ETV Bharat / opinion

స్వీయ జాగ్రత్తలతోనే సీజనల్​ వ్యాధులకు అడ్డుకట్ట!

author img

By

Published : Jul 16, 2021, 9:05 AM IST

సాధారణ పరిస్థితులతో పోలిస్తే వర్షకాలంలో ప్రజలు అనేక వ్యాధికారక బ్యాక్టీరియాలు, వైరస్‌ల బారినపడే అవకాశాలు రెట్టింపవుతాయి. చల్లని వాతావరణం, అధిక తేమ శాతంతో కూడిన గాలి- వైరస్‌, వివిధ రకాల సూక్ష్మక్రిములు విజృంభించడానికి దోహదం చేస్తాయి. నేటికీ స్వచ్ఛమైన సురక్షిత తాగునీటికి సైతం నోచుకోని ఆవాసాలు, ప్రాంతాలు, మురికివాడలు.. సీజనల్‌ వ్యాధులకు నిలయాలుగా మారుతున్నాయి. ఈ దశలో స్వీయ జాగ్రత్తలు పాటించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం ద్వారా సీజనల్‌ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు.

seasonal diseases
సీజనల్​ వ్యాధులు

కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతూ ఉండటం కొంత ఊరట కలిగిస్తోంది. మరోవైపు మూడోదశ వ్యాప్తి కమ్ముకొస్తుందంటున్న నిపుణుల అంచనాలకు తోడు- వానాకాలం కూడా మొదలు కావడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. వానాకాలం వచ్చిందంటే పారిశుద్ధ్య నిర్వహణ సవాలుగా మారుతుంది. మురుగునీటి పారుదల సమస్యలతో వ్యాధులు, విషజ్వరాలు ప్రబలడం ఏటా దేశంలో సర్వసాధారణమవుతోంది. ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం నిధులు కేటాయించి, ఖర్చు చేస్తున్నా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా ఉండటంలేదు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో, మహానగరాల్లోని మురికివాడల్లో, లోతట్టు ప్రదేశాల్లో కొన్ని రకాల సీజనల్‌ వ్యాధులు పునరావృతమవుతూనే ఉన్నాయి. 2019 జూన్‌లో ఒడిశాలోని కటక్‌ పట్టణంలో పారిశుద్ధ్య లోపం కారణంగా ఒకేచోట 38 మందికి పచ్చకామెర్లు సోకి తీవ్ర అస్వస్థతకు గురి కావడం తెలిసిందే.

వర్షకాలంలోనే అధికం..

సాధారణ పరిస్థితులతో పోలిస్తే వర్షాకాలంలో ప్రజలు అనేక వ్యాధికారక బ్యాక్టీరియాలు, వైరస్‌ల బారినపడే అవకాశాలు రెట్టింపవుతాయి. చల్లని వాతావరణం, అధిక తేమ శాతంతో కూడిన గాలి- వైరస్‌, వివిధ రకాల సూక్ష్మక్రిములు విజృంభించడానికి దోహదం చేస్తాయి. ఫలితంగా అనేక వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, చర్మసంబంధిత వ్యాధులకూ ఆస్కారం ఎక్కువే. వాతావరణ మార్పుల వల్ల న్యూమోనియా, ఆస్థమా, సైనసైటిస్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరిన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు వర్షాకాలంలోనే ఎక్కువ. సాధారణంగా కలుషిత ఆహారం, నీరు తీసుకోవడంవల్ల రోగాలకు గురవుతుంటారు. వర్షాకాలంలో ప్రధానంగా దోమకాటువల్ల వ్యాధులు సోకుతున్నాయి. దోమకాటు ద్వారా సంభవించే మలేరియా, డెంగీ, చికున్‌ గన్యా వ్యాధులు భారత్‌లోనే అధికం.

వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా..

ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషణ ప్రకారం ప్రపంచంలోని మొత్తం డెంగీ కేసుల్లో 34శాతం, మలేరియా కేసుల్లో 11శాతం ఇండియాలోనే నమోదవుతున్నాయి. గాలి ద్వారా సంక్రమించే జలుబు, ఫ్లూ, ఇన్‌ఫ్లుయెంజా అత్యంత సులభంగా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత్‌లో ఇప్పటివరకు 34 లక్షల మందికిపైగా ప్రజలు కలుషిత నీటిని తాగడంవల్ల వ్యాధిగ్రస్తులయ్యారు. నీటి ద్వారా సోకే అతిసాధారణ వ్యాధులు- టైఫాయిడ్‌, కలరా, డయేరియా, పచ్చకామెర్లు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలవుతున్నా, నేటికీ స్వచ్ఛమైన సురక్షిత తాగునీటికి సైతం నోచుకోని ఆవాసాలు, ప్రాంతాలు, మురికివాడలు.. ఇలాంటి సీజనల్‌ వ్యాధులకు నిలయాలుగా మారుతున్నాయి. దేశంలో ప్రభుత్వం ఏటా ప్రజారోగ్యం మీద వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా- క్షేత్రస్థాయిలోని దుర్భర పరిస్థితులు వ్యవస్థాగత లోపాలను కళ్లకు కడుతున్నాయి.

క్షేత్రస్థాయిలో భిన్నంగా..

కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో రూ.64,180 కోట్లు కేటాయిస్తూ, ఆరేళ్లపాటు అమలయ్యేలా 'ఆత్మనిర్భర్‌ స్వస్థ్‌ భారత్‌ యోజన' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ కోసం ఈ నిధులను వినియోగిస్తారు. ఇప్పటికే అమలవుతున్న జాతీయ ఆరోగ్య మిషన్‌కు ఇవి అదనం. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాలను జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రాన్ని బలోపేతం చేయడం, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ ఆరోగ్య సమాచార పోర్టల్‌ సేవలు విస్తరించడం వంటి కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. కానీ, క్షేత్రస్థాయిలోని పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి.

అసలే కొవిడ్‌ సృష్టించిన విపత్కర పరిస్థితుల వల్ల ఆస్పత్రులు, వైద్య సదుపాయాలపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ దశలో స్వీయ జాగ్రత్తలు పాటించడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడం ద్వారా సీజనల్‌ వ్యాధుల వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. దీర్ఘకాలిక, జీవన శైలి వ్యాధులతో బాధపడుతున్న వారు సరైన సమయంలో మందులు తీసుకోవడం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయడంవల్ల కూడా వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. తరచూ తలెత్తుతున్న సీజనల్‌ వ్యాధుల కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- డాక్టర్‌ జీవీఎల్‌ విజయ్‌కుమార్‌ (భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు)

ఇదీ చూడండి: చిరుతిండి వల్ల బరువు తగ్గుతుందా?

ఇదీ చూడండి: ఆరోగ్యానికి పోషకాహారం- జబ్బులు మటుమాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.