ETV Bharat / state

కానిస్టేబుల్‌ అభ్యర్థులను ఆ ప్రచారం నమ్మొద్దంటున్న టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్

author img

By

Published : Aug 29, 2022, 10:37 PM IST

Tslprb on fake news రాష్ట్రంలో ఆదివారం జరిగిన కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయంటూ వస్తున్న వార్తలను టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ శ్రీనివాసరావు ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. అభ్యర్థులు ఆ వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ
టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ

Tslprb on fake news: రాష్ట్రంలో ఆదివారం జరిగిన కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయంటూ.. వస్తున్న వార్తలను నమ్మొద్దని పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రాథమిక పరీక్ష కీని నిపుణులతో తయారు చేయిస్తున్నామని అన్నారు. త్వరలో వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ప్రశ్నాపత్రంలో తప్పులు వచ్చాయంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని చెప్పారు. అభ్యర్థులను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్​సైట్​లో వచ్చిన వార్తలు లేదా.. సంబంధిత అధికారులు జారీ చేసిన ప్రెస్ నోట్​లను మాత్రమే నమ్మాలని శ్రీనివాసరావు సూచించారు. వ్యక్తిగత సందేశాలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోకి తీసుకోవద్దని తెలిపారు. అలాంటి వార్తలేమైనా వస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని శ్రీనివాసరావు తెలియజేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్‌ పోస్టుల ప్రాథమిక రాత పరీక్ష ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. పోలీస్‌ సివిల్‌ విభాగంలో 15,644.. ఆబ్కారీశాఖలో 614.. రవాణాశాఖలో 63 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం 1601 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు మరో 38 పట్టణాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. మొత్తం 6,61,198 మంది దరఖాస్తుదారులకుగాను 6,03,955 (91.34శాతం) మంది హాజరయ్యారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇంత భారీఎత్తున కానిస్టేబుళ్ల నియామకాల కోసం పరీక్ష జరిగింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల వేలిముద్రలు, డిజిటల్ ఫోటోలు సేకరించారు. దేహదారుఢ్య పరీక్షలు, తుది పరీక్షలో పాల్గొనే అభ్యర్థుల వేలిముద్రల ఆధారంగానే అనుమతి ఉంటుందని ఉన్నతాధికారులు తెలిపారు.

కనీస అర్హత మార్కులే లక్ష్యం: కానిస్టేబుల్‌ ప్రాథమిక రాతపరీక్షలో కనీస అర్హత మార్కుల్ని ఈసారి కుదించారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీలు 30శాతం.. బీసీలు 35శాతం.. ఇతరులు 40శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా పరిగణించేవారు. ఈసారి సామాజికవర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ.. 30శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్‌ టైప్‌లో 200 ప్రశ్నలుంటాయి. వీటిలో 60 మార్కులు వస్తే సరిపోతుంది. నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. అయిదు తప్పు సమాధానాలకు ఒక మార్కు తగ్గిస్తారు. ఇక్కడ అర్హత సాధిస్తే తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరు కావొచ్చు. ఇదీ గట్టెక్కితే తుది రాతపరీక్ష ఉండనుంది. ఆ పరీక్షలో మాత్రం నెగెటివ్‌ మార్కులుండవు.

ఇవీ చదవండి: కానిస్టేబుల్‌ రాతపరీక్షకు 91.34శాతం హాజరు, ఆలస్యం నిబంధనతో కొందరికి నో ఎంట్రీ

దేశానికి ఐదు రాజధానులు అవసరం, సీఎం కీలక ప్రతిపాదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.