ETV Bharat / business

కేంద్రం సంక్షేమ యజ్ఞం- కష్టకాలంలో పేదలకు ఆపన్నహస్తం

author img

By

Published : Mar 26, 2020, 5:05 PM IST

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి కేంద్రం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధించిన కారణంగా ఆర్థిక రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ పేదలు, మహిళలు, రైతులు, కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్ పథకం కింద 1,70,000 కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజిని ప్రకటించింది కేంద్రం. ఉపాధి హామీ వేతనాల పెంపు, ఉచితంగా 5 కిలోల ఆహార ధాన్యాల సరఫరా, ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, మహిళల జన్‌ధన్‌ ఖాతాల్లో 1500 రూపాయల జమ, వైద్య సిబ్బందికి రూ.50 లక్షలు బీమా వంటి ఎన్నో చర్యలను ఆర్థిక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

Extra 5 kg grains, 1 kg pulses for free under PDS for 3 months: FM
కష్టకాలంలో పేదలు,రైతులకు ప్యాకేజీతో కేంద్రం వెన్నుదన్ను

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నడూలేని విధంగా తిరోగమనం బాటపట్టింది. ఈ మహమ్మారితో మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్‌ విధించింది. తాజా ఆంక్షల మూలంగా అన్ని వర్గాల ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకునేందుకు 'ప్రధాన్​ మంత్రి గరీబ్ కల్యాణ్​ పథకం' పేరుతో కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. పేద ప్రజల ఆహార, రోజువారీ అవసరాలకుగానూ రూ. లక్షా 70 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీతో భరోసా ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో, ఖాళీ జేబులతో ఉండరాదన్నదే ప్రభుత్వ అభిమతమని ఉద్ఘాటించారు నిర్మల.

'ప్రధాన్​ మంత్రి గరీబ్ కల్యాణ్​' పథకంలో ఏఏ వర్గాలవారికి ఏమి అందుతాయో పరిశీలిస్తే..

పేదవారికి

  • రేషన్‌ కార్డు ఉన్న 80 కోట్ల మంది ప్రజలకు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం లేదా, గోధుమలు ఉచితంగా అందుతాయి. వీటితో పాటు కిలో పప్పు ధాన్యాలు అందిస్తారు. ఇలా మూడు నెలల పాటు సరఫరా చేస్తారు.
  • ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న 5 కిలోల ఆహార ధాన్యాలకు ఇవి అదనం.

రైతులకు అందే ఫలాలు

  • ప్రస్తుతం అమల్లో ఉన్న పీఎం కిసాన్‌ యోజనలో భాగంగా ఏప్రిల్‌ మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి 2 వేల రూపాయలు జమచేస్తారు. దీని ద్వారా దేశంలో 8 కోట్ల 69 లక్షల మంది కర్షకులకు ప్రయోజనం చేకూరనుంది.

మహిళలు, వృద్ధులకు ఇవి..

  • మహిళా స్వయం సహాయక బృందాలు ఇక ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.20 లక్షలు రుణం పొందొచ్చు. ఇప్పటివరకు అది రూ.10 లక్షలుగా ఉంది.
  • దేశంలోని 20 కోట్ల 50 లక్షల మంది మహిళల జన్‌ధన్‌ యోజన ఖాతాల్లో 3 నెలల పాటు 500 రూపాయల చొప్పున జమచేస్తారు.
  • ఉజ్వల పథకం లబ్ధిదారులకు మూడు నెలల పాటు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్ల అందజేస్తారు.
  • 3 కోట్ల మంది నిరుపేద వృద్ధులు(60 ఏళ్లు పైబడినవారు), వితంతువులు, దివ్యాంగులకు రూ.1000 ఎక్స్‌గ్రేషియా ఇస్తారు.

ఉపాధి హామీ వేతనం పెంపు

  • ఉపాధి హామీ వేతనాలను రూ.182 నుంచి రూ.202కు పెంచింది కేంద్రం. దీని వల్ల 5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.

వైద్యుల కోసం

  • కరోనా మహమ్మారి కట్టడికి తీవ్రంగా కృషి చేస్తున్న వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, ఆరోగ్య రంగానికి చెందిన కార్మికులకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల బీమా కల్పించింది.

ఉద్యోగులకు

  • రానున్న 3 నెలలకు ఈపీఎఫ్‌ చందా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. ఉద్యోగి వాటా 12 శాతం, యజమాని వాటా 12 శాతం కలిపి ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేయనుంది.
  • వందలోపు ఉద్యోగులు గల సంస్థల్లో 90 శాతం మందికి రూ.15 వేలలోపు జీతం ఉంటేనే ఇది వర్తిస్తుంది.

ఏటీఎంలు వందశాతం పనిచేస్తాయి

దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలు వంద శాతం పని చేస్తాయన్నారు నిర్మలా సీతారామన్‌. ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని, ఎలాంటి అదనపు ఛార్జీలు విధించమని స్పష్టంచేశారు. బ్యాంకింగ్‌ మిత్ర సాయంతోనూ నగదు ఉపసంహరణ చేసుకోవచ్చని వెల్లడించారు. ఇప్పుడు ప్రకటించిన నిర్ణయాలన్నీ పేదల కోసమేనని, మిగిలిన అన్ని విషయాలను రానున్న రోజుల్లో ఆర్థిక శాఖ సమీక్షిస్తుందని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.