ETV Bharat / state

పంటల సాగులో భారీగా పెరుగుతోన్న రసాయన ఎరువుల వాడకం

author img

By

Published : Feb 18, 2022, 5:44 AM IST

పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం తీరు ఏటా భారీగా పెరుగుతోంది. పైర్లు ఏపుగా పెరగాలనే ఆశతో రైతులు రసాయనాలను విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్లు జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయశాఖ 2020-21 సంవత్సరంలో చేసిన అధ్యయనంలో గుర్తించారు.

పంటల సాగులో పెరుగుతోన్న రసాయన ఎరువుల వాడకం
పంటల సాగులో పెరుగుతోన్న రసాయన ఎరువుల వాడకం

.

నత్రజని పోషకంతో ఉండే యూరియా రసాయన ఎరువు వేస్తే పైరు ఏపుగా పెరిగి అధిక దిగుబడి వస్తుందనే అపోహ రైతుల్లో బాగా ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ఏటా వానాకాలం (ఖరీఫ్‌), యాసంగి (రబీ) సీజన్లలో కలిపి యూరియా ఒక్కటే 20 లక్షల టన్నుల దాకా వినియోగిస్తున్నారు. వచ్చే జూన్‌ నుంచి మొదలయ్యే వానాకాలం సీజన్‌లో రాష్ట్రానికి యూరియా ఒక్కటే 10 లక్షల టన్నులకు పైగా అవసరపడుతుందని ప్రాథమిక అంచనా. దేశంలో పంజాబ్‌ తరవాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే రసాయన ఎరువుల సగటు వాడకం చాలా ఎక్కువగా ఉందని, వీటిని నియంత్రించాలని కేంద్రం రాష్ట్ర వ్యవసాయ శాఖకు సూచించింది. రసాయన ఎరువులకు బదులు తొలకరి వానలు కురవగానే పిల్లిపెసర, జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట విత్తనాలు చల్లి అవి ఏపుగా పెరగగానే పొలంలో కలియదున్నితే భూమికి అవసరమైన నత్రజని పోషకం బాగా అందుతుందని, పంటకు యూరియా వాడకం పెద్దగా అవసరం ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.

.

భారీగా పెరిగిన భాస్వరం
భాస్వరం పోషకాన్ని పంటలకు ఇచ్చేందుకు ‘డై అమ్మోనియం ఫాస్ఫేట్‌’ (డీఏపీ) పేరుతో మార్కెట్‌లో రసాయన ఎరువును విక్రయిస్తున్నారు. తెలంగాణలో 2013-21 మధ్య ఏడేళ్లకాలంలో భాస్వరం రసాయన ఎరువు వినియోగం ఏకంగా 36 శాతం పెరిగినట్లు అధ్యయనంలో గుర్తించారు. పత్తి, పసుపు, వేరుశనగ తదితర పంటలు అధికంగా సాగుచేసే ప్రాంతాల్లో భూసార పరీక్షలు చేస్తే నేలలో అవసరానికి మించి భాస్వరం ఉన్నట్లు తేలింది. ఇది ఎక్కువగా ఉంటే డీఏపీ ఎరువును పెద్దగా వాడాల్సిన అవసరం ఉండదు. అయినా రాష్ట్రంలో రెండు సీజన్లలో కలిపి ఏటా 5 లక్షల టన్నుల దాకా డీఏపీ చల్లుతున్నారు.

.

నేల, నీరు కలుషితం
-డాక్టర్‌ జగదీశ్వర్‌, పరిశోధన సంచాలకుడు, ఆచార్య జయశంకర్‌ విశ్వవిద్యాలయం

రాష్ట్రంలో మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతున్నట్లు గుర్తించాం. కొన్ని జిల్లాల్లో నేలలో ఇప్పటికే భాస్వరం, నత్రజని, పొటాష్‌ చాలా ఎక్కువగా ఉన్నా మళ్లీ రసాయనాలు చల్లుతున్నారు. వీటివల్ల అక్కడ సాగునీరు, నేల మాత్రమే కాకుండా పర్యావరణంలోకి సైతం కాలుష్యం విడుదలై అనేక సమస్యలు వస్తున్నాయి. సాధారణంగా సాంబ మసూరి వరి వంగడాలతో సాగుచేస్తే పంట సాగు కాలపరిమితి 150 రోజులకు పైగా ఉంటుంది. ఇతర దొడ్డు రకాల వరి వంగడాలు సాగుచేస్తే 120 నుంచి 130 రోజుల్లోనే పంటకోతకు వస్తుంది. కానీ రసాయన ఎరువులను మాత్రం సాంబ మసూరికి ఎంత వేస్తారో ఇతర రకాలకు సైతం అంతే మొత్తంలో వేస్తున్నారు. వరికి ఎకరానికి 3, 4 బస్తాల యూరియా చల్లాలనే అపోహ చాలామందిలో ఉంది. వాస్తవానికి భూసార పరీక్ష చేయిస్తే ఒక బస్తా కన్నా తక్కువ వేస్తే సరిపోతుందని గుర్తించాం. ఇతర పంటలకూ ఇలాగే డీఏపీ, కాంప్లెక్స్‌ ఎరువుల వాడకం వల్ల నేలలు నిస్సారమవుతున్నాయి.

ఇదీ చూడండి: జనమయమైన జంపన్న వాగు.. పుణ్యస్నానాలతో పునీతులవుతున్న భక్తులు..

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.