ETV Bharat / city

సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. ఆవుల సుబ్బారావు అరెస్ట్..

author img

By

Published : Jun 24, 2022, 2:03 PM IST

Updated : Jun 24, 2022, 6:16 PM IST

Notices issued to Sai Defense Academy in Secunderabad riots case
Notices issued to Sai Defense Academy in Secunderabad riots case

14:01 June 24

సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు జారీ

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో చెలరేగిన హింసపై పోలీసులు దర్యాప్తు జోరుగా సాగుతోంది. ఈనెల 17న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసంలో సాయి డిఫెన్స్‌ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావు పాత్ర ఉన్నట్లు తేల్చిన పోలీసులు... సుబ్బారావు సహా అకాడమీలో పనిచేసే శివ, హరితో పాటు మరో నలుగురిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి గాంధీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనతో పాటు మరో ఏడుగురిని జీఆర్పీ కార్యాలయానికి తరలించారు. 16వ తేదీనే హైదరాబాద్ చేరుకున్న ఆవుల సుబ్బారావు.... ఆర్మీఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువకులను రెచ్చగొట్టి రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించేలా పథకరచన చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఆవుల సుబ్బారావుకు తెలుగు రాష్ట్రాల్లో డిఫెన్స్ అకాడమీలున్నాయి. అగ్నిపథ్ పథకం వల్ల కోచింగ్ సెంటర్లన్నీ మూతపడే పరిస్థితి నెలకొంటుందనే దురుద్దేశంతోనే... యువకులను రెచ్చగొట్టినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ మేరకు హకీంపేట ఆర్మీ సోల్జర్స్ గ్రూపులో పలు పోస్టులను ఆధారాలుగా చూపిస్తున్నారు. సాయి డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకుంటున్న పలువురు యువకులు విధ్వంసంలో ప్రధాన పాత్ర పోషించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కేసులో ఏ2గా ఉన్న పృథ్వీరాజ్ కూడా ఆవుల సుబ్బారావు శిష్యుడే. సాయి డిఫెన్స్ అకాడమీలో ఆర్మీ ఉద్యోగం కోసం శిక్షణ తీసుకునే యువకులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు. వసతికి సంబంధించి డబ్బులు వసూలు చేశారు. ఆర్మీ ఉద్యోగానికి ఎంపికైన వారి నుంచి 2 నుంచి 3 లక్షలు వసూలు చేస్తారు. ఇప్పటికే దేహదారుఢ్య, వైద్య పరీక్షలు పూర్తైన అభ్యర్థులు రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్రం అగ్నిపథ్ ద్వారానే ఆర్మీ ఎంపికలుంటాయని ప్రకటించగానే.... ఆవుల సుబ్బారావుతో పాటు... మరికొంత మంది డిపెన్స్ అకాడమీ డైరెక్టర్లు కలిసి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మిగతా అకాడమీలకు చెందిన డైరెక్టర్ల పాత్రపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో సుబ్బారావు నిర్వహిస్తున్న సాయిడిఫెన్స్ అకాడమీలో అధికారులు తనిఖీలు సైతం చేపట్టారు. హైదరాబాద్‌ బోడుప్పల్‌లోని సాయి డిఫెన్స్ కార్యాలయానికి వెళ్లిన రైల్వే పోలీసులు నోటీసులు జారీ చేశారు. అకాడమీ కార్యాలయానికి తాళం ఉండటంతో బయట గేటుకు ఈ నోటీసును అంటించారు. 'రైల్వే యాక్ట్-1989' కింద ఈ నోటీసులు జారీ చేశారు. నిర్వాహకులు ఇవాళే R.P.F. కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించారు. డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన అన్ని రికార్డులను తీసుకురావాలని తెలిపారు. సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించి పలువురు అభ్యర్థులతో సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సబ్బారావు దిగిన ఫొటోలు వైరలయ్యాయి. దీంతో అల్లర్లలో సుబ్బారావు పాత్ర ఉందన్న అనుమానంతో ఈ నెల 18న పోలీసులు ప్రకాశం జిల్లాలో ఆయన్ను అదుపులోకి తీసుకుని.... విచారణ జరుపుతున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Jun 24, 2022, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.