ETV Bharat / sports

2023 ప్రపంచకప్​ వరకు గంగూలీ ఉండాలి: గావస్కర్

author img

By

Published : Jul 26, 2020, 7:50 AM IST

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ బృందాన్ని 2023 ప్రపంచకప్​ వరకు కొనసాగించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. బయోబబుల్ టెస్టు విసుగు తెప్పించిందని పేర్కొన్నాడు.

2023 ప్రపంచకప్​ వరకు గంగూలీ ఉండాలి: గావస్కర్
దిగ్గజ క్రికెటర్ గావస్కర్

"కొన్ని నెలల స్తబ్ధత అనంతరం మన ప్రియమైన ఆటకు సంబంధించి మైదానం లోపల, వెలుపల చాలా కార్యకలాపాలు మొదలయ్యాయి. క్రికెట్‌ ఆస్ట్రేలియా అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఐసీసీ ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయాలని నిర్ణయించింది. టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని సీఏ మేలోనే చెప్పింది. అయినా ఐసీసీ తాత్సారం చేసింది. ఒకవేళ ప్రపంచకప్‌ వాయిదా పడితే ఆ విరామంలో ఐపీఎల్‌ నిర్వహించాలనుకుంటున్న బీసీసీఐ ప్రణాళికలను దెబ్బతీయడం కోసం టోర్నీపై నిర్ణయాన్ని ఆలస్యం చేయాలన్నది ఆలోచనైతే.. అది ఎప్పుడూ విఫలమయ్యే ఆలోచనే. బీసీసీఐ, సీఏ నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. ఏం జరగబోతోందో బీసీసీఐకి పక్కాగా తెలుసు. దాని ప్రకారమే ప్రణాళికలు రచించుకుంది. ప్రపంచ క్రికెట్‌కు అన్ని దేశాల కంటే ఎక్కువగా లబ్ధి చేకూర్చే దేశం విలువను.. వ్యక్తిగత అజెండా కోసం తగ్గించడం విచారకరం. ఐసీసీ తర్వాతి ఛైర్మన్‌ నిర్ణయించడం కోసం జరుగుతున్న ఆలస్యంలో వ్యక్తిగత అజెండాలేమీ లేవని ఆశిస్తున్నా. ఛైర్మన్‌ పదవికి ఖాళీ ఏర్పడి ఇప్పటికే నెల దాటిపోయింది. ఈ ఆలస్యం ఎందుకో అర్థం కావట్లేదు" అని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ చెప్పాడు.

గంగూలీ 2023 వరకు:

"బీసీసీఐ, కొన్ని అనుబంధ రాష్ట్ర సంఘాలు దాఖలు చేసిన అనేక పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయడం భారత క్రికెట్‌ను అనిశ్చితిలో పడేసింది. సర్వోన్నత న్యాయస్థానం ముందు క్రికెట్‌ కంటే ముఖ్యమైన కేసులు ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ కోర్టు నిర్ణయం కోసం భారత క్రికెట్‌ అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. నేనైతే సౌరభ్‌ గంగూలీ బృందం 2023 ప్రపంచకప్‌ వరకు కొనసాగాలని కోరుకుంటున్నా. కానీ కోర్టు ఏం నిర్ణయిస్తుందో మరి. విపత్కర పరిస్థితుల్లో.. కెప్టెన్‌గా భారత జట్టులో స్థైర్యాన్ని పెంచి, భారత క్రికెట్‌పై అభిమానుల నమ్మకాన్ని పునరుద్ధరించిన గంగూలీకి ఇప్పుడు తన బృందంతో కలిసి మళ్లీ అలా చేయగల సామర్థ్యం ఉంది" అని గావస్కర్ అన్నాడు.

ganguly
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ

అదే మన బ్యాట్స్‌మన్‌ అయ్యుంటే:

"ఇక మైదానంలోకి వెళ్దాం. ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ మధ్య సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండా ఆడుతున్నారు. ఈ వచ్చాక సిరీస్‌ ఫలితం తేలుతుంది. బెన్‌ స్టోక్స్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ చక్కగా బ్యాటింగ్‌ చేయడం సహా కీలక వికెట్లు తీయడం ద్వారా రెండో టెస్టును ఇంగ్లాండ్‌ వైపు తిప్పాడు. స్టోక్స్‌ ఆట మినహా ఆ మ్యాచ్‌లో క్రికెట్‌ విసుగు తెప్పించింది. 1970ల్లోలా సాగింది. సిబ్లే అంత నెమ్మదిగా ఓ ఉపఖండ బ్యాట్స్‌మన్‌ సెంచరీ చేసి ఉంటే.. అలాంటి ఆటతీరు వల్ల క్రికెట్‌ చచ్చిపోతుందంటా విమర్శకులు గోల చేసేవాళ్లు. కానీ అక్కడ ఆడింది ఓ ఇంగ్లిష్‌ ఆటగాడు. అందుకే టెస్టు క్రికెట్‌ అంటే ఇలా ఆడాలి అంటూ పొగుడుతున్నారు" అని అభిప్రాయపడ్డాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.