ETV Bharat / city

TTD: తితిదే భారీ జాబితాతో సామాన్యులకు దర్శనం కష్టం!

author img

By

Published : Sep 17, 2021, 7:02 AM IST

తితిదే జంబో బోర్డు భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి సంఖ్య భారీగా పెరగడంతో దర్శనాలకు కొత్త చిక్కులు వస్తాయనే గుబులు కలుగుతోంది. ప్రత్యేక ఆహ్వానితులకిచ్చే దర్శన, సేవా టికెట్లతో సామాన్య భక్తులకు దర్శనం కష్టం కానుంది.

తితిదే భారీ జాబితాతో సామాన్యులకు దర్శనం కష్టం!
తితిదే భారీ జాబితాతో సామాన్యులకు దర్శనం కష్టం!

ఇప్పటికే ప్రొటోకాల్‌, వీఐపీ దర్శనాల పేరుతో సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం దుర్లభమైందన్న విమర్శలు వస్తున్న వేళ... ధర్మకర్తల మండలి(ttd board) సభ్యులతో పాటు ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో మొత్తం 81 మందిని నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ జంబో జాబితా మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరందరికీ దర్శన టికెట్లిచ్చే అధికారం కల్పిస్తే రోజూ సుమారు 2వేల వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, 2 వేల 400, 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు కేటాయించొచ్చు. అప్పుడు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం మరింత కష్టంగా మారుతుంది.

తెలుగుదేశం హయాంలో తితిదే ఛైర్మన్‌ సహా 14 మంది ధర్మకర్తల మండలి సభ్యులు, ముగ్గురు ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఉండేవారు. వైకాపా హయాంలో తొలిసారి ఛైర్మన్‌ సహా 25 మంది బోర్డు సభ్యులు, నలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యులు, 8 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. బుధవారం ప్రకటించిన జాబితాలో ఆ సంఖ్య రెట్టింపు కంటే పెరిగి 81కి చేరింది. ఇందులో బోర్డు తరఫున ప్రత్యేక ఆహ్వానితులుగా ఇద్దరిని నియమించారు. వీరికి బోర్డు సమావేశాల్లో ఓటింగ్‌ హక్కు తప్ప... సభ్యులకు ఉండే మిగిలిన అధికారాలన్నీ ఉంటాయి. అదనంగా తితిదే తరఫున ప్రత్యేక ఆహ్వానితులుగా 50 మందిని తీసుకున్నారు. వీరు బోర్డు పరిధిలోకి రారని చెబుతున్నా దర్శన టికెట్లు కేటాయించే అధికారం కల్పించే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే సామాన్యులకు దర్శనం మరింత సమస్యగా మారనుంది.

పెద్దఎత్తున సిఫార్సు లేఖలు..

కొవిడ్‌కు ముందు ఒక్కో బోర్డు సభ్యుడు స్వామి దర్శనానికి 4 సిఫార్సు లేఖలు ఇచ్చే అవకాశం ఉంది. ఒక్కో లేఖతో ఆరుగురు దర్శనం చేసుకోవచ్చు. అంటే ఒక్కో సభ్యుడు రోజుకు 24 మందికి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించొచ్చు. శుక్ర, శని, ఆదివారాల్లో రెండు నుంచి మూడు లేఖలు ఇచ్చేవారు. ఈ లెక్కన ఇప్పుడు ఛైర్మన్‌ మినహా మిగిలిన 80 మంది సిఫార్సు లేఖలను అంగీకరిస్తే సాధారణ రోజుల్లో రోజుకు 19 వందల 20 మంది, వారాంతాల్లో 960 మందికి వీఐపీ బ్రేక్‌ టికెట్లు కేటాయించాలి. ఇవి కాకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారుల సిఫార్సు లేఖలతో భక్తులు వస్తుంటారు. రాష్ట్ర నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున సిఫార్సు లేఖలు వస్తుంటాయి. అందులో ముఖ్యమైన వాటికి తప్పనిసరిగా ఆమోదముద్ర వేయాలి. ఇవి కాకుండా 'సుపథం' ద్వారా 300 రూపాయల టికెట్లు రోజుకు 30 వరకు కేటాయించొచ్చు. అంటే సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు కలిపి 2 వేల 400 టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. దీనివల్ల సామాన్య భక్తులకు దర్శనాలు దూరమయ్యే ప్రమాదం ఉందని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. తితిదే బోర్డు సభ్యులు, ప్రత్యేకాహ్వానితులకు... బ్రేక్‌, ఆర్జిత సేవల టికెట్ల కేటాయింపులో కోత పెట్టాలన్న డిమాండ్లు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.