ETV Bharat / bharat

viveka case: హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు కూడా ఇస్తుందా?.. అవినాశ్ ముందస్తు బెయిల్‌పై సుప్రీం స్టే

author img

By

Published : Apr 21, 2023, 12:59 PM IST

Updated : Apr 21, 2023, 3:55 PM IST

Supreme court
Supreme court

12:54 April 21

వివేకా హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించాం..సీబీఐ

viveka murder case :వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని ఏప్రిల్ 25 వరకు అరెస్టు చేయొద్దంటూ.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) నేడు స్టే విధించింది. ఇటీవలే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నర్సింహల నేతృత్వంలోని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టులో వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత నర్రెడ్డి పిటిషన్ దాఖలాలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఇది చాలా దారుణమైన హత్య.. విచారణలో భాగంగా సునీత తరపు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తన వాదనలు వినిపిస్తూ.. ''ఇది చాలా దారుణమైన హత్య. రక్తపు మడుగులో భౌతికకాయం పడి ఉన్నా.. గుండెపోటుతో మరణించారని ప్రచారం చేసి.. హత్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో ఎ4 నిందితుడిగా ఉన్న వ్యక్తి అప్రూవర్‌గా మారాడు. ఆ తర్వాత అతనిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇటీవల అవినాశ్ రెడ్డి తండ్రి, మరో నిందితుడి (ఉదయ్ కుమార్ రెడ్డి)ని సీబీఐ అరెస్టు చేసింది. అవినాశ్ రెడ్డి విషయంలో మాత్రం హైకోర్టు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో రాజకీయ వైరుధ్యంతో పాటు.. అనేక అంశాలు చోటుచేసుకున్నాయి. నిందితుడికి ముందుగానే ప్రశ్నోత్తరాల ప్రింట్‌ కాపీ ఇవ్వాలని హైకోర్టు చెప్పింది. ఇది హైకోర్టు నిందితుడిని ఇంట్లో అతిథిలా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. హత్య జరిగిన సమయంలో విధుల్లో ఉన్న సీఐ.. అప్పుడు సస్పెండ్‌ అయ్యారు. ఆ తర్వాత.. దర్యాప్తులో భాగంగా సీఆర్‌పీసీ 160 కింద వాంగ్మూలం నమోదు చేసే సమయానికి.. పదోన్నతి కల్పించి మళ్లీ విధుల్లోకి తీసుకోవడంతో వాంగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారు.'' అని సునీత తరపు సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఆ వ్యక్తి సీఎం జగన్ తమ్ముడు.. అనంతరం హైకోర్టు ఉత్తర్వులపై ఎస్‌ఎల్‌పీ ఎందుకు దాఖలు చేయలేదు..? అని సీబీఐ న్యాయవాదిని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సీబీఐ న్యాయవాది సమాధానమిస్తూ.. తాము దాఖలు చేయడానికి నిబంధనల పరంగా కొంత సమయం తీసుకుంటున్నందున... సునీత దాఖలు చేసిన పిటిషన్‌ను సమర్ధిస్తున్నట్లు ధర్మాసనంకు తెలిపారు. అంతేకాకుండా, ఈ కేసులో ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు పొందిన వ్యక్తి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి సోదరుడు అని పేర్కొన్నారు. రాజకీయ వైరుద్ధ్యంతోనే ఈ హత్యకు పాల్పడినట్లు తమ వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని.. సీబీఐ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో హత్యగావించబడిన వ్యక్తి పోటీ చేసిన స్థానంలోనే జగన్‌ తల్లి పోటీ చేశారని తెలియజేశారు. ఈ కేసులో అనేక సాక్ష్యాలు సేకరించి.. సాంకేతిక సహకారంతో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ న్యాయవాది పేర్కొన్నారు. రూ.40 కోట్ల సుపారి ఇచ్చేందుకు సిద్దం అయ్యారని, దానిలో కొంత మొత్తాన్ని నిందితులకు ఇచ్చారని వివరించారు.

మృతుడి భౌతికకాయాన్ని నిందితులు ఫోటోలు తీశారు.. నిందితులంతా.. హత్యకు ముందు, ఆ తర్వాత ఒకే ప్రదేశంలో కలుసుకుని.. అక్కడి నుంచి విడిపోయారని, ఇది సాంకేతికంగా కూడా రుజువు అయ్యిందని, అందుకు తగిన ఆధారాలు కూడా సేకరించినట్లు సీబీఐ న్యాయవాది న్యాయస్థానం ముందు వెల్లడించారు. హత్య చేసిన తర్వాత.. మృతుడి భౌతికకాయాన్ని కొందరు నిందితులు ఫోటోలు తీశారని, హత్యను గుండెపోటుగా ప్రచారం చేసి, అందుకు అనుగుణంగా.. మృతదేహానికి పూర్తిగా గుడ్డలు చుట్టి.. బయటికి తీసుకువచ్చారని కేంద్ర దర్యాప్తు సంస్థ న్యాయవాది సేకరించిన వివరాలను వెల్లడించారు.

హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు కూడా ఇస్తుందా..?.. సీఆర్‌పీసీ 160 కింద వాంగ్మూలం ఇచ్చేందుకు సస్పెండ్‌ అయిన సీఐ ముందుగా అంగీకరించి.. కోర్టుకు వచ్చే సమయానికి తన అభిప్రాయం మార్చుకున్నాడని, ఆ తర్వాత అతనికి ప్రమోషన్‌, పోస్టింగ్‌ ఇచ్చారని సీబీఐ న్యాయవాది ధర్మాసనం ముందు తెలిపారు. ఆ తర్వాత ప్రతివాది అవినాష్‌ తరపు ఎవరైనా ఉన్నారా..? అని సీజేఐ ప్రశ్నంచగా.. సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ స్పందించారు. తెలంగాణ హైకోర్టు ఇలాంటి ఉత్తర్వులు కూడా ఇస్తుందా..? ఇదేమి ఆదేశం..? అంటూ.. రంజిత్‌ కుమార్‌ని సీజెఐ ప్రశ్నించారు. అందుకు.. తన వద్ద హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు తప్ప.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కాగితాలు లేవు అని, కొంత సమయం ఇవ్వాలని రంజిత్‌ కుమార్‌ న్యాయస్థానాన్ని కోరారు.

ఈనెల 24న తదుపరి విచారణ.. న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, సీబీఐ న్యాయవాది, రంజిత్‌ కుమారుల వాదనల విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. కేసును ఈనెల 24కి వాయిదా వేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అనంతరం హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ.. అవినాశ్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. చివరగా ఈనెల (ఏప్రిల్) 24 వరకు అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని జారీ చేసిన ఉత్తర్వుల్లో ధర్మాసనం పేర్కొంది. 24వ తేదీన (సోమవారం) కోర్టు.. ఒక గంట ముందుగానే ప్రారంభం అవుతుందని పేర్కొంది. రాజ్యాంగ ధర్మాసనం ఉన్నందున ఒక గంట ముందుగానే సీజేఐ ధర్మాసనం కార్యకాలాపాలు ప్రారంభం అవుతాయని, అందుకు తగిన విధంగా సిద్దంగా ఉండాలని న్యాయవాదులకు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సూచించారు.

ఇవీ చదవండి :

Last Updated :Apr 21, 2023, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.