ETV Bharat / business

'ఆఫీస్​లకు తర్వాత.. ముందు సిటీకి రండి'

author img

By

Published : Feb 28, 2022, 11:21 AM IST

Work From Office News: దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ ఆఫీస్​కు సిబ్బందిని రప్పించేందుకు పలు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే వారిని బలవంతం చేయకుండా.. కార్యాలయాలకు రావడం మీ ఇష్టం.. ముందు ఉద్యోగం చేసే నగరం లేదా పట్టణానికి రావాలని సూచిస్తున్నాయి.

work from office news
'ఆఫీస్​లకు తర్వాత.. ముందు సిటీకి రండి'

Work From Office News: కొవిడ్‌ కేసుల తీవ్రత బాగా తగ్గడం వల్ల సిబ్బందిని కార్యాలయాలకు రప్పించడంపై ఐటీ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. అయితే బలవంతపెట్టడం లేదు. 'కార్యాలయాలకు వచ్చే సంగతి తరువాత.. ముందుగా ఉద్యోగం చేసే నగరం/పట్టణాని (బేస్‌ లొకేషన్‌)కి రావాలని' దిగ్గజ కంపెనీలు సూచిస్తున్నాయి. గత నవంబరులోనూ కొవిడ్‌ కేసుల తీవ్రత బాగా తగ్గినట్లే అనిపించినా, మళ్లీ శరవేగంగా పెరగడం, గత వేసవిలోనూ రెండోదశ విజృంభించడాన్ని దృష్టిలో పెట్టుకుని సిబ్బందిని రప్పించడంలో ఐటీ కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.

మరోవైపు ఇంటి నుంచైనా పని సాఫీగా నడుస్తుండడం వల్ల ఒత్తిడి తేవడంలేదు. వాస్తవానికి ఐటీ నియామక నిబంధనల ప్రకారం బేస్‌ లొకేషన్‌ నుంచే పనికి అనుమతి ఉంటుంది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ నిబంధన నుంచి వెసులుబాటు కల్పించి, ఎక్కడినుంచైనా అనుమతిస్తున్నారు. అయితే ఎక్కడినుంచి లాగిన్‌ అవుతున్నారో తెలుసుకునేందుకు కొన్ని కంపెనీలు జీపీఎస్‌ సాంకేతికతను వినియోగిస్తున్నాయి.

నిపుణులు చేజారకుండా సున్నితంగా..

కొత్తతరం సాంకేతికతలపై నైపుణ్యాలు కలిగిన వారికి గిరాకీ అధికంగా ఉండటంతో.. నిపుణులు చేజారకుండా చూసుకునేందుకు కంపెనీలు సిబ్బందితో సున్నితంగా వ్యవహరిస్తున్నాయి. కార్యాలయానికి తప్పనిసరిగా రావాలంటే, వేరే కంపెనీకి మారతారేమోననే ఆందోళనా సంస్థల్లో ఉంది. అందుకే కంపెనీకి వచ్చి పనిచేసుకోవచ్చని, కస్టమర్లను కలవవచ్చని మాత్రమే నిపుణులకు సూచిస్తున్నాయి. ఉద్యోగుల్లో స్ఫూర్తి కలిగించేందుకు ఆయా కంపెనీల ఉన్నతాధికారులు వారానికి రెండు, మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పనిచేస్తున్నారు.
కస్టమర్లూ వస్తున్నారు.

'కొవిడ్‌ తీవ్రత సమయంలోనూ మా కార్యాలయాలు తెరిచే ఉన్నాయి. అయితే ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేశారు. ప్రాజెక్టులు ఇచ్చే ఖాతాదారులు కూడా ఐటీ సంస్థల ప్రాంగణాలకు వస్తున్నారు. నేను కూడా కస్టమర్లను కలిసేందుకు పర్యటనలు ప్రారంభించా' అని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ సీనియర్‌(టీసీఎస్‌) వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న తెలిపారు. తమ సంస్థలో తనతో సహా నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు వారానికి 2-3 రోజులు ఆఫీసుకు వెళ్లి పనిచేస్తున్నామని, కీలక ప్రాజెక్టుల్లో ఉన్నవారు కూడా వస్తున్నారని తెలిపారు.

టీసీఎస్‌

హైదరాబాద్‌ పరిధిలో దాదాపు 70,000 మంది ఉద్యోగులుండగా, కార్యాలయానికి వచ్చి పనిచేస్తున్న వారు 2,000 మందిలోపే. బేస్‌ లొకేషన్‌కు వచ్చి పనిచేసుకోవాలని ఉద్యోగులకు కంపెనీ సూచిస్తోంది. మార్చి కల్లా 10 శాతం మంది కార్యాలయాలకు రావచ్చని అంచనా వేస్తోంది. క్రమంగా ఇది పెరుగుతుందని భావిస్తోంది.

