ETV Bharat / state

students suicides in Telangana : చావు పరిష్కారం కాదు.. బతికి సాధిద్దాం బిడ్డా

author img

By

Published : May 11, 2023, 10:26 AM IST

students suicides in Telangana : ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు ఎంత చురుకుగా ఉన్నారో అంతే సెన్సిటివ్​గా ఉన్నారు. చిన్న విషయాలను భూతద్దంలో పెట్టి చూసి సరైన గైడెన్స్ లేక క్షణికావేశంలో ఊపిరి తీసుకుంటున్నారు. ఆశలు.. ఆకాంక్షలు.. వాస్తవాల మధ్య నలిగిపోతున్న చిన్నారులు క్షణాల్లో కఠిన నిర్ణయాలతో ప్రాణాలు బలిచేసుకుంటున్నారు. ఒత్తిడితో అర్ధాంతరంగా అశువులు బాసుతున్నారు.

students suicides
కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే

students suicides in Telangana : ప్రస్తుతం ఇంటర్ ఫలితాలు నేపథ్యంలో రాష్ట్రంలో 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలారు. ప్రతి ఏడాది ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది. అయోమయంలో.. అర్ధంలేని నిర్ణయాలను తీసుకుని అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తూ కన్నవారికి కడుపుకోత మిగిలిస్తున్నారు. మెరుగైన ప్రతిభ చూపాలనే ఒత్తిడి, పోటీతత్వం, తల్లిదండ్రుల కోరికలను నెరవేర్చలేకపోతున్నామనే ఆందోళన, భవిష్యత్తు లేదనే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

Inter students suicides in Telangana : పరీక్షల్లో ఫలితాలపై బెంగతో చాలా ప్రాణాలు తీసుకుంటున్నారు. మార్కులు తక్కువొస్తాయేమో అని కొందరు, ఫెయిల్ అయ్యామని మరికొందరు, తక్కువ మార్కులు వచ్చాయని ఇంకొందరు. పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి ఇంటర్​లో అదే స్థాయిలో మార్కులు సాధించలేకపోతున్నామని కొంతమంది విద్యార్థులు ఇలా వివిధ కారణాలతో కఠిన నిర్ణయాలు తీసుకుని తనువు చాలిస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు చదువు నిమిత్తం పట్టణాలకు వస్తుంటారు. దీంతో పిల్లలు తల్లిందండ్రులకు దూరంగా విద్యాసంస్థలకు దగ్గరగా ఉంటూ ఒత్తిడికి గురవుతుంటారు. దీంతో పిల్లలకు రకరకాల ఆలోచనలు భయాందోళనలు కలుగుతుంటాయి. ఆత్మహత్యలకు పాల్పడటం అనేది అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయం కాదని సైకాలజిస్టులు అంటున్నారు. జీవితంలో గెలుపు, ఓటములను సమానంగా తీసుకునేలా వారిలో ఆత్మవిశ్వాసం పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. చదువు ఒక్కటే భవిష్యత్తుకు మార్గం కాదనే భావనను పిల్లల్లో పెంపొందించాలంటున్నారు.

ఆచరణలో లేని కౌన్సెలింగ్‌ వ్యవస్థ : పిల్లలు అధికంగా విద్యాసంస్థల్లోనే గడుపుతుంటారు. కాబట్టి వారి ఆలోచనలను, వారి శైలిని ఉపాధ్యాయిలు పసిగట్టాలి. ఇతర ఆలోచనల నుంచి దూరం చేయడానికి కళాశాలల్లో కౌన్సెలింగ్‌ విధానాన్ని తీసుకువచ్చినా ఆచరణ సాధ్యం కాలేకపోతోంది. తమకేదైనా సమస్య ఉందని ఎవరైనా వస్తే తప్ప వారిని పట్టించుకోవడంలేదు. పిల్లల్లో మార్పులు, నిరాశ, నిస్పృహ, భిన్న ఆలోచనలు వంటి అంశాలను గుర్తించకపోవడంతో సమస్య తీవ్రత పెరుగుతోంది.

