ETV Bharat / state

సర్కారు కొలువే సో బెటరూ..!

author img

By

Published : May 26, 2022, 5:43 AM IST

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ల నేపథ్యంలో ప్రైవేటురంగంలోని చిరుద్యోగులు సర్కారు కొలువు కలను సాకారం చేసుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం వారు ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు దీర్ఘకాలిక సెలవులు పెడుతున్నారు. దీంతో పలు సంస్థలు సిబ్బంది దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.

సర్కారు కొలువే సో బెటరూ
సర్కారు కొలువే సో బెటరూ

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థులే కాకుండా చిరుద్యోగులు సర్కారు కొలువుల కల సాకారం చేసుకొనేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలూ వదిలేస్తున్నారు. ఉపాధి ఉంది.. రండి అని పిలుస్తున్నా రావడం లేదు. వేల మంది ఒక్కసారిగా ఇలా వెళ్లిపోవడంతో యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, దుకాణదారులు, మాల్స్‌, గేటెడ్‌ కమ్యూనిటీలు తదితరాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో ప్రభుత్వ జాబుల జాతర నడుస్తుండడంతోనే ఈ పరిస్థితి నెలకొందని పలు సంస్థలు పేర్కొంటున్నాయి.

ఒకదాని వెంట మరో ప్రకటనతో..

రాష్ట్రంలో 81 వేల ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పోలీసు, గ్రూప్‌-1తో పాటు.. ఆర్టీఏ, ఎలక్ట్రిసిటీ సంస్థలు నోటిఫికేషన్లు ఇవ్వగా.. త్వరలోనే గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దీంతో రూ.30వేల లోపు జీతం ఉన్న ప్రైవేటు ఉద్యోగులంతా ఏమాత్రం ఆలోచించకుండా దీర్ఘకాల సెలవులు పెట్టేసి.. అవసరమైతే మానేసి మరీ పుస్తకాలు చేతబట్టారు.

హైదరాబాద్‌లో చదువుకుంటూ ఖాళీ సమయంలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసేవారు సెలవులు పెట్టేశారు. దీంతో కుర్రాళ్లు దొరకడంలేదని ఆహార డెలివరీ సంస్థలు వాపోతున్నాయి. మరోపక్క అనేక మంది క్యాబ్‌లను కూడా పక్కన పెట్టేశారు. ఐటీ సంస్థల్లో కార్యాలయ సిబ్బందీ రావడంలేదు. ‘‘ప్రస్తుతం 30 శాతం ఐటీ ఉద్యోగులే కార్యాలయాలకు వచ్చి పని చేస్తున్నారు. వారికి సహకారంగా ఉండే సిబ్బంది లేకపోవడంతో ఇంటి నుంచే పని చేసుకోమని సూచించామని’’ నగరంలోని ఓ ఐటీ సంస్థ సీఈవో చెప్పారు. ఇప్పుడు 22 నుంచి 40 ఏళ్ల వయసు వారు కొలువులొదిలి గ్రంథాలయాలు, కోచింగ్‌ కేంద్రాలు, విశ్వవిద్యాలయాల్లో చదువుతూ కనిపిస్తున్నారు.

కొలువు కొట్టాలని..

‘‘హైదరాబాద్‌లోని ఓ ఐటీ సంస్థలో అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో ఆపరేటర్‌గా పనిచేసేవాడిని. ఉద్యోగానికి రాజీనామా చేశా. గ్రూప్స్‌కు సన్నద్ధమవుతున్నా. గతంలో పోస్టులు తక్కువగా ఉండడంతో అవకాశం దక్కలేదు. ఈసారి కచ్చితంగా కొలువు కొట్టాలన్న లక్ష్యంతో ఉన్నా’’ - టి.శివ. రేవళ్లి మండలం, వనపర్తి జిల్లా

భవిష్యత్తులో ఉండకపోచ్చని..

‘‘నగరంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా చేస్తున్నా. నెలకు రూ.15 వేలు ఇచ్చేవారు. ప్రభుత్వ నోటిఫికేషన్ల ప్రకటన వచ్చిన వెంటనే ఈ ఉద్యోగం మానేశా. మూడు నెలలుగా ఇంకేం వ్యాపకాలు పెట్టుకోకుండా సిద్ధం అవుతున్నా. ఒకేసారి ఇన్ని వేల పోస్టుల భర్తీ భవిష్యత్తులో ఉండకపోవచ్చు. అందుకే ఆర్థికంగా ఇబ్బందులున్నా కష్టపడి చదువుతున్నా’’ - బండ రాకేశ్‌, వీరన్నపేట గ్రామం, మహబూబ్‌నగర్‌

ఇదీ చదవండి: ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు..!

వైకల్యంపై ఒంటికాలి పోరాటం... పదేళ్ల బాలిక సంకల్పం భేష్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.