ETV Bharat / bharat

ప్రియాంక శ్రమంతా వృథా- యూపీలో దయనీయ స్థితికి కాంగ్రెస్

author img

By

Published : Mar 10, 2022, 5:39 PM IST

UP Results: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోమారు ఘోర పరాభవం చవిచూసింది. మోదీ-యోగి ద్వయాన్ని ఎదుర్కొనే సమర్థవంతమైన నాయకత్వం లేక చతికిలపడింది. మహిళలు-యువత పేరుతో ప్రియాంక హోల్​సేల్ ప్రచారం చేసినా.. సామాజిక వర్గాల లెక్కలు విస్మరించి ఓటమి పాలయ్యింది.

congress UP
యూపీలో చతికిలపడ్డ కాంగ్రెస్​- ఫలించని ప్రియాంక మంత్రం

UP Assembly Results 2022: ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ చతికిలపడింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎన్నికల్లో గెలిచేందుకు భారీ హామీలు ఇచ్చినా ప్రజలు మాత్రం కాంగ్రెస్​ను తిరస్కరించారు. మోదీ-యోగి ద్వయాన్ని ఎదుర్కోగల శక్తిమంతమైన నాయకత్వం లేకపోడవం యూపీలో ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. అంతేగాక యూపీలో సోషల్​ ఇంజినీరింగ్​కు అంతంత మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం, సామాజిక వర్గాల లెక్కలు విస్మరించడం కాంగ్రెస్​ ఘోర పరాభవానికి ప్రధాన కారణాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

up assembly poll results
ఎన్నికల ర్యాలీలో ప్రియాంక

UP Congress news

మహిళలు-యువత పేరుతో ప్రచారం..

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల ప్రచార బాధ్యతను పూర్తిగా తన భుజాలపై వేసుకున్న ప్రియాంక.. మహిళలు, యువతకే పెద్దపీట వేశారు. మహిళలకు 40శాతం సీట్లు కేటాయించారు. యువ నాయకత్వానికే అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్​ అభ్యర్థుల్లో దాదాపు 80శాతానికిపైగా కొత్త వారే ఉన్నారు. యూపీలో సరికొత్త రాజకీయాలకు ఇది నాంది అని, యువ నాయకత్వం, మహిళా సాధికారతే తమ లక్ష్యమని ప్రియాంక విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ ఎన్నికల్లో ఈ అంశాలు ఏ మాత్రం ప్రభావం చూపలేదు.

up poll results
ఎన్నికల ప్రచారంలో ప్రియాంక

UP Election Results

నాయకత్వ లేమి..

ఒకప్పుడు యూపీని పాలించిన కాంగ్రెస్​కు ఇప్పుడు ఆ రాష్ట్రంలో బలమైన నేతే కరవయ్యారంటే ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. భాజపాలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ వంటి శక్తిమంతమైన నాయకులకు ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. ఎస్పీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్​ యాదవ్​కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే రాష్ట్రంలో బలమైన నాయకులే లేరు. అంతేగాక ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ సీనియర్​, కీలక నేతలు కూడా ఇతర పార్టీల్లో చేరడం ఆ పార్టీని కోలుకోలేని దెబ్బ తీసింది.

సామాజిక లెక్కల విస్మరణ..

up results
ఎన్నికల ప్రచారంలో ప్రియాంక

యూపీలో ఏ పార్టీకైనా సామాజిక వర్గాల మద్దతే అత్యంత కీలకం. యాదవులు, ఇతర ఓబీసీ వర్గాలే ఎస్పీకి ప్రధాన ఓటు బ్యాంకు. అగ్రవర్ణాలు, బ్రాహ్మణులు దశాబ్దాలుగా భాజపా పక్షాన నిలుస్తున్నారు. దళితులు బీఎస్పీకి, ముస్లింలు పరిస్థితులను బట్టి ఆయా పార్టీల వైపు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాల లెక్కలను విస్మరించింది. యువత, మహిళలకే తమ ప్రాధాన్యం అని చెప్పి కులాల వారీగా మద్దతు కూడగట్టుకోలేకపోయింది. దీంతో ఏ వర్గం ఓటర్లనూ ప్రసన్నం చేసుకోలేక ఘోర పరాభవం చవిచూసింది.

UP Poll Results

హామీల వర్షం కురిపించినా..

up-results
మేనిఫెస్టో విడుదల చేసిన ప్రియాంక-రాహుల్​

ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలపై హామీల వర్షం కురిపించారు ప్రియాంక. తాము అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పశువులు మేత మేయడం వల్ల పంటనష్టపోయే రైతులకు రూ.3000 పరిహారంగా చెల్లిస్తామని వాగ్దానం చేశారు. చెరకు, వరి, గోధుమల కనీస మద్దతు ధర పెంచుతామన్నారు. దళిత విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఇవే గాక మహిళలు, నిరుద్యోగులు, ప్రజల కోసం మూడు మేనిఫెస్టోలు రూపొందించి ఇంకెన్నో హామీలను పొందుపరిచారు. కానీ ఎన్నికల్లో ఇవేవీ ఓటర్లను ప్రభావితం చేయలేకపోయాయి.

up-results
ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం

సాగు చట్టాల అస్త్రాన్ని ఉపయోగించుకోలేక..

వ్యవసాయ రంగంలో సంస్కరణల పేరుతో భాజపా మూడు సాగు చట్టాలను తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యూపీ, పంజాబ్​ రైతులు నూతన చట్టాలను రద్దు చేయాలని పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. దిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళనలు చెపట్టారు. కాంగ్రెస్​ కూడా వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే ఈ అవకాశాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం ప్రియాంక గాంధీ పూర్తిగా విఫలమయ్యారు. రైతులు, జాట్​ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న పశ్చిమ యూపీలో ప్రచారాస్త్రంగా సాగు చట్టాలను ఉపయోగించుకోలేకపోయింది.

up assembly results
ప్రజలకు ప్రియాంక గాంధీ అభివాదం

UP Congress

ఫలించని ఒంటరి పోరాటం

up-results 2022
ఎన్నికల ర్యాలీలో ప్రియాంక

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో ఈసారి ఒంటరిగా పోటీ చేసింది కాంగ్రెస్. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవద్దని కార్యకర్తలు కోరిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రియాంక చెప్పారు. దాదాపు 3 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ యూపీలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, ఇదే తమకు అతిపెద్ద విజయం అన్నారు. ఓ వైపు అధికార భాజపా అప్నాదళ్, నిషాద్ పార్టీలతో పొత్తు పెట్టుపెట్టుకొని బరిలోకి దిగగా.. ఆర్​ఎల్​డీ, ఇతర ప్రాంతీయ పార్టీలతో జట్టుకట్టి ఎస్పీ పోటీ చేసింది. కాంగ్రెస్​ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి చతికిలపడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.