ETV Bharat / sitara

పొరుగు చిలుకలు... తెలుగు పలుకులు

author img

By

Published : Nov 20, 2020, 7:22 AM IST

కొత్త కథానాయికలను వెండితెరకు పరిచయం చేయడంలో టాలీవుడ్​ ఎప్పుడూ ముందుంటుంది. అలా తెలుగు చిత్రసీమలో అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్లు తమ సొంత గళంతో డబ్బింగ్​ చెప్పుకుని అభిమానులకు మరింత దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఈ విధంగా చేసి అనేక మంది నాయికలు మంచి ఆదరణ దక్కించుకున్నారు. కొత్తగా పరిచయమవుతున్న నటీమణులు తమ సొంత గళాన్ని వినిపించాలని ఆశ పడుతున్నారు.. వారెవరో తెలుసుకుందాం.

These Heroines are dubbing with their own voice
తెరపై సొంత గళాన్ని వినిపించనున్న పరభాషా నాయికలు

కొత్తదనాన్ని ఆస్వాదించడంలోనూ.. అవకాశాలిచ్చి ప్రోత్సహించడంలోనూ ఎప్పుడూ ముందుంటుంది తెలుగు చిత్రసీమ. ముఖ్యంగా నాయికల విషయంలో ఈ సూత్రం సరిగ్గా సరిపోతుంది. సొంత గూటిలో తెలుగు పలుకులు పలికే అందాల చిలుకలు బోలెడన్ని ఉండగా.. 'అ..ఆ.. ఇ.. ఈ'లు రాని వలస పక్షుల్ని ప్రోత్సహించడమేంటని అప్పడప్పుడు విమర్శలు వినిపిస్తుంటాయి. కానీ, ఇకపై ఇలాంటి మాటలు అంతగా వినిపించకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్లూ తెలుగులో సొంత స్వరాలు వినిపించేస్తున్నారు. మరి త్వరలో తెలుగు తెరపై సొంత గళం వినిపించబోతున్న ఆ పరభాషా నాయికలు ఎవరో చదివేద్దాం..

These Heroines are dubbing with their own voice
వర్ష బొల్లమ్మ

రష్మిక, సాయిపల్లవి, నివేదా థామస్‌, అనుపమ పరమేశ్వరన్‌.. ప్రస్తుతం తెలుగు తెరపై స్టార్‌లుగా మెరుపులు మెరిపిస్తున్న ఈ నాయికలంతా తెలుగమ్మాయిలు కాదు. కానీ, తెలుగులో తొలి చిత్రంతోనే సొంత గళాలు వినిపించి మురిపించారు. వచ్చీ రాగానే సినీప్రియుల మదిపై తెలుగమ్మాయిలుగా చెరగని ముద్ర వేసేశారు. ఇప్పుడీ జాబితాలో కన్నడ తార వర్ష బొల్లమ్మ కూడా చేరింది. 'చూసీ చూడంగానే' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఆమె.. తొలి ప్రయత్నంలోనే ముద్దు ముద్దుగా తెలుగు పలుకులు పలికి అందరినీ మురిపించింది. ఇప్పుడు 'మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌' చిత్రం కోసం తొలిసారి గుంటూరు యాసలో సంభాషణలు వినిపించేందుకు సిద్ధమైంది.

These Heroines are dubbing with their own voice
ఆదా శర్మ

రెండే రోజుల్లో డబ్బింగ్​ పూర్తి

'హార్ట్‌ ఎటాక్‌', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి చిత్రాలతో ఆకట్టుకుంది అదా శర్మ. తెలుగులో సొంత గళం వినిపించాలని ఎప్పటి నుంచో ఆశపడుతోంది. ఇప్పుడా కలను 'క్వశ్చన్‌ మార్క్‌' చిత్రంతో సాకరం చేసుకుంది. విప్ర దర్శకత్వంలో సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో తన పాత్ర కోసం కేవలం రెండు రోజుల్లోనే డబ్బింగ్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసిందట అదా.

These Heroines are dubbing with their own voice
పాయల్​ రాజ్​పుత్​

కల నెరవేరింది

త్వరలో పాయల్‌ రాజ్‌పుత్‌ కూడా తెలుగులో సొంత గళం వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఆమె ఇటీవలే తన కొత్త చిత్రం కోసం తొలిసారి తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకోని మురిసిపోయింది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలియజేస్తూ.. తన కల నెరవేరిందని సంతోషపడింది. అయితే అది ఏ సినిమా కోసమన్నది పాయల్‌ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో 'ఫైవ్‌ డబ్ల్యూస్‌'తో పాటు 'నరేంద్ర' అనే మరో చిత్రముంది.

These Heroines are dubbing with their own voice
కృతి శెట్టి

అవకాశాన్ని వదులుకోను

'ఉప్పెన' చిత్రంతో తెలుగు తెరపై మెరవబోతున్న మరో కన్నడ భామ కృతి శెట్టి. ఆమె ఈ చిత్రంతోనే తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకోవాలని తాపత్రయ పడినా.. అనుకోని కారణాల వల్ల అది సాధ్యపడలేదని సమాచారం. కానీ, తన రెండో చిత్రంతో ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని కృతనిశ్చయంతో ఉందట కృతి. ఇందుకు తగ్గట్లుగా ఇప్పటికే తెలుగులో మంచి ప్రావీణ్యత సంపాదించుకుందట ఆమె. కృతి ప్రస్తుతం నాని సరసన 'శ్యామ్‌ సింగరాయ్‌'లో నటించేందుకు సిద్ధమవుతోంది. దీని తర్వాత సుధీర్‌బాబుకు జోడీగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనుంది.

These Heroines are dubbing with their own voice
తమన్నా

యాసలో గమ్మత్తుగా..

పరభాషా నాయికలు తెలుగులో డబ్బింగ్‌ చెప్పుకోవడమే ఒకెత్తయితే.. సాధికారికంగా ఒక ప్రత్యేక యాసలో సంభాషణలు పలకడం మరొకెత్తు. సాయిపల్లవి తన తొలి చిత్రం 'ఫిదా'తోనే ఈ సాహసాన్ని చక్కగా చేసి చూపించింది. ఆ చిత్రంలో స్వచ్ఛమైన తెలంగాణ యాసలో మాట్లాడి అందరినీ మెప్పించింది. ఇప్పుడిదే తరహాలో రష్మిక, తమన్నా ప్రత్యేక యాసలతో మురిపించబోతున్నారు. తొలి చిత్రం 'ఛలో'తోనే తెలుగు పలుకులు వినిపించిన రష్మిక.. ఇప్పుడు 'పుష్ప' కోసం తొలిసారి చిత్తూరు యాసలో పల్లెటూరి అమ్మాయిగా సంభాషణలు పలికేందుకు సిద్ధమైంది. ఇక తమన్నా 'సీటీమార్‌' చిత్రం కోసం తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలకబోతున్నట్లు సమాచారం. గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది తెరకెక్కిస్తోన్న చిత్రమిది.

These Heroines are dubbing with their own voice
రష్మిక
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.