ETV Bharat / state

రిసార్టుల్లో రేవ్ పార్టీలు... మత్తులో చీకటి సయ్యాటలు

author img

By

Published : Mar 16, 2021, 5:29 AM IST

రేవ్ పార్టీ సంస్కృతి తెలంగాణలో పేట్రేగిపోతోంది. ఎక్కువగా యువత ఈ కల్చర్​కు ఆకర్షితులవుతూ భవిష్యత్​ను నాశనం చేసుకుంటున్నారు. ఎంజాయ్ పేరుతో మత్తులో జోగుతున్నారు. నగరం నుంచి శివార్లకు పాకిన కల్చర్​పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూనే ఉన్నా... ఎక్కడో ఓచోట భయటపడుతూనే ఉన్నాయి.

రిసార్టుల్లో రేవ్ పార్టీలు... మత్తులో చీకటి సయ్యాటలు
రిసార్టుల్లో రేవ్ పార్టీలు... మత్తులో చీకటి సయ్యాటలు

అది 2012 జూన్‌ 22 అర్ధరాత్రి. హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి పక్కనే అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం షిగ్లిపూర్‌లోని స్వగృహ రిసార్ట్‌. మసక మసక చీకటిలో సంగీతం హోరు.. మద్యం జోరుకు వ్యభిచారం తోడైందనే సమాచారంతో పోలీసులు తనిఖీచేశారు. దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, సిక్కింలకు చెందిన 20 మంది యువతులు, 15 మంది యువకులు కనిపించారు.

చీకటి కార్యకలాపాలు...

ఖరీదైన 16 కార్లు.. విదేశీ మద్యం.. మత్తుపదార్థాలు కంట పడ్డాయి. విజయవాడ కృష్ణలంకకు చెందిన ఓ వ్యాపారి తన పుట్టిన రోజు వేడుకల కోసం ఇచ్చిన పార్టీగా తేలింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసులు నిఘా విస్తృతం చేసినా తరచూ చీకటి కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం సంస్థాన్‌ నారాయణపూర్‌ ఫాంహౌస్‌ రేవ్‌ పార్టీ ఉదంతం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఇందులో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులే కావడం గమనార్హం.

ఇంజినీరింగ్‌ చదివే తన కుమారుడు రిసార్టుల్లో అందించే నిషేధిత మాదకద్రవ్యాలకు బానిసగా మారాడని ఓ తండ్రి నాలుగేళ్ల క్రితం నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయడం ఈ సందర్భంగా గమనార్హం. బార్లు, పబ్‌లు, క్లబ్‌ల్లో మద్యం విచ్చలవిడిగా లభిస్తున్నా.. ‘అంతకుమించి’ ఆనందం కోరుకుంటున్న యువకులు, సంపన్నుల కుటుంబాల పిల్లలు ఈ వేదికల్ని ఎంచుకుంటున్నారు.

శివార్లలో...

రాజధాని శివార్లలో రిసార్ట్‌లు, ఫామ్‌హౌస్‌లు, విల్లాల్లో తరచూ ఏదో ఒక చీకటి ఉదంతం వెలుగుచూడటం సాధారణమైపోయింది. కొన్నిచోట్ల యజమానులే రిసార్టులు, ఫామ్‌హౌస్‌లను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చగా.. మరికొన్నిచోట్ల సిబ్బంది డబ్బులకు ఆశపడి చీకటి కార్యకలాపాలకు పరోక్షంగా సహకరిస్తున్నారు. వారాంతాల్లో పలువురు ఇలాంటి చోట్లకు వస్తున్నారు. నిర్వాహకులు రేవ్‌, ముజ్రా పార్టీల పేరిట ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిల్ని తెప్పించి నృత్యాలతో హోరెత్తిస్తున్నారు. వ్యభిచారమూ చేయిస్తున్నారు.

ఒకచోట పోగవుతూ...

మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా దొరికే వేదికలుగా ఈ పార్టీలు మారడంతో ‘అభిరుచులు’ కలిసిన పలువురు వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ.. ఒకచోట పోగవుతున్నారు. ఇలాంటి పార్టీల్లో పాల్గొనే వారి నుంచి రూ.5-10 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. గతంలో కొన్ని వేదికల్లో రూ.5 లక్షల వరకూ వసూలు చేసి ఏకంగా సభ్యత్వాలు ఇచ్చిన ఘటనలూ ఉన్నాయి. మరోవైపు తమ వ్యాపారాల్ని పెంచుకునేందుకు పలు సంస్థలు ఏజెంట్లను, డీలర్లను ఈ వేదికలకు పిలిపించి మజా చేయించిన ఉదంతాలు కోకొల్లలు. గజ్వేల్‌ ప్రాంతానికి చెందిన కొందరు ఆర్‌ఎంపీ వైద్యులూ ఈ తరహా పార్టీల్లో దొరకడం 2018లో సంచలనం సృష్టించింది.

డబ్బు కోసం...

సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని శంషాబాద్‌, నార్సింగి, గండిపేట, మొయినాబాద్‌, చేవెళ్ల, పటాన్‌చెరు, దుండిగల్‌, మేడ్చల్‌, శామీర్‌పేట్‌, కీసర, ఘట్‌కేసర్‌, బీబీనగర్‌, సంస్థాన్‌ నారాయణపూర్‌, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం.. తదితర ప్రాంతాల్లో ఫామ్‌హౌస్‌లు, రిసార్టులు, విల్లాలు ఎక్కువగా కొలువుదీరాయి. రిసార్టుల్లో స్థాయిని బట్టి ఒక్కో రాత్రికి రూ.1000-20,000 వరకు వసూలు చేస్తున్నారు. పలు వేదికల్లో గదుల్ని ఆన్‌లైన్‌లోనే బుక్‌ చేసుకునే సదుపాయముంది. నిబంధనలు ఎంతమేరకు అమలవుతున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

నిబంధనలేవి..?

వాస్తవానికి గదుల్ని అద్దెకిచ్చేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత వ్యక్తుల ధ్రువీకరణ పత్రాల్ని తీసుకోవాలి. ఆహ్లాదం కోరుకునే కుటుంబసభ్యుల విడిదికి మాత్రమే ఇక్కడి గదుల్ని వినియోగించాలి. చాలా చోట్ల నిర్వాహకులు ఆ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. డబ్బులు వస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గంటల లెక్కన గది అద్దెకు కావాలనుకునే జంటలకు కొందరు నిర్వాహకులు రెడ్‌కార్పెట్‌ పరుస్తున్నారు. గంట, రెండు గంటలకే రూ.రెండు వేల వరకు వస్తాయనే ఆశతో సై అంటున్నారు.

రిసార్టులు, ఫామ్‌హౌస్‌లలో అయితే ఎవరి కంట పడకుండా ఉండేందుకు అవకాశం ఉండటంతో కొందరు వీటిని ఎంచుకుంటున్నారు. 2018లో శంకర్‌పల్లిలోని ప్రముఖ రిసార్టులో గది అద్దెకు తీసుకున్న యువకుడు.. తన స్నేహితురాలైన డిగ్రీ విద్యార్థినిని గదిలోనే దారుణంగా హత్య చేయడం తెలిసిందే.

ఇదీ చదవండి: బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.