ETV Bharat / city

భాగ్యనగరం అతలాకుతలం... లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Oct 10, 2020, 6:26 AM IST

Updated : Oct 10, 2020, 7:43 AM IST

వరుణుడు మరోసారి ఆగ్రహించాడు. వర్షాకాలం చివరి దశలో రాష్ట్రంపై ప్రతాపం చూపించాడు. హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షంతో.... నగరవాసులు నానాతంటాలు పడ్డారు. 3గంటల పాటు ఏకధాటి కుండపోతతో... రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నగరరోడ్లపై భారీగా చేరిన వరదనీటితో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మరోవైపు భారీ వానలతో పలుచోట్ల పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి..

huge rain fall in Hyderabad
రాజధానిలో కుండపోత

రాజధానిలో కుండపోత.

రాష్ట్ర రాజధానిలో ఉరుములు, మెరుపులతో వరుణుడు విరుచుకుపడ్డాడు. శుక్రవారం సాయంత్రం ఐదున్నరకు మొదలైన వాన.. రాత్రి 8 గంటల వరకూ కుండపోతగా కురిసింది. రికార్డుస్థాయిలో 15.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకధాటి వానకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

పలుకాలనీలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఉస్మాన్ గంజ్, లంగర్ హౌజ్, టోలిచౌకి, డబీర్‌పురా, సికింద్రాబాద్ ప్రాంతంలోని పలుకాలనీల్లోకి నీరు చేరింది. మెహిదీపట్నం భోజగుట్ట పునరావాస కేంద్రంలో ఓ గుడిసె కూలిపోయింది. అంబర్‌పేట్ గోల్నాకలో ఓ గోడ కూలిన ఘటనలో కూరగాయల బండి, ఇతర సామగ్రి ధ్వంసమయ్యాయి. ఖైరతాబాద్ పీజేఆర్​ నగర్‌లో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. టోలిచౌకి-గచ్చిబౌలి ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నిలిచిన నీటిలో ఓ వ్యక్తి ఈత కొడుతూ ముందుకెళ్లాడు. జలమయమైన ప్రాంతాల్లో జీహెచ్​ఎంసీతో పాటు విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగి సహయక చర్యలు చేపట్టారు.


రోడ్లపై పడిగాపులు

నగరంలో వరదనీరు రోడ్లపైకి చేరి కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. రాజ్‌భవన్‌ ప్రాంతం చెరువును తలపించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్, ఇతర ప్రాంతాల్లో రోడ్డుపై నడుముల్లోతు నీరు చేరగా.. ట్రాఫిక్‌ స్తంభించింది. పంజాగుట్ట, అమీర్​పేట ప్రాంతాల్లో అంబులెన్స్‌లు ట్రాఫిక్‌ రద్దీలో చిక్కుకున్నాయి. కోఠి నుంచి మలక్‌పేట్‌ వరకూ ట్రాఫిక్ స్తంభించగా వాహనదారులుల వర్షంలోనే గంటల పాటు రోడ్లపై పడిగాపులు పడ్డారు. అనేక ప్రాంతాల్లో కార్లు, ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి.

ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై పరిస్థితిని సీపీ అంజనీ కుమార్ పరిశీలించారు. నగరశివారులోని అబ్దుల్లాపూర్‌మెట్​లో కుండపోత వర్షం పడగా.. విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా నీరు చేరింది. దీంతో కొన్ని గంటలపాటు ట్రాఫిక్​కు అంతరాయం కలిగి.. జిల్లాల నుంచి వచ్చిన బస్సులకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం 7 గంటలకు ఇంటికి చేరాల్సిన వారు అర్ధరాత్రి వరకు రోడ్లపైనే వేచిచూశారు. రాత్రి వరకూ మెట్రోరైల్‌ అందుబాటులో లేనందున ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడ్డారు.


అత్యధిక వర్షపాతం

ఈ ఏడాదిలో జనవరి నుంచి ఇప్పటి వరకు అత్యధిక వర్షపాతం 15.1 సెంటీమీటర్లు నిన్న సాయంత్రం మెహిదీపట్నంలో ఆసిఫ్‌నగర్‌లోనే నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. గత పదేళ్లల్లో అక్టోబర్‌లో మాసం ఒకరోజు హైదరాబాద్‌లో కురిసిన అత్యధిక వర్షపాతం కూడా ఇదేనని అధికారులు తెలిపారు. వాతావరణం చల్లబడి.. అప్పటికప్పుడు ఏర్పడిన క్యూములో నింబస్ మేఘాల వల్ల గంటల వ్యవధిలోనే.. కుండపోతగా వాన కురిసింది.

విజయనగర్ కాలనీలో 12.95 సెంటీమీటర్లు, బంజారాహిల్స్‌లో 12.73, షేక్‌పేటలో 12.58, ఖైరతాబాద్‌లో 12.33, జూబ్లీహిల్స్‌లో 11.55, టోలిచౌకీలో 11.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మరోసారి వరుణుడి ప్రతాపం కొనసాగుతున్నందున.. పంటలు కూడా నీట మునుగుతున్నాయి. పూత, కాత దశలో ఉన్న పైర్లు నేల వాలుతున్నాయి. పొలాలు బురదమయమై.. దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి.. ఉత్తరాంధ్ర వద్ద తీరందాటే అవకాశాలున్నాయని అధికారులు చెప్పారు. మరో వైపు రాయలసీమపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: ఒక్కసారిగా వాన.. భాగ్యనగర రోడ్లన్నీ జలమయం

Last Updated : Oct 10, 2020, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.