ETV Bharat / state

ఆ కోర్టు ఇచ్చిన తీర్పు.. ఓ కన్నతల్లికి ఓదార్పు..!

author img

By

Published : Jan 4, 2023, 10:03 AM IST

Updated : Jan 4, 2023, 3:44 PM IST

Sons who neglected mother in Hyderabad: 60 సంవత్సరాల వయసులో కన్నతల్లికి అండగా ఉండాల్సిన కుమారులు ఆమెను వీధిపాలు చేశారు. బోలెడంత ఆస్తి ఉన్నా.. చేతిలో చిల్లిగవ్వ లేదు. చివరకు ఓ పూట భోజనం కూడా కరవైంది. అయినవాళ్లంతా ఉన్నా.. ఎవరూలేని అనాథలా బతుకీడుస్తున్న ఆ వృద్ధురాలు న్యాయం కోసం పోరాటం మొదలుపెట్టింది. 15 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి కోర్టును ఆశ్రయించింది. కళ్లులేని ఆ న్యాయస్థానం ఆ కన్నతల్లి గుండెకోతను మనసుతో చూసిందేమో.. ఆ కన్నపేగుకు న్యాయం జరిగేలా తీర్పునిచ్చింది.

hyderabad
hyderabad

Sons who neglected mother in Hyderabad: బిడ్డ మనసెరిగి ఆకలి తీర్చే అమ్మకు.. ఆరుపదుల వయసులో అన్నం కరవైంది. రూ.కోట్ల ఆస్తులున్న ఆ మాతృమూర్తి పస్తులతో కాలం గడపాల్సి వచ్చింది. కన్నపిల్లలు చెట్టంత ఎదిగినా.. తల్లికి నీడనివ్వలేదు. శరీరం సహకరించకున్నా..ఆ అమ్మ..15 కిలోమీటర్ల దూరం నడచివెళ్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించి బిడ్డల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేసి విజయం సాధించారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌కు చెందిన బాధితురాలికి రూ.5 కోట్ల విలువైన సొంత భవనం ఉంది. భర్త నాలుగేళ్ల క్రితం మరణించడంతో ఒంటరైన ఆమెకు అండగా ఉంటూ ధైర్యం చెప్పాల్సిన కుమారులు పట్టించుకోవడం మానేశారు.

కనీసం అన్నం పెట్టేందుకూ మనసు రాలేదు. నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటేశారు. ఆమె కొద్ది రోజుల పాటు వృద్ధాశ్రమంలో ఉన్నారు. తర్వాత తెలిసిన వారి సహకారంతో ఎలాగోలా నెట్టుకొచ్చిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ 2018 మేలో ఆర్డీవోకు మొరపెట్టుకున్నారు. విచారణ అనంతరం తల్లిబాగోగులు చూసుకోవాలంటూ అవార్డు మంజూరైనా కుమారులు ఖాతరు చేయలేదు. చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలితో బాధపడుతూ నీరసించిపోతూనే ఆ వృద్ధురాలు పురానీహవేలీలోని న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ)ను ఆశ్రయించారు.

దారి ఖర్చులకు డబ్బు లేకపోవడంతో కాలినడకనే వాయిదాలకు హాజరయ్యారు. ఆర్డీవో అవార్డును పరిశీలించిన అనంతరం ఇటీవల న్యాయసేవాధికార సంస్థ ఆమె ఇద్దరు కుమారులను పిలిపించి మొట్టికాయలు వేసింది. న్యాయపరంగా ఎదురయ్యే చిక్కులు, సమస్యలపై వివరించి హెచ్చరించింది. అనంతరం ఆస్తిని మూడు భాగాలు చేసి రెండు భాగాలు కుమారులకు, ఒక భాగం ఆమెకు వర్తించేలా ఒప్పందం కుదిర్చింది. మొదటి, రెండో అంతస్తుల్లో వచ్చే అద్దె మొత్తాన్ని ఆమెకు ఇవ్వాలని ఆదేశించగా..అందుకు కుమారులు అంగీకరించారు. ఈ మేరకు 2023 జనవరి నుంచి ప్రతినెలా చెరో రూ.18 వేలు చొప్పున మొత్తం రూ.36 వేలు బాధితురాలికి ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. ప్రతినెలా 10వ తేదీన ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయకపోతే.. వారి మధ్య జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకుని మొదటి, రెండో అంతస్తుల్లోని గదులను ఆమెకు ఇష్టం వచ్చిన వారికి అద్దెకు ఇచ్చే హక్కును కల్పిస్తూ డీఎల్‌ఎస్‌ఏ తీర్పు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 4, 2023, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.