ETV Bharat / business

డీమార్ట్​ అధిపతికి రూ.1000 కోట్ల ఇల్లు!

author img

By

Published : Apr 4, 2021, 5:10 AM IST

Updated : Apr 4, 2021, 5:25 AM IST

మరో సంచలనానికి తెరదీశారు డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ. ఇటీవల కాలంలో వరుస పెట్టుబడులతో దూసుకుపోతున్న ఆయన.. ముంబయిలో అత్యంత ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారు. మలబార్​ హిల్​ ప్రాంతంలో ఉన్న ఈ ఇంటి విలువ ఏకంగా రూ.వెయ్యి కోట్లు కావటం గమనార్హం.

D-Mart Founder Radhakishan Damani purchased 1000 cr. home in Mumbai
రాధాకిషన్ దమానీ

రాధాకిషన్ దమానీ.. స్టాక్​మార్కెట్​లో మదుపరులకు సుపరిచితమైన పేరు. ఆయనను మరో విధంగా చెప్పుకోవచ్చు. డీమార్ట్ వ్యవస్థాపకుడు కూడా ఆయనే. నాలుగైదు నెలల క్రితం చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇండియా సిమెంట్స్​లో 10శాతానికి పైగా వాటా కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన అగ్రశ్రేణి ఇన్వెష్టర్​ కూడా. లక్ష కోట్ల రూపాయలకు పైగా సంపదతో ఫోర్బ్స్​ ఇండియా 2020 కుబేరుల జాబితాలో స్థానం దక్కించుకున్న ఘనత ఆయన సొంతం. తాజాగా ఆయన మరొక సంచలనంతో జనం దృష్టిని ఆకర్షించారు. ముంబయిలోని అత్యంత ఖరీదైన మలబార్ హిల్​ ప్రాంతంలో రూ.1000 కోట్లు పెట్టి ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు.

నారాయణ్ దాభోల్కర్ మార్గ్​లో ఉన్న మధు కుంజ్​ అనే భవంతిని ప్రేమ్​చంద్​ రాయ్​చంద్​ అండ్ సన్స్​ నుంచి తన సోదరుడితో కలిసి దమానీ సొంతం చేసుకున్నారు. ఈ ఇల్లు దాదాపు 5752 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది. దీనికి ఆయన స్టాంప్​ డ్యూటీనే రూ.30 కోట్లు చెల్లించారు. ఒకప్పుడు ఆయన ఒకే గదిలో ఉండటం విశేషం.

ఈ లావాదేవీ ముంబయి రియల్ ఎస్టేట్ మార్కెట్​లో ఇటీవల కాలంలో నమోదైన అతిపెద్దదిగా సంబంధితి వర్గాలు పేర్కొంటున్నాయి. కొవిడ్ కారణంగా గతేడాది ముంబయి రియల్ ఎస్టేట్​ మార్కెట్ పడిపోయినప్పటికీ మళ్లీ కోలుకుంటోందని, తాజా ఉదంతమే అందుకు కారణమని వివరిస్తున్నాయి. దమానీ ఇటీవలే ఠానేలో 8 ఎకరాల స్థలాన్ని మాండెలెజ్ ఇండియా (గతంలో కాడ్బరీ ఇండియా) నుంచి రూ.250 కోట్లకు కొనుగోలు చేశారు.

ఇదీ చూడండి: దమ్మున్న 'డీమార్ట్​' దమానీ

Last Updated : Apr 4, 2021, 5:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.