కామారెడ్డి జిల్లాపై కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది. జిల్లావ్యాప్తంగా రెండు నెలల్లో 1156 కేసులు నమోదయ్యాయి. గతంలో ప్రభుత్వ లాక్డౌన్ తర్వాత అడపాదడపా స్వచ్ఛంద లాక్డౌన్ పాటించినా... కేసులు తగ్గుముఖం పట్టలేదు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో సగం జిల్లా కేంద్రానికి సంబంధించినవే ఉండటం వల్ల వ్యాపారులు, అధికారుల్లో ఆందోళన మొదలైంది.
జిల్లా కేంద్రంలో 10 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్, అఖిలపక్షం నాయకులు, వ్యాపార వర్గాలు నిర్ణయించారు. నేటి నుంచి ఈ నెల 14 వరకు లాక్డౌన్ విధించారు. మెడికల్స్, ఆస్పత్రులు, కూరగాయలు, అత్యవసర దుకాణాలు తప్ప పట్టణంలో అన్ని మూసివేశారు. ప్రతి రోజూ వేలాది మందితో రద్దీగా కనిపించే జిల్లా కేంద్రం జనాలు లేక బోసిపోయింది. దుకాణాలు ఎక్కడికక్కడ మూసివేసి స్వచ్చంద లాక్డౌన్ పాటిస్తున్నారు. కరోనా కట్టడికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు.