2015లో రద్దు చేసిన సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66ఏ కింద ప్రజలపై ఇంకా కేసులు నమోదు చేయడంపై సుప్రీం కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నేరపూరితమైన మెసేజ్లు పోస్ట్ చేస్తే ఈ చట్టం కింద సదరు వ్యక్తికి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. అమలులోలేని ఓ చట్టం కింద కేసులు నమోదు చేయటాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం...రాజ్యంగవిరుద్ధమైన చర్యగా పేర్కొంది.
పీపుల్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ నారిమన్, జస్టిస్ కేఎమ్ జోసెఫ్, జస్టిస్ బీఆర్ గవాయితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసుల నమోదుపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై.. కేంద్రానికి నోటీసులు జారీ చేస్తామంటూ రెండు వారాల్లోగా వాటిపై స్పందించాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు సెక్షన్ 66Aను 2015 మార్చి 24నే రద్దు చేసింది. ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ.. శ్రేయ శింఘాల్ అనే న్యాయ విద్యార్థిని సుప్రీం కోర్టలో వ్యాజ్యం దాఖలు చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మృతి చెందిన సమయంలో ముంబయి నగరంలో కర్ఫ్యూ విధించడంపై ఇద్దరు యువతులు ఆన్లైన్లో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.