ETV Bharat / bharat

'ఇదేం పిచ్చితనం.. బెయిల్​కు పోస్టుమార్టంతో సంబంధమేంటి?'

author img

By

Published : Apr 5, 2022, 7:45 AM IST

Supreme Court on Lakhimpur Case: లఖింపుర్​ఖేరీ కేసులో నిందితుడైన ఆశిష్​ మిశ్ర బెయిల్​ మంజూరు చేస్తూ అలహాబాద్​ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. బెయిల్‌ మంజూరుకు పోస్టుమార్టం నివేదిక, గాయాలు తదితర అంశాలను అలహాబాద్‌ హైకోర్టు ప్రాతిపదికగా తీసుకోవడాన్ని సీజేఐ జస్టిస్​ ఎన్‌.వి.రమణ తప్పుపట్టారు.

supreme court
సుప్రీంకోర్టు

Supreme Court on Lakhimpur Case: ఉత్తర్‌ప్రదేశ్‌ లఖింపుర్‌ఖేరీ హింస కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర తనయుడు ఆశిష్‌ మిశ్రకు బెయిల్‌ మంజూరు చేస్తూ అలహాబాద్‌ హైకోర్టు చెప్పిన కారణాలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే సమయంలో సర్వోన్నత న్యాయస్థానం నియమించిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ (సిట్‌) సూచనలను యూపీ ప్రభుత్వంపై పట్టించుకోకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటిస్తూ.. సోమవారం విచారణలో కొన్ని కీలక అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం తన అభిప్రాయాలను వ్యక్తపరిచింది. ముఖ్యంగా బెయిల్‌ మంజూరుకు పోస్టుమార్టం నివేదిక, గాయాలు తదితర అంశాలను అలహాబాద్‌ హైకోర్టు ప్రాతిపదికగా తీసుకోవడాన్ని సీజేఐ ఎన్‌.వి.రమణ తప్పుపట్టారు.

"ఇలాంటి పిచ్చితనాన్ని అంగీకరించం. ఈ పదాన్ని వాడుతున్నందుకు క్షమించాలి. కానీ.. బెయిల్‌ పరిశీలనకు ఈ విషయాలు ఏ మాత్రం అంగీకారయోగ్యమైనవి కావు. అతనికి తూటా తగిలింది. కారు ఢీకొట్టింది. బండిచక్రం, స్కూటర్‌ ఢీకొట్టింది. ఏమిటిదంతా" అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు ఆశిష్‌ ఎవరిపైనా కాల్పులు జరపలేదని, ఇందుకు పోస్టుమార్టం నివేదికే సాక్ష్యమని బెయిల్‌ ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొనడాన్ని సీజేఐ ధర్మాసనం తప్పుపట్టింది. విచారణలో తేలాల్సిన అంశాలను బెయిల్‌కు ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని పేర్కొంది. "పోస్టుమార్టం తదితర నివేదికల్లోకి న్యాయమూర్తి ఎందుకు వెళ్లారు. బెయిల్‌పై విచారణకు గాయాలు తదితర అంశాల ప్రస్తావన అనవసరం" అని సీజేఐతో పాటు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమకోహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఘటనపై దాఖలైన సుదీర్ఘ అభియోగపత్రాన్ని పట్టించుకోకుండా..కేవలం పోలీసుల ఎఫ్‌ఐఆర్‌పై ఆధారపడి నిందితుడికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు దుష్యంత్‌ దవే, ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.

పూర్తిస్థాయిలో భౌతిక విచారణ ప్రారంభం.. రెండేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం సుప్రీంకోర్టులో సోమవారం నుంచి పూర్తిస్థాయిలో భౌతిక విచారణ ప్రారంభమైన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ.. సహచర న్యాయమూర్తులతో కలిసి కోర్టు ప్రాంగణం అంతా తిరిగి న్యాయవాదులకు అభివాదం చేశారు. కోర్టు విధులు ప్రారంభం కావడానికి ముందు న్యాయమూర్తులతో కలిసి బృందంగా సర్వోన్నత న్యాయస్థానం నడవాలో నడిచివెళ్తూ న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపారు. 2020 మార్చి నుంచి సుప్రీంకోర్టు పూర్తిగా వర్చువల్‌ విధానంలోకి మారిపోయింది. 2021 అక్టోబరులో పాక్షికంగా మంగళ, బుధ, గురువారాల్లోని కేసులను మాత్రమే భౌతిక విచారణ చేయడం ప్రారంభించింది. సోమ, శుక్రవారాల్లో మాత్రం వీడియో కాన్ఫరెన్స్‌నే కొనసాగించింది. మధ్యలో ఒమిక్రాన్‌ విజృంభించడం వల్ల ఈ ఏడాది జనవరి 7నుంచి మళ్లీ పూర్తిస్థాయి వర్చువల్‌ విచారణకే మళ్లింది. చాలామంది న్యాయమూర్తులు, సిబ్బంది వైరస్‌ బారినపడిన నేపథ్యంలో న్యాయమూర్తులు తమ నివాసాల నుంచే కేసుల విచారణ మొదలుపెట్టారు. తర్వాత కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల ఫిబ్రవరి 14 నుంచి వారానికి రెండు రోజులు భౌతిక విచారణను పునఃప్రారంభించారు. ఇప్పుడు కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ సోమవారం నుంచి పూర్తిస్థాయిలో భౌతిక విచారణ ప్రారంభించనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గత వారం ప్రకటించారు.

ఇదీ చూడండి : పార్టీలకు విరాళాల వరద.. భాజపాకే అత్యధికం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.