ETV Bharat / sports

ఐవోఏ సారథిగా పీటీ ఉష.. 95ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా..

author img

By

Published : Dec 10, 2022, 3:30 PM IST

దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. దీంతో ఐవోఏ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న తొలి మహిళగా నిలిచారు.

PT Usha becomes first woman IOA president
ఐవోఏ సారథిగా పీటీ ఉష.. 95ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా..

దిగ్గజ అథ్లెట్‌ పీటీ ఉష భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. శనివారం రిటైర్డ్​ సుప్రీం కోర్టు జడ్జి ఎల్​ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించగా ఆమె ఏకగ్రీవంగా ఎంపికైంది. దీంతో 95ఏళ్ల ఐవోఏ చరిత్రలో అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న తొలి మహిళగా నిలిచారు. మహరాజా యాదవీంద్ర సింగ్‌ (1934, క్రికెట్‌) తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించబోతున్న తొలి స్పోర్ట్స్‌ పర్సన్‌ ఆమే.

భారత అథ్లెటిక్స్‌ చరిత్రలో ఎన్నో మరుపురాని విజయాలతో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న 58 ఏళ్ల ఉష.. క్రీడా పాలకురాలిగా ఎన్నిక కావడం ఇదే తొలిసారి. 1984 ఒలింపిక్స్‌లో 400 మీటర్ల హర్డిల్స్‌లో సెకనులో వందో వంతులో పతకం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచిన ఈ పయ్యోలి ఎక్స్‌ప్రెస్‌.. 1982, 1994 ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల పరుగులో రెండేసి పసిడి పతకాలతో మెరిసింది. ఒక్క ఆసియా ఛాంపియన్‌షిప్‌లోనే 14 స్వర్ణాలతో సహా ఆమె 23 పతకాలు గెలుచుకుంది. ముఖ్యంగా 1986 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా 5 స్వర్ణాలు సహా 6 పతకాలతో సంచలన ప్రదర్శన చేసింది. ఇటీవల ఐవోఏ అథ్లెటిక్స్‌ కమిషన్‌ ఎన్నిక చేసిన ఎనిమిది మంది అత్యున్నత భారత అథ్లెట్లలో ఉష కూడా ఒకటి. కాగా, ఉషతో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గగన్‌ నారంగ్‌ (ఉపాధ్యక్షుడు), అజయ్‌ పటేల్‌ (సీనియర్‌ ఉపాధ్యక్షుడు) ఎన్నిక కావడం లాంఛనమే. ఎందుకంటే ఈ పదవులకు వీళ్లు మాత్రమే దరఖాస్తు చేశారు.

ఇదీ చూడండి: పాక్​లో టీమ్​ఇండియా పర్యటన.. భారత విదేశాంగ శాఖ మంత్రి ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.