ETV Bharat / state

రాష్ట్రంలో వీధికుక్కల బీభత్సం.. ఒక్కరోజే 16 మందిపై దాడులు

author img

By

Published : Feb 24, 2023, 10:05 AM IST

Street Dog Attacks In Telangana: తెలంగాణలో వీధి కుక్కలు దాడులకు పాల్పడి బీభత్సం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్​లోనే వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. ఓవైపు కుక్కలు.. మరోవైపు కోతుల దాడులతో పిల్లలను ఇంట్లో నుంచి బయటకు పంపలేకపోతున్నామని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల దాడిలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Street Dog Attacks In Telangana
Street Dog Attacks In Telangana

Street Dog Attacks In Telangana: తెలంగాణలో వీధి కుక్కల దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. మొన్న హైదరాబాద్​లోని అంబర్​పేటలో నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన మరవకముందే ఆ మరుసటి రోజే చైతన్యపురిలో మరో నాలుగేళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. తల్లిదండ్రులు అప్రమత్తమవ్వడంతో ఆ బాలుడు బతికిపోయాడు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో 14 మందిపై, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకరిపై, ఖమ్మం జిల్లాలో ఓ బాలుడిపై కుక్కలు దాడికి తెగబడ్డాయి.

Street Dogs Are Causing Havoc In Telangana: రంగారెడ్డి జిల్లాలోని యాచారం గ్రామంలో గురువారం రోజున ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గ్రామంలోని 10 మందిపై దాడి చేసి గాయపరిచింది. యాచారం గ్రామానికి చెందిన కొమురయ్య(65), మల్కీజ్‌గూడెంకు చెందిన వెంకటమ్మ(60), బోడ వెంకటమ్మ(55), గృహిణి రేణుక(32), గడల నందీశ్వర్‌(28), రాములమ్మ(60), నందివనపర్తి గ్రామస్థుడు సుధాకర్‌(50), మొండిగౌరెల్లి గ్రామస్థుడు శ్యాంసుందర్‌(26), బోడుప్పల్‌ వాసి చెందిన మహేశ్‌(36), ఇబ్రహీంపట్నం వాసి సాయమ్మ(55) గాయపడ్డారు.

Street dog attacks in Hyderabad: గంట సేపటి దాకా కుక్క బీభత్సం సృష్టించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దాడికి తెగబడ్డ కుక్కను పిచ్చికుక్కగా గుర్తించిన కొందరు యువకులు కొట్టి చంపేశారు. కుక్కల దాడిలో గాయపడ్డ నలుగురిని స్థానికులు ఫీవర్ ఆస్పత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లాలోనే కందుకూరు మండలం పరిధిలోని ఓ గ్రామంలో గురువారం రోజున నలుగురిపై కుక్కలు దాడిచేశాయి. కుక్కకాటుతో పీహెచ్‌సీలో చికిత్స పొందినట్లు వైద్యలు తెలిపారు.

గ్రామాల్లో వీధికుక్కలు బీభత్సం: గాయపడ్డ వారిలో గూడూరుకు చెందిన శ్రీశాంత్‌, రాజు(38), రాచులూరు వాసి చంద్రకాంత్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నారని వైద్యులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామంలోనూ వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. చిత్తలూరి పూలమ్మ అనే మహిళపై ఒక్కసారిగా పది కుక్కలు దాడికి తెగబడ్డాయి. కుక్కల ధాటికి కిందపడిపోయిన ఆమె.. కాళ్లు, చేతులపై గట్టిగా కరిచాయి.

గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మరోవైపు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలోనూ కుక్కలు స్వైర విహారం చేశాయి. బుధవారం రోజున పాఠశాలకు వెళ్లి వస్తున్న ఏడేళ్ల బాలుడు తాళ్లూరి నవశ్రీసందేశ్‌పై రెండు వీధి కుక్కలు దాడికి తెగబడ్డాయి. అతడిపైకి ఎగబడి ముఖంపై కరిచాయి. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.