ఇన్ఫోసిస్‌

హైదరాబాద్‌ పరిధిలో దాదాపు 50,000 మంది ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు 2-3 శాతం మందే వస్తున్నారు. మార్చి నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుందని చెబుతున్నారు. రాబోయే 3-4 నెలల్లో ఎక్కువ శాతం మంది కార్యాలయాలకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నారు.

విప్రో

మేనేజర్‌, అంతకంటే ఉన్నతస్థాయి పోస్టుల్లో ఉన్నవారు మార్చి 3 నుంచి వారానికి రెండురోజులు కార్యాలయానికి వచ్చి పనిచేసుకోవచ్చని తెలిపింది. సి1-ఇ బ్యాండ్‌ పదవుల్లో ఉన్న వారు కార్యాలయాలకు ప్రతి సోమ, గురువారాల్లో వచ్చి విధులు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. శిక్షణలో ఉన్న వారు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, టీమ్‌లీడర్లకు (ఎ-బి3 బ్యాండ్‌) మాత్రం మార్చి 31 వరకు ఇంటి నుంచే పనికి అవకాశం ఉంది. వారు ఎప్పుడు రావాల్సిందీ తదుపరి సమాచారం ఇవ్వనున్నారు.

కాగ్నిజెంట్‌

కార్యాలయానికి రావడానికి ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? బేస్‌ లొకేషన్‌లో ఉన్నారా? లేదా? వంటి వివరాలను గత డిసెంబరులో సంస్థ సేకరించింది. ఏప్రిల్‌ నుంచి కార్యాలయానికి రావాల్సి ఉంటుందని అప్పుడు చెప్పడం మినహా, మళ్లీ అధికారిక మెయిల్‌ ఏమీ ఇవ్వలేదు.

యాక్సెంచర్‌

రహేజా పార్కులోని 2 భవనాలను ఖాళీచేసిన ఈ సంస్థ.. వేవ్‌రాక్‌లో పెద్ద కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. సిబ్బందిని రప్పించడంపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు.

మైక్రోసాఫ్ట్‌

హైదరాబాద్‌ యూనిట్‌ పరిధిలో దాదాపు 7,500 మంది నిపుణులు పనిచేస్తున్నారు. మార్చి 7 నుంచి హైదరాబాద్‌ సహా ఇతర నగరాల్లోని కార్యాలయాలకు సిబ్బంది రావచ్చని తెలిపింది. ఏప్రిల్‌ 7 తరవాత మాత్రం ప్రత్యేక అనుమతి తీసుకోకపోతే, వారానికి 3 రోజులు తప్పనిసరిగా కార్యాలయానికి రావాలని పేర్కొంది.

అమెరికా కంపెనీలూ రమ్మంటున్నాయి!

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న వందల మంది తెలుగు వారు కరోనా నేపథ్యంలో స్వదేశానికి వచ్చి.. ఇక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. కొందరు సొంతూర్లలోనే ఉంటూ పనిచేస్తుంటే, మరికొందరు హైదరాబాద్‌ నుంచి లాగిన్‌ అవుతున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో ఇప్పుడు వీరంతా తిరిగి అమెరికా వెళ్లే సమయం ఆసన్నమైంది. ఏప్రిల్‌ 1లోపు కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని పలు అమెరికన్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు సమాచారం అందించాయి. మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఈ నెల 28 నుంచి హైబ్రిడ్‌ విధానం (వారంలో రెండు రోజులు కార్యాలయం నుంచి, మూడు రోజులు ఇంటి నుంచి పని) అమలు చేయబోతోంది. ఇదే తరహాలో నిర్వహణకు మరిన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి.

"ఇంటి నుంచి పనితో మొదట్లో బాగానే ఉన్నా ప్రస్తుతం చాలామంది కార్యాలయాలకు వెళ్లాలనుకుంటున్నారు. ఇంట్లో పని వాతావరణం ఉండదు. బృందంగా కలిసి పనిచేసే అవకాశం లేదు. ఉత్పాదకత తగ్గుతుంది" అని కొంపల్లి ఐటీ ఆంత్రప్రెన్యూర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఓరుగంటి వెంకట్‌ చెప్పారు.

ఇదీ చూడండి: 'భారత రిటైల్‌ రంగానికి రారాజు రిలయన్స్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.