ETV Bharat / state

VACCINATION DRIVE: 'వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసి.. దేశానికి ఆదర్శంగా నిలుస్తాం'

author img

By

Published : Aug 23, 2021, 11:52 AM IST

Updated : Aug 23, 2021, 3:05 PM IST

హైదరాబాద్‌లో ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతోంది. వంద శాతం వ్యాక్సినేషన్‌ కోసం జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ డ్రైవ్ ఫలితాలను అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

VACCINATION SPECIAL DRIVE, VACCINATION IN HYDERABAD
ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌, హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్

హైదరాబాద్‌ నగరంలో ప్రత్యేక వ్యాక్సినేషన్‌(vaccination) డ్రైవ్‌ కొనసాగుతోంది. వైద్యారోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ(GHMC), కంటోన్మెంట్‌ బోర్డు ఉమ్మడిగా డ్రైవ్‌ చేపట్టాయి. వంద శాతం వ్యాక్సినేషన్‌ కోసం జీహెచ్‌ఎంసీ ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 18 ఏళ్లు నిండినవారిలో ఇప్పటికే 70 శాతానికిపైగా కరోనా టీకా(corona vaccine) పూర్తయిందని అధికారులు గుర్తించారు. మిగతా వాళ్లకు వ్యాక్సిన్‌ వేసేందుకు సంచార వ్యాక్సిన్‌ వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సీఎస్ ధీమా

కరోనా నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలుస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్(cs somesh kumar) తెలిపారు. 15 రోజులపాటు జంటనగరాల్లోని జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ ప్రాంతాల్లోని 4,846 కాలనీల్లో నిర్వహించే వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ప్రతి ఒక్కరికీ టీకా అందిస్తామని ఆయన వెల్లడించారు. ఇంటింటా టీకా కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్‌లోని ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సీఎస్ పరిశీలించారు.

అధికారుల సమీక్ష

జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్‌తోపాటు ఇతర అధికారులు ఈ డ్రైవ్‌కు హాజరై పరిస్థితిని సమీక్షించారు. వ్యాక్సినేషన్ పూర్తైన కాలనీలకు సర్టిఫికేషన్ ఇవ్వడంతోపాటు ఇంటింటా నీలిరంగు స్టిక్కర్లను అతికించనున్నట్లు సీఎస్ వెల్లడించారు. ఫలితంగా మిగతా కాలనీలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నగరంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ డ్రైవ్ ఫలితాలను అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టనున్నట్లు సీఎస్ ప్రకటించారు.

నగరంలోని 4,846 కాలనీల్లో టీకా తీసుకోని వారిని గుర్తిస్తున్నాం. జీహెచ్ఎంసీ ప్రతి కాలనీకి సంబంధించి షెడ్యూల్ తయారు చేసింది. వ్యాక్సినేషన్ పూర్తైన ఇంటికి నీలి రంగు స్టిక్కర్ అతికిస్తున్నాం. వ్యాక్సినేషన్ డ్రైవ్ వల్ల చాలా మంది టీకా వేయించుకోడానికి వస్తున్నారు. భయం వల్లే చాలా మంది టీకాకు దూరంగా ఉన్నారు. వ్యాక్సిన్ పూర్తైన కాలనీలకు పత్రాలతో పాటు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తాం. 15 రోజుల్లో ప్రతి వ్యక్తికి ఒక డోసు టీకా పూర్తి చేస్తాం. నగరంలో పూర్తయ్యాక రాష్ట్రమంతటా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ చేపడుతాం. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం చేయడం లేదు. కరోనా మూడో ముప్పు ఆలోచన కూడా రాకూడదు. మూడో ముప్పు రాదు.. కానీ అప్రమత్తంగా ఉండాలి. కరోనా మూడో ముప్పు వస్తే ఎదుర్కోడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

-సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఆరోగ్య హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 4,846 కాలనీలు, బస్తీల్లో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. కంటోన్మెంట్‌ పరిధిలోని 360 బస్తీలు, కాలనీల్లో స్పెషల్ డ్రైవ్‌(VACCINATION SPECIAL DRIVE) నిర్వహిస్తున్నారు. టీకా తీసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ కేంద్రాలకు తరలించి టీకా వేస్తారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 రోజుల పాటు ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోని వారి వివరాలు సేకరిస్తారని అధికారులు వివరించారు.

ఇంటింటి సర్వే

జీహెచ్​ఎంసీ, ఆశా, అంగన్‌వాడి ఎంటమాలజీ విభాగాలకు చెందిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకోని వారి వివరాలు సేకరించి.... ఆరోగ్య సిబ్బందికి అందిస్తారు. వ్యాక్సిన్‌ వాహనాలు ఎప్పుడు ఏ ప్రాంతానికి ఏ సమయంలో వస్తాయనే వివరాలతో కూడిన కరపత్రాలను.... ఆయా కాలనీలు, బస్తీల్లో పంపిణీ చేస్తారు. 100 శాతం వ్యాక్సిన్‌ పూర్తయిన కాలనీలు, బస్తీలకు తమ ప్రాంతంలో 100 శాతం వ్యాక్సిన్‌ పూర్తయినట్టు బ్యానర్‌ను ప్రదర్శిస్తారు.

కొనసాగుతున్న ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌

ఇదీ చదవండి: భారత్​కు కరోనా మూడోదశ ముప్పు- కేంద్రానికి కీలక నివేదిక

Last Updated : Aug 23, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.