ETV Bharat / state

Pending Bills Issue Telangana : అసెంబ్లీ సమావేశాల వేళ.. మరోసారి చర్చకు గవర్నర్ తిప్పిపంపిన బిల్లుల అంశం

author img

By

Published : Jul 29, 2023, 8:17 AM IST

Pending Bills Issue in Telangana Assembly Sessions 2023 : గవర్నర్ తిప్పిపంపిన బిల్లులపై రాష్ట్రప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది. గురువారం నుంచి ఉభయసభల సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో రెండు బిల్లుల భవితవ్యంపై చర్చ మొదలైంది. యధాతథంగా వాటిని ఆమోదిస్తారా... లేక సవరణలు చేస్తారా అన్న అంశం ఆసక్తి రేపుతోంది.

Etv Bharat
Etv Bharat

Telangana Assembly Sessions 2023 : గురువారం నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. గతంలో శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లుల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్... కొన్నింటిని ఆమోదించగా, మరికొన్నింటిని ఆమోదించలేదు. మూడుబిల్లులపై అభిప్రాయం, వివరణ కోరిన గవర్నర్ రెండు బిల్లులను వెనక్కి పంపారు. అజమాబాద్ పారిశ్రామిక, పంచాయతీరాజ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులపై న్యాయశాఖ అభిప్రాయం, వివరణను కోరారు. వివరణలు కోరిన బిల్లులకు సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు బిల్లులను మాత్రం వెనక్కు పంపారు.

Telangana Pending Bills Issue Update : 2022 పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు, డీఎంఈ పదవీవిరమణ వయస్సు పెంపునకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లులను తిప్పి పంపారు. ఆ రెండు బిల్లులపై గవర్నర్ అభ్యంతరాలు లేవనెత్తారు. వైద్యవిద్యలో పాలనాపరమైన పోస్టుల వయోపరిమితి పెంపు బిల్లుతో 61 ఏళ్లు నిండిన వారు తిరిగి నియామకమయ్యే వరకు ఒక్కరోజు విధులు నిర్వహించకపోయినా వేతనాలు పొందే అవకాశం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. బిల్లు కారణంగా ఖజానాపై ఎలాంటి భారం పడబోదన్న ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రకటన సరైందా లేక తప్పుదారి పట్టించేదా అని ప్రశ్నించారు. 2019 జూన్ నుంచే చట్ట సవరణ అమలుతో ఎంతమందికి లబ్ది చేకూరుతుందని ప్రశ్నించిన గవర్నర్.. రాష్ట్ర ఖజానాపై ఏ మేరకు భారం పడుతుందని అడిగారు. ఇందుకు సంబంధించిన అంశాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లుకు సంబంధించి పలు అభ్యంతరాలను గవర్నర్‌ లేవనెత్తారు. రాజ్యాంగం ప్రకారం పురపాలికల్లో మైనార్టీలకు ఎలాంటి రిజర్వేషన్లు లేవని, పురపాలనలో వ్యక్తిగత నైపుణ్యం, అనుభవం ఉన్న వారిని మాత్రమే కో-ఆప్షన్ సభ్యులుగా నియమించాలని పేర్కొన్నారు. ప్రతిపాదిత చట్ట సవరణ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తోందని... గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం నిర్ధిష్ట ప్రమాణాలకు లోబడి మైనార్టీ అన్న పదాన్ని నిర్దేశించేలా బిల్లును వెనక్కిపంపారు. ఆ రెండు బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇపుడు ఏం చేస్తుందన్నది ఉత్కంఠగా మారింది.

గురువారం నుంచి అసెంబ్లీ ఉభయసభల సమావేశాలు : గురువారం నుంచి శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానుండటంతో రెండు బిల్లుల అంశం మరోమారు చర్చనీయాంశమైంది. రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో తిరిగి ప్రవేశపెడుతుందా... లేదా... చూడాలి. ఒకవేళ ప్రవేశపెడితే వాటిలో ఏ మార్పులు, చేర్పులు లేకుండా యధాతథంగా ప్రవేశపెడతారా లేక ఏవైనా మార్పులు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ మార్పులు చేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సవరణలు చేసి ఉభయసభల్లో చర్చించి ఆమోదం పొందాల్సి ఉంటుంది. రెండు బిల్లుల విషయం సోమవారం నాటి మంత్రివర్గ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. యధాతథంగా లేదా మార్పులు చేయాల్సి వస్తే కేబినెట్‌లో చర్చించి ఆమోదించాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.