ETV Bharat / business

మైక్రోసాఫ్ట్​ ఉద్యోగులకు షాక్.. 10వేల మందిపై వేటు.. రూ.10వేల కోట్లు ఆదా!

author img

By

Published : Jan 18, 2023, 12:31 PM IST

Updated : Jan 18, 2023, 8:26 PM IST

ఉద్యోగుల తొలిగింపు విషయంలో ట్విట్టర్​, అమెజాన్ బాటలోనే సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కూడా నడుస్తోంది. దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించింది.

microsoft layoffs
microsoft layoffs

మాంద్యం భయాలతో వ్యయాలను తగ్గించుకునే ఉద్దేశంతో సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది. చివరి త్రైమాసికం ఫలితాలు ప్రకటించడానికి వారం ముందు మరికొందరు ఉద్యోగులపై వేటు వేసింది. మొత్తం ఉద్యోగుల్లో 5 శాతానికి సమానమైన.. దాదాపు 10,000 మందిని తొలగించినట్లు మైక్రోసాఫ్ట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం.. రెగ్యులేటరీ ఫైలింగ్​లో వివరాలు వెళ్లడించింది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ బుధవారమే మొదలైనట్లు సంస్థ వెల్లడించింది.

ఉద్వాసనకు గురయ్యేవారిలో మానవ వనరులు, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. సంస్థ ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల ప్రాధాన్యాల్లో మార్పులు వంటి కారణాల వల్ల ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని పేర్కొంది. లీజుకు తీసుకున్న ఆఫీసు స్థలాలపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది. ఈ చర్యల ఫలితంగా సంస్థకు 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9,752 కోట్లు) ఆదా అవుతాయని వివరించింది. కంపెనీ లెక్కల ప్రకారం జూన్‌ 30 నాటికి మైక్రోసాఫ్ట్‌లో 2,21,000 మంది పనిచేస్తున్నారు. 1,22,000 మంది అమెరికాలో, 99,000 మంది ఇతర దేశాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది మైక్రోసాఫ్ట్ రెండుసార్లు ఉద్యోగులను తొలగించింది. అక్టోబర్​​లోనే 1,000 మంది ఉద్యోగులకు గుడ్​బై​ చెప్పింది.

గత రెండేళ్లలో మైక్రోసాప్ట్ కంపెనీ.. విండోస్ అమ్మకాలు కూడా మందగించినట్లు రాయిటర్స్ సంస్థ నివేదించింది. దీంతో కంపెనీ వృద్ధిరేటు తగ్గిందని రాయిటర్స్​ తెలిపింది. అమెజాన్, ట్విట్టర్‌, మెటా, గూగుల్‌ తదితర సంస్థలు ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించాయి. మాంద్యం భయాలతో భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించడానికి మైక్రోసాప్ట్​ కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్వాసన పలికిన ఉద్యోగులంతా.. ఒన్​ టైమ్​ సెటిల్​మెంట్​ పొందనున్నట్లు సమాచారం.

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవలే ఓ ఇంటర్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'వచ్చే రెండేళ్ల పాటు కంప్యూటర్‌ రంగం తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొనబోతుంది. ప్రపంచంలో కొన్న ప్రాంతాల్లో నిజమైన ఆర్ధిక మాంద్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న పరిణామాలకు మైక్రోసాఫ్ట్‌ ఏమీ మినహాయింపు కాదు. అన్ని కంపెనీలు నడుచుకునే బాటలోనే మైక్రోసాప్ట్​ కూడా నడుచుకుంటుంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ రంగం తన సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది' అని అన్నారు. దీంతో ఉద్యోగులను తొలగించేందుకు ఆయన పరోక్షంగా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, జనవరి 24న మైక్రోసాప్ట్​ కంపెనీ తన త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్న వేల.. బుధవారం కొద్ది మొత్తంలో కంపెనీ షేర్​ విలువ పెరిగినట్లు రాయిటర్స్ తెలిపింది.

Last Updated : Jan 18, 2023, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.