ETV Bharat / opinion

కొత్త చట్టాలతో 'మద్దతు ధర'కు ఇక మంగళమేనా?

author img

By

Published : Oct 1, 2020, 5:51 AM IST

ఇటీవల పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులతో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. పంటల కొనుగోలుపై వీటి ప్రభావం ఏ మేర ఉంటుందన్నది ఈ నెల నుంచి రైతులకు, దేశానికి తెలుస్తుంది. కొత్త చట్టాల్లో రైతులకు ఎంఎస్‌పీ దక్కుతుందనే భరోసా లేకపోవడం, వ్యవసాయ మార్కెట్ల ప్రాధాన్యాన్ని తొలగించడంవల్ల దేశవ్యాప్తంగా రైతుసంఘాలు, ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్నాయి. నిజానికి ప్రధాన పంటలైన గోధుమలు, బియ్యం దిగుబడుల్లో కనీసం సగం పరిమాణాన్నయినా ప్రభుత్వాలు మద్దతు ధర ఇచ్చి ఎప్పుడూ కొనలేదు. మరి ఈ చట్టాల వల్ల లాభం ఎవరికి? నష్టపోయేదెవరు?

Editorial on impact of new farm laws on minimum price for crop
కొత్త చట్టాలతో 'మద్దతు ధర'కు ఇక మంగళమేనా?

ఈ నెల ఒకటి నుంచి కొత్త పంటల మార్కెటింగ్‌ ఏడాది ఆరంభమైంది. సుదీర్ఘకాలం తరవాత దేశ వ్యవసాయరంగంలో సంస్కరణలు తెచ్చామని మోదీ ప్రభుత్వం చాటుకుంటున్న వేళ మార్కెట్లకు కొత్త పంటల ఆగమనం మొదలైంది. ఇటీవల పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులతో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. పంటల కొనుగోలుపై వీటి ప్రభావం ఏ మేర ఉంటుందన్నది ఈ నెల నుంచి రైతులకు, దేశానికి తెలుస్తుంది. ఏటా అక్టోబరు 1 నుంచి మరుసటి సెప్టెంబరు 30వరకూ కాలాన్ని కొత్త పంటల మార్కెటింగ్‌ ఏడాదిగా కేంద్రం పరిగణిస్తుంది. ఈ ఏడాది సాగుచేసిన పంటలకు కేంద్రం ప్రకటించిన కొత్త కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)లను ఈ నెల ఒకటి నుంచే చెల్లించాలనేది ప్రధాన నిబంధన. కొత్త చట్టాల్లో రైతులకు ఎంఎస్‌పీ దక్కుతుందనే భరోసా లేకపోవడం, వ్యవసాయ మార్కెట్ల ప్రాధాన్యాన్ని తొలగించడంవల్ల దేశవ్యాప్తంగా రైతుసంఘాలు, ప్రతిపక్షాలు ఉద్యమిస్తున్నాయి. మరోవైపు నిరుడు ఖరీఫ్‌ సీజన్‌తో పోలిస్తే ఈసారి ఆహారధాన్యాల పంటల దిగుబడి అరకోటి టన్నులు పడిపోతుందని తొలి ముందస్తు అంచనాల్లో కేంద్ర అర్ధ, గణాంకశాఖ తాజా నివేదిక వెల్లడించింది. ఈ నెల నుంచి మార్కెట్లకు రానున్న కోట్లాది టన్నుల పంటలను స్వేచ్ఛాయుత మార్కెట్లలో వ్యాపారులు రైతులకెంత ధర ఇచ్చి కొంటారనేదాన్ని బట్టి కొత్త చట్టాల సామర్థ్యమెంతనేది తేటతెల్లమవుతుంది.

నూతన విధానం అమలులో సమస్యలు

మనదేశంలో పంటల సాగువిస్తీర్ణం, దిగుబడులు పెంచుతామని తరచూ చెప్పే ప్రభుత్వాలు రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చి పంటలు కొనడంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దేశప్రజల ఆకలి తీర్చే ప్రధాన పంటలైన గోధుమలు, బియ్యం దిగుబడుల్లో కనీసం సగం పరిమాణాన్నయినా ప్రభుత్వాలు మద్దతు ధర ఇచ్చి ఎప్పుడూ కొనలేదు. ఇక ఇతర పంటలైతే కనీసం మూడో వంతు సైతం కొనడం లేదు. అత్యధికశాతం కొనేది ఎప్పుడూ ప్రైవేటు వ్యాపారులేనని ప్రభుత్వ నివేదికలే ఘోషిస్తున్నాయి. నిరుడు 5.10 కోట్ల టన్నుల బియ్యాన్ని కొన్నట్లు ‘భారత ఆహార సంస్థ’(ఎఫ్‌సీఐ) తాజాగా వెల్లడించింది. కానీ మొత్తం దిగుబడిలో ఇది 43 శాతమే. దేశ చరిత్రలో ఇంత అత్యధికశాతం ప్రభుత్వం కొనడం ఇదే తొలిసారి. పంటలను మద్దతు ధరకు కొనే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎప్పుడూ వివాదాలు సాగుతున్నాయి. ఎంఎస్‌పీ ప్రకటించే అధికారం కేంద్రానికే ఉన్నందున ఆ ధర ఇచ్చి కొనాల్సిన బాధ్యత సైతం దానిదేనని తెలంగాణ సహా పలు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరవాత మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేసే విధానాల్లో పెద్దమార్పులు తెచ్చింది. ‘పంటలకు మద్దతు ధర పెంపు ఒక్కటే సరిపోదని, ఎంఎస్‌పీ ద్వారా రైతులు పూర్తిలాభం వారు పొందాలనే దృక్పథంతోనే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది’ అని చెప్పి 2018 సెప్టెంబరులో ‘పీఎం-ఆశ’ అనే పథకాన్ని ప్రారంభించారు. ఇవి అమల్లోకి రాకముందు ప్రతి రాష్ట్రంలో పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల దిగుబడిలో 40శాతం వీలైతే అంతకుమించి కేంద్రం నేరుగా కొనేది. ‘పీఎం-ఆశ’ వచ్చాక ఆ పరిమితిని 25 శాతానికే తగ్గించింది. దీనివల్ల తమ రైతులు నష్టపోతున్నారని, పరిమితిని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా కొనలేదు. రైతు నుంచి పంటను కొన్నరోజే లేదా మూడు పనిదినాల్లోనే సొమ్మును రైతు ఖాతాలో జమచేయాలని కొత్త చట్టాల్లో కేంద్రం నిబంధన పెట్టింది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేస్తున్న కొద్దిపాటి పంటల సొమ్మునే నెలల తరబడి ఆలస్యంగా రైతులకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలకు పంటలు అమ్మితే నెల దాటినా సొమ్ము రాదని తామైతే తక్షణం నగదు చెల్లిస్తామని వ్యాపారులు రైతులకు చెప్పి ధర తగ్గించేసి కొనడం ప్రతి సీజన్‌లోనూ మామూలైంది. ప్రభుత్వాల తీరే ఇలా ఉన్నప్పుడు- పంట కొన్నరోజే డబ్బు చెల్లించాలని చట్టాల్లో చెబితే వ్యాపారులు ఎలా అమలుచేస్తారనేది కీలక ప్రశ్న.

వదిలించుకుంటే నష్టమే...

పంటలను మద్దతు ధరకు రాష్ట్రాలు కొనకుండా కేంద్రంపైనే ఆధారపడుతున్నాయి. మధ్యప్రదేశ్‌, హరియాణా, తెలంగాణ తదితర రాష్ట్రాలు గడచిన అయిదేళ్లుగా మద్దతు ధర వద్ద కొనే విషయంలో కొన్ని ప్రయోగాలు చేసి బాగా నష్టపోయాయి. ఇక తెలంగాణలో గడచిన అయిదేళ్లలో కందులు, మొక్కజొన్నలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్క్‌ఫెడ్‌ మద్దతుధరకు కొని రూ.2 వేల కోట్ల నష్టం చూపింది. మొక్కజొన్న పంటను కొనేది లేదని తెలంగాణకు కేంద్రం తెగేసి చెప్పింది. తాము నేరుగా కొంటే నష్టపోతున్నామనే ఆందోళనతో ఈ వానాకాలం సీజన్‌లో అసలు మొక్కజొన్ననే వేయవద్దని రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. అయినా రైతులు పట్టించుకోకుండా 2 లక్షల ఎకరాలకు పైగా వేశారు. వేయవద్దని తాము ముందే చెప్పినా ఎందుకు వేశారని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ పంటను కొనదు. మరోవైపు ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’(డబ్ల్యుటీఓ)తో ఉన్న అంతర్జాతీయ ఒప్పందాలతో దిగుమతి సుంకాన్ని బాగా తగ్గించి మొక్కజొన్నలను విదేశాల నుంచి దిగుమతికి కేంద్రం అనుమతించడంతో ధర దారుణంగా పతనమైంది. ఈ ఖరీఫ్‌లో దాదాపు రెండు కోట్ల టన్నుల మొక్కజొన్నల దిగుబడి దేశవ్యాప్తంగా రానుంది. మరి ఇప్పుడు ఈ మొక్కజొన్నలను ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర ఇచ్చి ఎలా కొంటారు? అటు ప్రభుత్వం కొనదు, ఇటు ధర పతనమైనందని వ్యాపారులు బాగా తగ్గించి అడుగుతున్నారు. ఇదే సీజన్‌లో 93.30 లక్షల టన్నుల పప్పుధాన్యాల దిగుబడులు రానున్నాయి. కానీ కేంద్రం కేవలం 13.77 లక్షల టన్నులకే అనుమతించింది. మిగతా 85 శాతం పప్పుధాన్యాల పంటలకు మద్దతు ధర ఇచ్చి వ్యాపారులు కొనకపోతే రైతులకెవరు దిక్కనేది ఆలోచించాలి. పంటలకు మద్దతు ధర ఇచ్చి కొనేందుకు నిధులు లేవని, పథకాలు, చట్టాలు, నిబంధనలు మార్చి అనేక రకాలుగా ప్రభుత్వాలే ఆడుకుంటుంటే ఇక వందకు వంద శాతం లాభం కోసం వ్యాపారం చేసే ప్రైవేటు సంస్థలు, వ్యాపార వర్గాలు రైతులను కాపు కాస్తాయా? మార్కెట్‌ స్థిరీకరణ నిధికి ప్రభుత్వాలే బడ్జెట్లలో నిధులు కేటాయించి పంటలను కొంటామనే భరోసా ఇవ్వనంతకాలం ఎన్ని చట్టాలు, విధానాలు తెచ్చినా రైతులకు మిగిలేది నష్టాలు, వేదనే!

- మంగమూరి శ్రీనివాస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.