ETV Bharat / bharat

కునో పార్కులో మరో చీతా మరణం.. నెలరోజుల వ్యవధిలోనే రెండోది

author img

By

Published : Apr 23, 2023, 9:57 PM IST

Updated : Apr 23, 2023, 11:00 PM IST

దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్న చీతాల్లోని ఓ మగ చీతా అనారోగ్యం కారణంగా ఆదివారం మరణించింది. ఈ మరణాన్ని కునో నేషనల్​ పార్క్​ అధికారులు ధ్రువీకరించారు.

MP kuno male cheetah uday died latest news
కునో జాతీయ పార్కులో మరో చీతా మరణం

ఆపరేషన్​ టైగర్​లో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకున్న చీతాల గుంపులో మరొకటి మరణించింది. 'ఉదయ్' అనే 6 సంవత్సరాల వయసున్న మగ చీతా ఆదివారం చనిపోయిందని మధ్యప్రదేశ్​లోని కునో నేషనల్​ పార్క్​ అధికారులు వెల్లడించారు. మరణించిన చీతా అస్వస్థతకు గురైందని.. చికిత్స పొందుతూ మృతి చెందిందని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ ధ్రువీకరించారు. చీతా మరణానికి గల కారణం ఇంకా తెలియలేదని ఆయన అన్నారు. అంతకుముందు మార్చి 27న కూడా నమీబీయా నుంచి తీసుకొచ్చిన సాషా అనే చీతా కిడ్నీ వ్యాధి కారణంగా ఇదే పార్క్​లో ప్రాణాలు విడిచింది. కాగా, నెల రోజుల వ్యవధిలోనే మరో చీతా మరణించడం గమనార్హం. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇప్పటివరకు 20 చీతాలను దిగుమతి చేసుకుంది.

"ఉదయం తనిఖీ సమయంలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతా తల కిందపడి కనిపించింది. దీంతో ఎన్‌క్లోజర్ నుంచి దాన్ని బయటకు తీసి పశువైద్యులతో చికిత్స అందించాము. దురదృష్టవశాత్తు సాయంత్రం 4 గంటల సమయంలో అది మరణించింది."

- జేఎస్ చౌహాన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్​ ఆఫ్ ఫారెస్ట్

7 దశాబ్దాల తర్వాత..
భూమి మీద అత్యంతవేగంగా పరిగెత్తే జంతువు చీతా. వీటి జాతి భారత్‌లో 74ఏళ్ల క్రితమే అంతరించిపోయాయి. 1947లో ఛత్తీస్‌గఢ్​లో దేశంలోని చివరి చీతా చనిపోయింది. దీంతో 1952లో చీతాలు పూర్తిగా అంతరించిపోయినట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశంలో చిరుతల సంఖ్యను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం విదేశాల నుంచి చీతాలను పలు దఫాలుగా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే మొదటి విడత కింద గతేడాది సెప్టెంబర్​లో ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా.. నమీబియా నుంచి 8 చీతాలను భారత్ దిగుమతి చేసుకుంది. వీటిలో ఐదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చి మధ్యప్రదేశ్​లోని కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. వీటిని నిరంతరం పర్యవేక్షించడానికి రేడియో కాలర్లు అమర్చారు. రానున్న రోజుల్లో మరిన్ని చీతాలు భారత్‌కు రానున్నాయని అధికారులు తెలిపారు. వీటిలో 7 మగ, 5 ఆడ చిరుతలు ఉన్నాయని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్​ యాదవ్​ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆడ చీతాల సంక్రమణతో దేశంలో వీటి సంఖ్య పెరుగుతుండటం వల్ల సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది.

Last Updated : Apr 23, 2023, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.