హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)కు త్వరలో కొత్త డీన్ రాబోతున్నారు. ప్రస్తుతం డీన్గా కొనసాగుతున్న రాజేంద్ర శ్రీవాస్తవ ఈ ఏడాది చివరి నాటికి పదవీ విరమణ చేయబోతున్నారు. దీంతో కొత్త డీన్ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఎంపిక ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నారు. డీన్గా పదవీ కాలం పూర్తయ్యాక నోవార్టిస్లో మార్కెటింగ్ వ్యూహాలు, ఆవిష్కరణల విభాగానికి ఛైర్గా కొనసాగుతానని, తన పరిశోధనలు, విద్యాబోధన కొనసాగుతుందని ఐఎస్బీలో జరిగిన సమావేశంలో రాజేంద్ర శ్రీవాస్తవ అన్నారు. ఐఎస్బీ అభివృద్ధిలో, కొత్త డీన్ ఎంపికలోనూ తన సేవలను అందిస్తానని పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయిలో 16 ర్యాంకు
రాజేంద్ర శ్రీవాస్తవ డీన్గా కొనసాగిన కాలంలో.. ఐఎస్బీ పలు మైలురాళ్లను అందుకుందని సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఫైనాన్షియల్ టైమ్స్, ఫోర్బ్స్, బిజినెస్ వీక్, ద ఎకనమిస్ట్ల ర్యాంకింగ్ల్లో ఎంబీఏ, ఈఎంబీఏ ప్రోగ్రామ్స్లో ప్రపంచ స్థాయిలో అత్యున్నత ర్యాంకును సాధించింది. జనవరి 2020లో సమగ్రంగా ప్రపంచ స్థాయిలో 16 ర్యాంకును అందుకుంది. ఆసియాలో పలు ప్రఖ్యాత బిజినెస్ స్కూల్స్లో ఒకటిగా నిలిచింది. ఏఏసీఎస్బీ, ఈక్యూయూఐఎస్, ఏఎంబీఏల ద్వారా ట్రిపుల్ క్రౌన్ గుర్తింపును తెచ్చుకుంది.
ఐదేళ్లలో ఎన్నో విజయాలు
నాలుగు నగరాల్లో పీˆజీపీˆ ప్రో అనే కొత్త ప్రోగ్రామ్ను ప్రారంభించింది. మేనేజ్మెంట్లో విజయవంతమైన ఎగ్జిక్యూటివ్ ఫెలో ప్రోగ్రామ్స్ను నిర్వహించింది. ఐఎస్బీ విద్యార్థుల ఉద్యోగాల నియామకాలు 50% పెరిగాయని తెలిపింది. రాజేంద్ర శ్రీ వాస్తవ అంకితమై సేవలందించారని ఐఎస్బీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఛైర్మన్ హరీష్ మన్వాని అన్నారు. ఐదేళ్లలో ఐఎస్బీ ఎన్నో విజయాలను నమోదు చేసిందని చెప్పారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా విలయతాండవం... 20వేలు దాటిన కేసుల సంఖ్య