ETV Bharat / state

KTR Review on Musi Development Project : మూసీ పరిధిలో ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక చర్యలు..

author img

By

Published : Aug 17, 2023, 8:06 PM IST

KTR On SNDP Project in Hyderabad
KTR Review on Musi Development Project

KTR Review on Flood Prevention in Hyderabad : మూసీనది ఒడ్డున ఇళ్లలో నివసిస్తున్న పేదలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. మూసీ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా కబ్జాలను తొలగించి.. అక్కడ నివసిస్తున్న వారికి నగరంలో రెండు పడక గదుల ఇళ్లను కేటాయించాలని.. మంత్రి కేటీఆర్​ అధికారులను ఆదేశించారు.

KTR On SNDP Project in Hyderabad : హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వం నిర్మించిన 10 వేలకు పైగా రెండు పడక గదుల ఇళ్లను మూసీనది ఒడ్డున దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించి.. మూసీ నదిపైనా కబ్జాలను తొలగించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పురపాలకశాఖా మంత్రి కేటీఆర్​(Minister KTR) వెల్లడించారు. అత్యంత పేదరికం వల్ల మూసీనది పక్కన దుర్భరమైన స్థితిలో జీవనం సాగిస్తున్న వీరందరికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు గొప్ప ఉపశమనం కలిగిస్తుందని మంత్రి తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలోని ఎమ్మెల్యేల సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల పైన విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేకంగా చేస్తున్న అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపైన చర్చించారు. జంటనగరాల అభివృద్ధికై చేపట్టిన ఎస్​ఆర్​డీపీ, ఎస్​ఎన్​డీపీ కార్యక్రమాల ప్రస్తుత, భవిష్యత్​ కార్యకలాపాలపై చర్చించారు.

నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు జీహెచ్​ఎంసీ ఎమ్మెల్యేలందరూ.. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వరద నివారణ కోసం చేపట్టిన ఎస్​ఎన్​డీపీ కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో వరద చేరి మునిగిపోయిన అనేక ప్రాంతాలు.. ఈ సంవత్సరం భారీగా వర్షాలు కురిసినా వరద ప్రమాదం నుంచి తప్పించుకున్నాయని తెలిపారు.

Removal of Illegal Constructions on Musi : మూసీ వెంట వరదకు అడ్డంకిగా ఉన్న నిర్మాణాలను తొలగించి.. మూసీ నాలాలను బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు. అడ్డంకులు తొలిగించిన అనంతరం.. మూసీ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టేందుకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే మూసీ ప్రాజెక్టు అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రాథమికంగా ప్లానింగ్‌ పూర్తి చేసిందని మంత్రి వివరించారు.

నగరంలో వాననీటి నిర్వహణ కార్యక్రమం చక్కగా అమలవుతోందన్నారు. త్వరలో రెండో విడత ఎస్​ఎన్​డీపీ కార్యక్రమానికి నిధులు మంజూరు చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.​ అర్హులైన పేదలందరికీ నగరంలో త్వరలో.. రెండుపడక గదుల ఇళ్లు కేటాయించనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ నగరంలో గత పది సంవత్సరాల్లో జరిగిన విస్తృతమైన అభివృద్ధి పట్ల.. ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారన్న నివేదికలు తమ వద్ద ఉన్నాయని మంత్రి కేటీఆర్ సమావేశంలో తెలిపారు. తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి.. రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు అడగాలని సమీక్షకు హాజరైన ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.