొలాల్లో కూలీలుగా మారుతున్నారు.

వాస్తవం వింటున్న విద్యార్థుల సంఖ్య తక్కువే..

మల్దకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 676 మంది విద్యార్థులుంటే సగటున 430మంది విద్యార్ధులు ఆన్​లైన్ తరగతులు వింటున్నారు. కానీ తరగతులు వింటున్నామని చెబుతున్న విద్యార్ధుల్లో 30శాతం మంది విద్యార్ధులు కూడా ఉపాధ్యాయులిచ్చే వర్క్ షీట్లను పూర్తి చేయడం లేదు. దీన్ని బట్టి ఆన్​లైన్ తరగతులను వాస్తవంగా ఎంతమంది వింటున్నారో.. ఎంతమందికి అర్థమవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. అమరవాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 318 మంది విద్యార్థులుంటే సగటున 156 మంది హాజరవుతున్నారు. వీరిలో సగం మంది కూడా వర్క్ షీట్లను పూర్తి చేయడం లేదు. తరగతుల పర్యవేక్షణ కోసం విద్యార్థుల ఇళ్లలోకి వెళ్తే.. విద్యార్థుల్ని పొలాలకు తీసుకువెళ్లినట్లుగా తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇది పిల్లల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

విద్యార్థులు పొలంబాట పడుతున్న మాట వాస్తవమేనంటున్న విద్యాశాఖ అధికారులు.. తల్లిదండ్రులు, పిల్లల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. పొలాల్లో కూలీలుగా మారుతున్న విద్యార్థులకు ఆన్​లైన్ పాఠాలు సరిగ్గా అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదిలాగే కొనసాగితే వచ్చే ఏడాది నాటికి బడి బయటి పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగే ప్రమాదం పొంచి ఉంది.

ఇదీ చదవండి: Schools Reopen: 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.