ETV Bharat / international

భద్రతా మండలిలో భారత్​కు​ శాశ్వత హోదా ఎలా?

author img

By

Published : Jun 18, 2020, 2:42 PM IST

Updated : Jun 18, 2020, 2:50 PM IST

ఐరాస భద్రతా మండలి ఎన్నికల్లో భారత్‌ ఘన విజయం సాధించింది.193 సభ్యదేశాలు కలిగిన యూఎన్‌ఎస్​సీ.. 2021-2022 కాలానికిగానూ భద్రతా మండలిలో ఓ తాత్కాలిక సభ్యదేశంగా భారత్​ను ఎన్నుకున్నాయి. మొత్తం 192 ఓట్లు పోలవ్వగా 184 దేశాల మద్దతు లభించింది. అయితే ఈ మండలిలో భారత్​ ఎన్నో ఏళ్లుగా శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తున్నా దాన్ని పొందలేకపోతోంది? అందుకు కారణం ఎవరు? అసలు దాని వల్ల ఉపయోగాలేంటి? ఓసారి చూద్దాం.

un security council
ఐరాస భద్రతామండలి

మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన నానాజాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) రెండో ప్రపంచ యుద్దాన్ని ఆపలేకపోయింది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడం, దేశాల మధ్య సహకారం పెంపొందించే లక్ష్యంతో... 1945, అక్టోబరు 24న ఐక్యరాజ్య సమితి (యునెటైడ్ నేషన్స్ ఆర్గనైజేషన్) ఏర్పడింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ 'యునెటైడ్ నేషన్స్' అనే పదాన్ని తొలిసారి ప్రవేశపెట్టారు.

ఇలా సభ్యదేశాలు...

ఐక్యరాజ్యసమితిలో ఆరు విభాగాలు ఉంటాయి. వాటిలో సాధారణ సభ, భద్రతా మండలి, సచివాలయం, ధర్మ కర్తృత్వ మండలి, ఆర్థిక, సాంఘిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం ఉంటాయి.

ప్రస్తుతం 193 దేశాలు ఐరాస సర్వ ప్రతినిధి సభలో పూర్తికాలపు సభ్యదేశాలుగా ఉన్నాయి. హోలీ సీ, స్టేట్ ఆఫ్ పాలస్తీనా దేశాలు సభ్యత్వం లేకుండా ఇందులో కొనసాగుతున్నాయి.

ఐక్యరాజ్యసమితిలోని ఆరు విభాగాల్లో ఒకటైన భద్రతామండలి చాలా కీలకం. ఇందులో 15 దేశాలు సభ్యులుగా (5 శాశ్వత, 10 తాత్కాలిక) ఉంటాయి. ప్రస్తుతం శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, రష్యా దేశాలు మాత్రమే ఉన్నాయి. అయితే శాశ్వత సభ్యదేశాలు కాని మిగతా తాత్కాలిక సభ్య దేశాల కోసం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. దీనిలో భాగంగా బుధవారం జరిగిన ఎన్నికల్లో భారత్‌ భారీ మద్దతుతో గెలిచింది. ఐరాస జనరల్‌ అసెంబ్లీలో భారత్‌కు అనుకూలంగా మొత్తం 192 ఓట్లలో 184 దేశాలు మద్దతుగా నిలిచాయి. 2021-22 కాలానికి యూఎన్ఎస్​సీకి ఎన్నికైన భారత్​.. ఎనిమిదోసారి ఈ ఘనత సాధించింది. ఐర్లాండ్‌, మెక్సికో, నార్వే దేశాలు కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందగా... కెనడా మాత్రం ఓటమి పాలయ్యింది.

పెద్ద దేశాల కొద్ది బుద్ధులు!

భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలుగా ఉన్న ఐదింటికే.. 'వీటో' అధికారం ఉంటుంది. తొలుత తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య ఆరు కాగా.. 1965లో ఆ సంఖ్యను పదికి పెంచారు. ఈ దేశాలకు రెండేళ్ల సభ్యత్వం ఉంటుంది. 1965 నుంచి భద్రతామండలి స్వరూపమేమీ మారలేదు. ఐక్యరాజ్యసమితి (ఐరాస) సంస్థలన్నింటిలోకి ఒక్క భద్రతామండలి నిర్ణయాలనే ఐరాస దేశాలన్నీ పాటించాల్సి ఉంటుంది. భద్రతామండలిని కాలానుగుణంగా సంస్కరించాలని ఎన్నో ప్రతిపాదనలు వచ్చినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. అవి ఇవే...

  1. భారత్‌, జపాన్‌, జర్మనీ, బ్రెజిల్‌ (జీ-4) సమర్పించిన ప్రణాళిక ప్రకారం భద్రతా మండలి కొత్తగా ఆరు దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి. తాత్కాలిక సభ్యులతో కలిపి మొత్తం సభ్యుల సంఖ్యను 25కి పెంచాలి. కొత్త శాశ్వత సభ్యత్వాన్ని జీ-4 దేశాలతోపాటు రెండు ఆఫ్రికా దేశాలకు ఇవ్వాలి. రెండేళ్లకు ఒకసారి తాత్కాలిక సభ్యులుగా ఎన్నుకునే దేశాల సంఖ్యను పెంచి.. అదనంగా మూడు లేదా నాలుగు దేశాలను ఈ జాబితాలో చేర్చాలి.
  2. ఐక్యరాజ్యసమితి ఏకాభిప్రాయ ప్రణాళిక (యూఎన్‌సీ) కొత్త శాశ్వత సభ్య దేశాల ప్రస్తావన లేకుండా భద్రతామండలి సీట్లను 25కి పెంచాలని ప్రతిపాదించింది. అయితే, ఒక్కో భౌగోళిక ప్రాంతానికి కొత్తగా శాశ్వత సభ్యత సీట్లను కేటాయించాలని సూచించింది. ఈ సీట్లను ఏయే దేశాలకు, ఎంతకాలం ఇవ్వాలో సదరు భౌగోళిక ప్రాంతంలోని దేశాలే నిర్ణయించుకోవచ్చు.
  3. ఎజుల్విన్‌ ఏకాభిప్రాయ ప్రణాళిక కింద ఆఫ్రికా దేశాలు తమ ఖండం నుంచి కొత్తగా రెండు శాశ్వత, రెండు తాత్కాలిక సభ్య దేశాలకు చోటు కల్పించాలని ప్రతిపాదించాయి. కొత్త ఆఫ్రికన్‌ శాశ్వత సభ్యులకు పీ-5 (అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా) దేశాలకు ఉన్నట్లే వీటో అధికారం ఉండాలి.

నిధుల్లో ముందున్నా...

జపాన్‌, జర్మనీలు ఐక్యరాజ్యసమితి బడ్జెట్‌కు అందిస్తున్న నిధులు ఒక్క అమెరికా మినహా ఇతర పీ-5 దేశాలకన్నా ఎంతో ఎక్కువ. అమెరికా అన్ని దేశాలకన్నా ఎక్కువగా 22 శాతం నిధులను ఐరాస బడ్జెట్‌కు అందిస్తుండగా, జపాన్‌, జర్మనీలు రెండు, మూడో స్థానాలను ఆక్రమిస్తున్నాయి. ఐరాసకు నిధుల వితరణలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనాల తరవాత 7వ స్థానం ఆక్రమిస్తున్న బ్రెజిల్‌... రష్యా కన్నా ఎక్కువ నిధులే సమకూరుస్తోంది. జనాభా, నిధుల పరంగా చూస్తే జీ-4 దేశాలు ఇప్పటికే భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం పొంది ఉండాల్సిందని తేలుతుంది. దీనివల్ల భద్రతామండలి ప్రాతినిధ్య స్వభావానికి నిండుదనం వచ్చి, మరింత ప్రజాస్వామిక సంస్థగా మారి ప్రపంచంలో నానాటికీ పెరుగుతున్న సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని సంతరించుకొంటుంది. కానీ అవేమి జరగట్లేదు.

