ETV Bharat / business

ఇంటికి వెళ్లకుండా ఆఫీస్​లోనే ఉండి పనిచేసిన మేనేజర్.. అయినా లేఆఫ్​తో మస్క్ షాక్

author img

By

Published : Feb 27, 2023, 5:37 PM IST

మస్క్​ మరోసారి ట్విట్టర్​​ ఉద్యోగులను తొలగించారు. ఈసారి జరిపిన తొలగింపుల్లో.. కంపెనీకి కీలకంగా వ్యవహరిస్తున్న మేనేజర్లపై వేటుపడింది. వివిధ విభాగాల్లో ఉద్యోగుల తొలగిస్తున్నట్లు శనివారం ఈ మెయిళ్లు పంపారు మస్క్​.

twitter-lays-off-product-manager-who-led-blue-subscription-project
ఎస్తేర్ క్రాఫోర్డ్ ట్విట్టర్​ తొలగింపు

మీకు గుర్తుందా? ట్విట్టర్​​ సీఈఓ ఎలాన్​ మస్క్ ​మొదటి సారి కంపెనీ ఉద్యోగుల తొలగింపు చేపట్టినప్పుడు.. పనిభారంతో ఓ మేనేజర్​ ఆఫీస్​లోనే పడుకున్నారు. ఇంటికెళ్లే సమయం లేక.. స్లీపింగ్ బ్యాగ్​లో అక్కడే సేదదీరారు. ఆఫీసులోని టేబుల్, చైర్ల వెనుక నిద్రపోయారు. అప్పట్లో ఆ ఫొటో.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​గా మారింది. ఆమెనే ట్విట్టర్​లో ప్రొడక్ట్​ మేనేజర్​గా పనిచేసిన ఎస్తేర్ క్రాఫోర్డ్. ఇప్పుడు ఆమె స్టోరీ ఎందుకనుకుంటున్నారా? ట్విట్టర్​ అధినేత ఎలన్​ మస్క్..​ ఆమెను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. ఇక నుంచి ఆఫీస్​కు​ రావలసిన అవసరం లేదంటూ శనివారం ఈమెయిల్​ చేశారు. కంపెనీ కోసం అహర్నిశలు శ్రమించిన ఆమెను.. కనికరం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారు.

twitter-lays-off-product-manager-who-led-blue-subscription-project
ఆఫీస్​లోనే నిద్రపోతున్న ఎస్తేర్ క్రాఫోర్డ్

ఎస్తేర్ క్రాఫోర్డ్.. కంపెనీకి చెందిన వివిధ ప్రాజెక్టుల్లో కీలకంగా వ్యవహరించారు. పలు ప్రాజెక్టులకు నాయకత్వం వహించి ముందుండి నడిపించారు. బ్లూ టిక్​ సబ్స్క్రిప్షన్ వెరిఫికేషన్​, కొద్ది రోజుల్లో రాబోయే పేమెంట్ ప్లాట్​ఫామ్ ​​ప్రాజెక్ట్​కు సైతం ఎస్తేర్ క్రాఫోర్డ్ నాయకత్వం వహించేవారు. తాజాగా మస్క్​ తీసుకున్న నిర్ణయంతో ఆమెతో పాటు మరో 50 మంది ఉద్యోగులపై వేటు పడింది. కంపెనీలోని పలు విభాగాల్లో ఈ తొలగింపులు జరిగాయి. రివ్యూ న్యూస్​ లేటర్​ ఫ్లాట్​ఫామ్(ఇప్పుడు అందుబాటులో లేదు) సృష్టికర్త.. మార్టిన్ డి కైపర్​పై కూడా వేటుపడింది. వీరందరికీ ఈ మెయిల్​ ద్వారానే తొలగింపు సమాచారం అందింది.

ట్విట్టర్​లో​ ​ఉద్యోగులను తొలగించటం ఇది నాలుగో సారి. కొద్దిరోజుల క్రితమే కంపెనీలో ఇక భారీగా తొలగింపులు ఉండవని మస్క్​ ప్రకటించారు. అయినా మరోసారి ఉద్యోగులను తొలగించటం గమనార్హం. ​మొత్తం 7,500 మంది ఉద్యోగుల్లో.. ఇప్పటి వరకు మూడొంతుల మందిని మస్క్ తొలగించారు. ఈ దశలో యాడ్స్​, ఇన్​ఫ్రాస్టక్చర్​ ఇంజనీరింగ్ విభాగంలో ఎక్కువగా తొలగింపులు జరిగాయి. దీంతో కంపెనీలో 2500 మంది ఉద్యోగులు మాత్రమే మిగిలారు.
44 బిలియన్‌ డాలర్లతో ట్విట్టర్​ను కొనుగోలు చేసిన ఎలాన్‌ మస్క్‌ .. కొన్న వారం రోజుల్లోనే సంస్థలో అనేక భారీ మార్పులు తీసుకొచ్చారు. కొనుగోలు ప్రక్రియ ముగిసిన కొద్ది గంటలకే సీఈఓ పరాగ్‌ అగర్వాల్ సహా నలుగురు ఉన్నతోద్యోగులను తొలగించారు. ఇప్పటికీ ఈ తొలగింపుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.