ETV Bharat / bharat

సొంత సోదరిపైనే అత్యాచారయత్నం.. సోదరుడిని కొట్టి చంపిన మహిళ

author img

By

Published : Jun 6, 2023, 11:06 AM IST

Updated : Jun 6, 2023, 12:31 PM IST

అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన సోదరుడిని హతమార్చింది ఓ సోదరి. మద్యం మత్తులో దారుణం చేసేందుకు యత్నించగా.. ప్రతిఘటించి హత్యకు పాల్పడింది. గుజరాత్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు పుట్టిన రోజే ఓ యువకుడిని హత్య చేశారు అతడి స్నేహితులు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

sister-murdered-brother-in-gujarat-man-tried-to-rape-own-sister-and-murdered
సొంత సోదరిపై అత్యాచారం యత్నం

సొంత సోదరిపై అత్యాచారయత్నం చేశాడు ఓ సోదరుడు. మద్యం మత్తులో ఆమెపై ఈ దారుణానికి ప్రయత్నించాడు. దీనికి ప్రతిఘటించిన ఆ మహిళ.. సోదరుడిపై దాడి చేసింది. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. గుజరాత్​లోని ఖేడా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నదియాడ్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని మంజిపురా గ్రామానికి చెందిన సునీల్ పర్మార్​.. మద్యం మత్తులో సోదరిపై అత్యాచారయత్నం చేశాడు. దీనికి ప్రతిఘటించిన ఆమె.. సోదరుడు సునీల్ పర్మార్​పై దాడి చేసింది. అనంతరం స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. కాగా అప్పటికే సునీల్ పర్మార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

మృతుడి శరీరంపై గాయాలను గుర్తించిన వైద్యులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అక్కడికి వచ్చిన పోలీసులు.. ఘటనపై మృతుడి సోదరిని ఆరా తీశారు. సునీల్ పర్మార్ కిందపడి గాయాల పాలయ్యాడని.. ఆమె పోలీసులకు చెప్పింది. దీంతో ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. "మృతదేహాన్ని పరిశీలించగా.. దానిపై కర్రతో కొట్టిన గాయాలు, పదునైన ఆయుధంతో దాడి చేసిన గుర్తులు, ఇతర దెబ్బలు ఉన్నాయి. దీంతో అతడి మృతిపై అనుమానం పెరిగింది. దీంతో వివిధ కోణాల్లో దర్యాప్తు చేయగా.. మృతుడి సోదరే నిందితురాలిగా తేలింది. ఆమెను విచారించగా నేరాన్ని కూడా అంగీకరించింది." అని పోలీసులు తెలిపారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

"నేను వంట చేస్తుండగా.. నా సోదరుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అత్యాచారం చేయాలని చూశాడు. దీంతో నన్ను నేను రక్షించుకునేందుకు పక్కనే ఉన్న వస్తువుతో దాడి చేశాను. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు." అని బాధితురాలు తెలిపింది. ఆ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన లాభం లేకపోయింది.

పుట్టిన రోజే యువకుడి హత్య.. నిందితుల్లో ఇద్దరు మైనర్లు..
పుట్టిన రోజే ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు అతడి స్నేహితులు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబీర్​, షారుక్, నిషార్, మరో ఇద్దరు మైనర్లు స్నేహితులు. మే 31 సబీర్​ పుట్టిన రోజు. పుట్టిన రోజు సందర్భంగా వీరంతా కలిసి శివాజీ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని.. ఓ దాబాలో పార్టీ చేసుకున్నారు. అక్కడ మొత్తం రూ.10వేల బిల్​ అయింది. ఈ బిల్​ కట్టే విషయంలో ఈ ఐదుగురి స్నేహితుల మధ్య వాగ్వాదం జరిగింది. కాగా చివరకు సబీర్​.. బిల్ చెల్లించి సమస్యను పరిష్కరించాడు.

తమతో వాగ్వాదానికి దిగాడనే కోపంతో సబీర్​ను చంపాలని నిర్ణయించుకున్నారు మిగతా నలుగురు స్నేహితులు. కొంతసేపటి తరువాత మరో పార్టీ ఏర్పాటు చేసి.. దానికి సబీర్​ను ఆహ్వానించారు. అతడి చేత కేక్​ కట్​ చేయించి.. తినిపించారు. అనంతరం పదునైన ఆయుధాలతో సబీర్​పై దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ సబీర్​.. ప్రాణాలు కోల్పోయాడు.

ఘటన వెలుగులోకి వచ్చిన అనంతరం పోలీసుల ముందు లొంగిపోయారు ఇద్దరు మైనర్​​ నిందితులు. షారుక్, నిషార్​ మాత్రం గుజరాత్​లోని అహ్మదాబాద్​లో పట్టుబడ్డారు. నిందితులపై వివిధ సెక్షన్​ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు.

Last Updated : Jun 6, 2023, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.