ETV Bharat / state

మల్లేపల్లిలో వాళ్లు ఎవరెవరిని కలిశారు?

author img

By

Published : Apr 14, 2020, 8:16 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మర్కజ్‌కు వెళ్లిన వ్యక్తులు కొంతమంది హైదరాబాద్‌లోని మల్లేపల్లి వచ్చి వెళ్లడం.. ఇలా వెళ్లిన వారి కారణంగా ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. దీంతో వారు ఇక్కడ ఎవరెవరిని కలిశారన్న దానిపై పోలీసులు, బల్డియా అధికారులతో కలిసి ఆపరేషన్‌ మొదలుపెట్టారు. తద్వారా కొంతమేర వైరస్‌ నిరోధానికి అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు.

special-focus-on-mallepalli
మల్లేపల్లిలో వాళ్లు ఎవరెవరిని కలిశారు?

మర్కజ్‌ నుంచి వచ్చిన అనేక మంది హైదరాబాద్ మల్లేపల్లిలోని ఓ ప్రార్థనా మందిరానికి వచ్చి రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి... తాము నేర్చుకున్న అంశాలను పలువురికి వివరించి రెండు తెలుగు రాష్ట్రాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అలా వచ్చిన 80 మందిని ఇప్పటివరకు గుర్తించారు. ఇందులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పదిమంది ఉన్నారు. వీరందరినీ క్వారంటైన్‌కు పంపించారు. మరో పది మందిని గాంధీ, ఛాతీ ఆసుపత్రులకు తరలించారు.

వారిని పూర్తి స్థాయిలో గుర్తిస్తాం...

ప్రస్తుతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపుగా 300కు చేరువవుతోంది. ఇందులో ఎక్కువ మంది మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారితో పాటు... వారితో కలిసి తిరిగిన వారే ఎక్కువగా ఉన్నారు. తాజా వ్యూహంలో భాగంగా మర్కజ్‌కు వెళ్లినవారు ఇంకా ఉంటే వారిని పూర్తిస్థాయిలో గుర్తించే పనిని పెద్దఎత్తున మొదలుపెట్టారు.

వైద్యుల పరిశీలనలోనే ఉన్నారు...

బండ్లగూడలోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తికి కరోనా వైరస్‌ సోకినట్లు సోమవారం అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో పది మంది మర్కజ్‌ వెళ్లిరాగా... వీరంతా మల్లేపల్లికి వచ్చి ఆ తరువాత తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. వారు ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్నారు. వారిని కలిసినవారిని మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో గుర్తించలేదని తెలుస్తోంది. నాంపల్లి రెడ్‌హిల్స్‌ ప్రాంతంలో రెండు రోజుల క్రితం నలుగురికి కరోనా సోకింది. వీరిలో ఒకరు మాత్రమే మర్కజ్‌కు వెళ్లి వచ్చారు. అతనితో పాటు భార్యకు కూడా వైరస్‌ సోకింది. మిగిలిన ఇద్దరు వీరిని కలవడం వల్ల వైరస్‌ బారినపడ్డారని అధికారులు చెబుతున్నారు.

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌... హైదరాబాద్‌లోని సర్కిళ్ల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. వైద్యాధికారులకు ప్రత్యేక బాధ్యత అప్పగించారు. ఒకవైపు ఇంటింటికి ఆశా సిబ్బంది, ఏఎన్‌ఎంలు వెళ్లి ఆరాతీసేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసు ఇంటిలిజెన్స్‌ విభాగంతోపాటు శాంతి భద్రతల విభాగంలోని పోలీసులు దీనిపైనే ప్రధానంగా దృష్టిసారించారు. బల్దియా సైతం ఇదే పనిలో ఉంది.

ఇదీ చూడండి: కరోనా ఎఫెక్ట్​: పసిబిడ్డకు 'శానిటైజర్‌'గా నామకరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.