పెరుగుతున్న కేసులు : విద్యార్థుల ఆత్మహత్యలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్లు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండగా రాష్ట్రంలో 2017-21 మధ్య రెండేళ్లు కాస్త తగ్గాయి. అయితే అత్యధికంగా 2021లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. 2021లో రాష్ట్రంలో 10,171 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో విద్యార్థులు 567 మంది ఉన్నట్లు ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదికలో తెలిపింది. దేశంలో పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనే కారణంతో బలవన్మరణాలు చేసుకున్నవారు ఒక శాతంగా ఉన్నారు.

5దశల్లో ఎప్పుడు గుర్తించినా కాపాడవచ్చు : 'పరీక్షలలో ఫెయిల్ అయినందుకు స్నేహితులు తక్కువ చూపు చూస్తారని, స్నేహితులు ముందుకెళ్లిపోతారని.. తమకు ఇంకా భవిష్యత్తు ఉండదని... తల్లిదండ్రులు కోపడతారనే ఆలోచనలు విద్యార్థులను మానసికంగా కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. పరీక్షల్లో బాగా రాశామని భావించే వారు రిజల్ట్స్ వచ్చినప్పుడు కుంగిపోతుంటారు. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉంటే తమలోని ఆందోళనను,భయాలను వారితో పంచుకునే ప్రయత్నం చేస్తారు. పిల్లల ప్రవర్తనలో మార్పులు గుర్తించి తల్లిదండ్రులు ధైర్యం ఇవ్వగలిగితే పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు.

నిజానికి ఆత్మహత్య హఠాత్తుగా తీసుకునే నిర్ణయం కాదు. 4 దశలు దాటి 5వ దశలో ఆత్మహత్యాయత్నం చేస్తారు. మొదట్లో చనిపోవాలనే ఆలోచనలు వస్తాయి. ఆ తర్వాత ఎలా చనిపోవాలనే ఆలోచన చేస్తుంటారు. నిర్ణయానికి వచ్చాక వారి ప్రవర్తనలో హఠాత్తుగా మార్పులు కన్పిస్తాయి. మాటల్లోనూ వాటిని చెబుతుంటారు. 4వ దశలో సరైన సమయం కోసం ఎదురుచూస్తుంటారు. సాధారణంగా ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. పరిస్థితులు అనువుగా లేకపోతే చనిపోవాలనే ఆలోచనలో వెనక్కి తగ్గుతుంటారు.ఇవన్నీ దాటుకుని 5వ దశలో ఆత్మహత్యకు పాల్పడతారు. మనం పిల్లల పరిస్థితిని ఏ దశలో గుర్తించగలిగినా ఆత్మహత్యకు పాల్పడకుండా కాపాడవచ్చు.'_డాక్టర్‌ అనిత, క్లినికల్‌ సైకాలజిస్టు

ధైర్యం చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే : 'పిల్లలకు ధైర్యం కలిగించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రాధాన్యం ఇవ్వాలి. హ్యూమన్ రిలేషన్స్ అనేవి చాలా ముఖ్యం. పిల్లలకు ఒంటరి వారమనే భావన నుంచి బయటపడేల చేయాలి. ఎలాంటి విషయాలనైనా స్వేచ్ఛగా చెప్పుకునే ఫ్రీడం తల్లిదండ్రులు ఇవ్వాలి. పిల్లల నేపథ్యం అనేది కీలకమైన అంశం. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు రావడం కూడా పిల్లలపై ప్రభావం చూపుతున్నాయి. బాధ, కోపం, భయం, ఆత్మన్యూనత, తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోతున్నామనే బాధతో విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఆత్మహత్య తప్ప మరో పరిష్కారం లేదనుకుంటున్నారు.. పిల్లలకు అండగా ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే. కుటుంబం తర్వాత ఎక్కువ సమయం విద్యార్థులు ఉండేది విద్యా సంస్థల్లోనే. ఉపాధ్యాయులు పిల్లలను నిశితంగా పరిశీలించాలి. వారి ప్రవర్తనలో మార్పు ఉంటే గుర్తించాలి. అందుకు కారణాలను విశ్లేషించి భరోసా కల్పించడం ద్వారా ఆత్మహత్యలను చాలా వరకు అధిగమించవచ్చు.'_విశాల్‌ ఆకుల, ప్రొఫెసర్‌ సైకియాట్రి, ప్రభుత్వ వైద్య కళాశాల, జగిత్యాల

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.