1960లలో ఐరాసలో 113 సభ్యదేశాలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 193కు పెరిగింది. అయితే భద్రతా మండలి రూపురేఖలేమీ మారలేదు. ఐరాస కార్యకలాపాలు ప్రధానంగా ఆఫ్రికాలోనే నడుస్తున్నా, ఆ ఖండం నుంచి ఒక్క దేశానికీ భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం దక్కలేదు. దక్షిణ అమెరికా ఖండ దేశాలకు కానీ, వందలాది ద్వీప దేశాలకు కానీ ఐరాసలో అత్యున్నత విధాన నిర్ణయ సంస్థ అయిన భద్రతా మండలిలో ప్రాతినిధ్యం లేదు.

భారత్​కు అవకాశం కోసం..

భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి భారత్‌ అన్ని అర్హతలూ కలిగి ఉంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలోనూ, ఆ తరవాత ప్రపంచ శాంతి పరిరక్షణకు భారత్‌ కీలక సేవలు అందించింది. జనాభా, విస్తీర్ణం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), నాగరికత, సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వం, ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థల రీత్యా శాశ్వత సభ్యత్వం పొందే హక్కు భారత్‌కే మిన్నగా ఉంది. పలు దేశాల్లో ఐరాస తరఫున శాంతి రక్షక కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించిన చరిత్ర భారతదేశానిది.

ఇంతవరకు ఏడుసార్లు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం పొందిన భారత్‌ 2021-2022లో భాగంగా తాజాగా ఎనిమిదోసారి ఎంపికైంది. ఇలాంటి తాత్కాలిక ఏర్పాట్లతో సరిపెట్టుకోకుండా భారత్‌, జపాన్‌, జర్మనీ, బ్రెజిల్‌ శాశ్వత సభ్యత్వం కోసం చేయీచేయీ కలిపి కృషి చేస్తున్నాయి. అయితే భద్రతా మండలి విస్తరణను చైనా వ్యతిరేకిస్తుండగా, అమెరికా పూటకో బుద్ధి ఘడియకో మాట చందంగా ప్రవర్తిస్తోంది. భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని బహిరంగంగా ప్రకటించే అమెరికా, తీరా వ్యవహారం అమీతుమీ తేలే సమయానికి వెనక్కు తగ్గుతోంది. అయితే ట్రంప్​తో దోస్తీ బాగున్న ఈ సమయంలోనే అమెరికా విధానంలో మరింత స్పష్టత రావాలి.

రష్యా మొదట్లో భద్రతా మండలి విస్తరణను వ్యతిరేకించినా, అనంతరం భారత్‌, బ్రెజిల్‌ దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని రష్యా కోరింది. 'వీటో' అధికారమిచ్చే అంశంపై మాత్రం స్పష్టత లేదు. 1971లో చైనా.. ఇండియా మద్దతుతో శాశ్వత సభ్య దేశంగా అవతరించింది. ఇప్పుడు భారతదేశం విషయానికి వచ్చేసరికి ఇప్పుడు అదే దేశం మోకాలడ్డుతోంది. భారత్‌కు సభ్యత్వం ఇస్తే.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాక్​ వంటి దేశానికి అది వర్తించాలని సూచిస్తోంది చైనా.

ఏదిఏమైనా భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు (పీ-5) తమ విశేషాధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగాలేవు. ఈ దేశాలు 'వీటో' అధికారాన్ని తరచూ తమ దేశ ప్రయోజనాల రక్షణకే ఉపయోగిస్తూ వచ్చాయి. దీనిమీద రుసరుసలాడటం వల్ల ప్రయోజనం లేదు. భారత ప్రధాని మోదీ సారథ్యంలో అంతర్జాతీయ సంబంధాలు మెరుగుపడిన నేపథ్యంలో శాశ్వత సభ్యత్వంపై మరింత దృష్టి సారించాలి. జీ-4 దేశాలు కలసికట్టుగా కృషి చేసి ఆశించినది సాధించుకోవాలి.

Last Updated : Jun 18, 2020, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.